Headache | వేసవి వేడి రోజురోజుకీ పెరుగుతున్న కొద్దీ మైగ్రేన్ సమస్యతో బాధపడేవారిలో తలనొప్పి ఎక్కువవుతోంది. అధిక ఉష్ణోగ్రతలు, డీహైడ్రేషన్, ఎండలో ఎక్కువసేపు తిరగడం, నిద్రలేమి వంటి కారణాలు మైగ్రేన్ను మరింత తీవ్రమయ్యేలా చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. అయితే కొన్ని సాధారణ జీవనశైలి మార్పులు, ఆహారపు అలవాట్లలో జాగ్రత్తలు పాటించడం ద్వారా మైగ్రేన్ దాడులను కొంతవరకు నియంత్రించవచ్చని సూచిస్తున్నారు. వేసవిలో మైగ్రేన్కు ప్రధాన కారణాలుగా భోజనం మానేయడం, సరైన నిద్ర లేకపోవడం, అధిక ఒత్తిడి, రాత్రివేళల్లో ఎక్కువసేపు మొబైల్ లేదా కంప్యూటర్ స్క్రీన్ చూడడం, ఎండలో ప్రయాణాలు చేయడం, ప్రాసెస్డ్, జంక్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం వంటి అంశాలు ఉంటున్నాయి. కొంతమందిలో చాక్లెట్, చీజ్ వంటి ఆహారాలు కూడా ట్రిగ్గర్గా పనిచేస్తాయని చెబుతున్నారు.
మైగ్రేన్ బాధితులు భోజన సమయాలను కచ్చితంగా పాటించడం చాలా ముఖ్యం. అల్పాహారం, మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనం ఒకే సమయాల్లో తీసుకోవడం మంచిది. భోజనం మానేయడం వల్ల తలనొప్పి ముదిరే అవకాశముంటుంది. శరీరంలో నీటి లోపం లేకుండా చూసుకోవడం కూడా అత్యంత అవసరం. రోజుకు కనీసం రెండు నుంచి మూడు లీటర్ల నీరు తాగాలి. గుండె లేదా కిడ్నీ సమస్యలు ఉన్నవారు వైద్యుల సలహా మేరకు నీటి పరిమాణాన్ని నిర్ణయించుకోవాలి. ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారం మైగ్రేన్ నియంత్రణలో సహాయపడుతుంది. టోఫు, పనీర్, క్వినోవా, బాదం, పప్పులు, గుడ్లు, శనగలు, గ్రీక్ యోగర్ట్ వంటి పదార్థాలను ఆహారంలో చేర్చాలి. సాచ్యురేటెడ్, ట్రాన్స్ ఫ్యాట్స్ అధికంగా ఉండే ప్రాసెస్డ్, ప్యాకేజ్డ్, డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ను తగ్గించడం మంచిది. ఇవి మైగ్రేన్ దాడులను పెంచే అవకాశం ఉంటుంది.
ఖాళీ కడుపుతో టీ లేదా కాఫీ తాగకూడదు. వీలైతే వాటి బదులుగా కొబ్బరి నీళ్లు తీసుకోవడం వల్ల శరీరానికి హైడ్రేషన్ లభిస్తుంది. రోజూ ఆరు నుంచి పది గుమ్మడి గింజలు తీసుకోవడం వల్ల కొంత ప్రయోజనం ఉంటుంది. అలాగే రోజుకు సుమారు 400 గ్రాముల పండ్లు, కూరగాయలు తీసుకోవడం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. పండ్ల రసాల కంటే పూర్తి పండ్లనే తినడం మంచిది. అదనంగా చక్కెర కలిపిన శీతల పానీయాలు, ఎనర్జీ డ్రింక్స్, మద్యం వంటి వాటిని దూరంగా ఉంచాలి. అధిక చక్కెర కూడా మైగ్రేన్కు కారణమవుతుంది, అందుకే చాక్లెట్, చీజ్ వంటి పదార్థాలను పరిమితంగా తీసుకోవాలి.
ఆహారంతో పాటు వ్యాయామం కూడా మైగ్రేన్ నియంత్రణలో కీలక పాత్ర పోషిస్తుంది. నడక, జాగింగ్, స్విమ్మింగ్, డ్యాన్స్, జుంబా వంటి శారీరక చలనం ఉన్న కార్యకలాపాలు ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే కాకుండా మైగ్రేన్ లక్షణాలను తగ్గించడంలో సహాయపడతాయి. కొన్ని హెచ్చరిక సంకేతాలను మాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. తలనొప్పితో పాటు చూపు సమస్యలు, జ్వరం, మెడ బిగుసుకుపోవడం, కొత్తగా ప్రారంభమైన తీవ్రమైన తలనొప్పి, నడవడంలో ఇబ్బంది, తల తిరగడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే న్యూరాలజిస్ట్ను సంప్రదించాలి. అలాగే వారానికి రెండు సార్లకు మించి తలనొప్పి వస్తే వైద్య పరీక్షలు చేయించుకోవడం అవసరం.