‘అమ్మ..’ అన్న పిలుపే అమృతం. కానీ, మనదేశంలో ఎంతోమంది మహిళలకు ‘మాతృత్వం’ అందని పండు అవుతున్నది. ఐయూఐ, ఐవీఎఫ్, ఐసీఎస్ఐ లాంటి ఆధునిక కృత్రిమ గర్భధారణ పద్ధతులు అందుబాటులోకి వచ్చినా.. అమ్మతనం కలగానే మిగులుతున్నది. అలాంటివారికి ప్రాచీన ఆయుర్వేద విధానం ఉత్తమ పరిష్కారం చూపుతున్నది. అల్లోపతితో పోలిస్తే.. ఆయుర్వేద చికిత్స చవకైనది. దుష్ప్రభావాలూ ఉండవు.
మనదేశంలో దాదాపు 50 శాతం యువతులు పెండ్లయిన మొదటి మూడు నెలల్లోనే గర్భం ధరిస్తున్నారు. తొలి ఏడాదిలోనే మాతృత్వాన్ని ఆస్వాదిస్తున్నారు. 10 నుంచి 15 శాతం మందికి రెండేండ్లు పడుతుండగా, 15 నుంచి 20 శాతం మంది మూడేండ్లలో పండంటి బిడ్డకు జన్మనిస్తున్నారు. ఒక్క 10 నుంచి 15 శాతం మంది మాత్రం.. సంతానలేమితో బాధపడుతున్నారు. సరైన వయసులో వివాహమైనా, దాంపత్య జీవనం సజావుగా సాగుతున్నా.. రెండేండ్లు పూర్తయ్యాక కూడా పిల్లలు కలగకపోవడాన్నే ‘సంతానలేమి’ (ఇన్ఫర్టిలిటీ) అంటారు. వాతావరణ కాలుష్యం, రసాయనాలతో కూడిన ఆహారం. వృత్తిపరమైన ఒత్తిళ్లు, ఆలస్యం అవుతున్న వివాహాలు.. సంతానలేమికి కారణాలే అయినా.. ప్రధానంగా మహిళలతోపాటు పురుషులకు సంబంధించిన శారీరక సమస్యలు సంతాన సాఫల్యతపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. వాటిలోనూ మహిళలకు సంబంధించిన పరిమితులే అధికం. స్త్రీలలో సంతానలేమికి అనేక కారణాలు. వాటిలో ప్రధానమైనవి..
1. పాలిసిస్టిక్ ఓవరీ డిసీజ్ (పీసీఓడీ)
దీన్ని అండాశయంలో నీటి బుడగలు అని కూడా అంటారు. ఆండ్రోజెన్స్ ఎక్కువగా విడుదల కావడం వల్ల ఈ సమస్య తలెత్తుతుంది. దీనివల్ల అండాశయం నుంచి ప్రతినెలా విడుదల కావలసిన అండం.. విడుదల కాదు. దీంతో రుతుక్రమం క్రమం తప్పుతుంది. వచ్చినా రుతుస్రావం చాలా తక్కువ మోతాదులో ఉంటుంది. అంతేకాకుండా, ఈ సమస్య వల్ల స్థూలకాయం బారిన పడతారు. ఈ లక్షణాలన్నీ కలిసి మహిళలలో పిల్లలు పుట్టే అవకాశాన్ని తగ్గిస్తాయి.
2. ట్యూబల్ బ్లాకేజ్
అండాశయాల నుంచి విడుదలయ్యే అండాలను గర్భాశయం వైపు చేరవేసే పని ఫెలోపియన్ ట్యూబ్స్దే. ఈ ట్యూబ్లలో ఆటంకాలు ఏర్పడితే మహిళల్లో నెలనెలా అండం సక్రమంగా విడుదలైనా, గర్భం వచ్చే అవకాశం తగ్గుతుంది. అంతే కాకుండా, శుక్రకణం అండంతో కలిసి ఫలదీకరణ జరగాల్సింది కూడా ట్యూబుల్లోనే! ఈ ట్యూబల్ బ్లాక్స్కు ప్రధాన కారణం.. గర్భాశయానికి క్షయ (టీబీ) వ్యాధి సోకడమే!
3. ఎండోమెట్రియోసిస్
గర్భాశయం లోపలి పొరల్లో ఉండే కణజాలం.. గర్భాశయం వెలుపల ఏర్పడటమే.. ఎండోమెట్రియోసిస్. అండాశయాలు, ట్యూబులు ఎక్కువగా ఈ వ్యాధికి గురవుతాయి. ఈ సమస్యకు చికిత్స తీసుకోవాలంటే ఎక్కువకాలమే పడుతుంది. వ్యాధి తీవ్రతను బట్టి చికిత్సా క్రమాన్ని నిర్ణయించాల్సి ఉంటుంది. వీటితోపాటు స్థూలకాయం (ఒబేసిటీ), థైరాయిడ్ హార్మోన్ లోపం, గర్భాశయ, గర్భాశయ అనుబంధ భాగాలకు ఇన్ఫెక్షన్లు (పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్), గర్భాశయంలో నీరు చేరడం (హైడ్రోసాలపింగ్స్),
గర్భాశయ ముఖద్వార ఇన్ఫెక్షన్లు
(సర్విసైటిస్), నెలసరి సమస్యలు వంటివి కూడా సంతానలేమికి కారణం అవుతాయి. కొన్ని సందర్భాల్లో.. దంపతులిద్దరిలో ఎలాంటి ఆరోగ్య సమస్యా లేనప్పుడు కూడా సంతాన భాగ్యం కలుగకపోవచ్చు. దీన్నే ‘అన్నోన్ ఇన్ఫెర్టిలిటీ’ అంటారు. అలాంటివారికి దాంపత్య జీవనం పట్ల శాస్త్రీయమైన అవగాహన కల్పిస్తే సమస్య పరిష్కారం అవుతుంది.
గర్భధారణ- ప్రధాన అంశాలు
ఆయుర్వేదం ప్రకారం.. గర్భం ధరించడానికి ప్రధానంగా రుతువు, క్షేత్రం, అంబు, బీజం, త్రిదోషాల వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు.
రుతువు: అండాశయం నుంచి అండం విడుదల అయ్యేందుకు అనువైన కాలాన్ని రుతుకాలం అంటారు. దాన్నే ‘ఓవ్యులేషన్ పీరియడ్’గా చెబుతారు. సాధారణంగా మహిళకు నెలసరి మొదలైన 12వ రోజు నుంచి 16వ రోజు వరకు రుతుకాలంగా పరిగణిస్తారు. ఈ వ్యవధిలో ఎప్పుడైనా అండం విడుదల కావచ్చు. ఆ సమయంలో అండం విడుదల కావాలంటే..అండాశయం ఆరోగ్యంగా ఉండాలి.
క్షేత్రం: ఇది భూమికి పర్యాయపదం. ఆయుర్వేదం గర్భాశయాన్ని ‘క్షేత్రం’గా అభివర్ణిస్తుంది. అందుకే గర్భం ధరించడానికి గర్భాశయం, గర్భాశయానికి సంబంధించిన ఇతర భాగాలు ఆరోగ్యంగా ఉండాలి. అండాశయం నుంచి ఎలాంటి ఆటంకాలు లేకుండా అండం విడుదలైనా, వీర్య కణంతో కలిసి ఫలదీకరణ చెందిన తర్వాత గర్భాశయ గోడలను ఆధారం చేసుకుని పిండం ఎదగాల్సి ఉంటుంది. కొన్నిసార్లు గర్భాశయ మార్గాలను అడ్డుకునే కొన్ని వ్యాధుల కారణంగా శుక్ర కణాలు అండాన్ని చేరలేవు. విత్తనం మొలకెత్తాలంటే భూమి సారవంతంగా ఉండాలి.. గర్భం దాల్చాలంటే గర్భాశయమూ ఆరోగ్యంగా ఉండాలి.
అంబు: గర్భపోషణకు సాయపడే పోషకాంశ రసాన్ని, గర్భధారణకు ఉపయోగపడే హార్మోన్లను ‘అంబు’ అని అభివర్ణిస్తుంది ఆయుర్వేదం. ఈ హార్మోన్లలో సమతౌల్యత లోపించినపుడు కూడా గర్భం రాదు. సంతానలేమికి శుక్రధాతువు లోపాలు ప్రధాన కారణం. శరీరధాతు పరిణామక్రమంలో చివరిగా ఏర్పడే శుక్రధాతువును స్త్రీలలో ‘అండం’ గానూ, పురుషుల్లో ‘వీర్యం’ గానూ పరిగణిస్తారు.
బీజం: ఆయుర్వేదంలో స్త్రీలలో అండాన్ని, పురుషుల్లో వీర్యాన్ని ‘బీజం’ అనే పదంతో సూచిస్తారు. అండం పరిమాణం, శక్తి.. శుక్రకణంలోని కదలగలిగే సామర్థ్యం, నాణ్యత మీద గర్భ ధారణ ఆధారపడి ఉంటుంది.
త్రిదోషాలు: శరీరంలోని సర్వక్రియలకు ఆలంబనగా ఉండే త్రిదోషాలను కూడా సంతానలేమి విషయంలో పరిగణనలోకి తీసుకోవాలి. వాతం, పిత్తం, కఫం.. వీటిని త్రిదోషాలు అంటారు. శుక్రకణం, అండం విడుదల, గర్భ నిర్మాణం, ప్రసవం వీటిని వాతదోషం కృత్యాలుగా పేర్కొంటారు. ఈ వాతకృత్యాలను నాడీ
వ్యవస్థ చర్యలతో సరిపోల్చవచ్చు. అందుకే వాతదోషానికి సంబంధించిన లోపాలున్నా కూడా గర్భధారణకు నోచుకోకపోవచ్చు.
ఆయుర్వేదంతో అద్భుతం..
సంతానం కోసం ఎక్కువగా ఐయూఐ, ఐవీఎఫ్, ఐసీఎస్ఐ వంటి కృత్రిమ గర్భధారణ పద్ధతులను ఆశ్రయిస్తున్నారు. అయితే, ఈ అత్యాధునిక పద్ధతుల్లో విఫలం అయినవారు సైతం ‘ఆయుర్వేదం’ ద్వారా ఉత్తమ ఫలితాలు పొందుతున్నారు. వివిధ చికిత్స పద్ధతుల ద్వారా సంతానవంతులు అవుతున్నారు. సాధారణంగా మహిళల్లో సంతానలేమికి కారణాన్ని బట్టి, ఆయుర్వేద చికిత్సలు అందించాల్సి ఉంటుంది. నోటిద్వారా మింగే మందులతోపాటు, అవసరాన్ని బట్టి ప్రత్యేక ఆయుర్వేద చికిత్సా పద్ధతులైన ఉత్తరవస్థి, యోనిపిచు, యోని పూరణం, యోని ప్రక్షాళన, మాత్రావస్థి, శిరోధార, రసాయన చికిత్సలు చేయాల్సి ఉంటుంది.
గర్భధారణకు సరైన శరీర పోషణ ఎంత
అవసరమో, శరీరంలో విషమించిన దోషాలను సమాన స్థితిలో ఉంచడం కూడా అంతే అవసరం. ఈ చికిత్సల్లో భాగంగా ఆహార విధానంలో అనేక మార్పులు సూచిస్తారు. నోటి ద్వారా ప్రత్యేక ఔషధాలు ప్రయోగిస్తారు. మంచి జీవనశైలి కూడా చికిత్సలో ప్రధాన భాగమే. దీనిలో పాలు, నెయ్యి, తేనె, త్రిఫలాలు, అశ్వగంధ, అతిమధురం, తిప్పతీగ, స్వర్ణభస్మం, రజతభస్మం వంటివి ప్రధానంగా వాడతారు.
మాత్రావస్థి: వాతదోషం వల్ల వచ్చే వ్యాధులకు చేసే చికిత్స మాత్రావస్థి. ఈ చికిత్సలో విలువైన ఔషధాలతో చేసిన తైలాలను ప్రత్యేక నాళం సాయంతో మలద్వారం నుంచి మలాశయంలోకి పంపుతారు. ఈ ప్రక్రియను 14 నుంచి 21 రోజుల వరకు చేయాల్సి ఉంటుంది.
ఉత్తరవస్థి: గర్భాశయ నాళాల్లో అవరోధాలు తొలగించడానికి, క్షీణించిన గర్భవాహికలను యథా స్థితికి తీసుకురావడానికి చేసే చికిత్స ఉత్తరవస్థి. ప్రత్యేక పద్ధతుల్లో తయారుచేసిన ఔషధ సిద్ధ తైలాలను యోని గుండా గర్భాశయం లోపలి ముఖద్వారం వరకు ఇంజెక్ట్ చేస్తారు.
యోనిపిచు: సంతానలేమికి దాదాపు 50 శాతం అండంలో లోపాలే కారణం. అండం విడుదల కాకపోవడానికి అండాశయంలో నీటి బుడగలు (పీసీఓడీ), అండాశయ కణుతులు ప్రధాన కారణాలు. ఈ సమస్యను నివారించేందుకు అవసరమైన చికిత్సను నెలసరి అయిన 5వ రోజు నుంచి వరుసగా 7 రోజులు చేయాల్సి ఉంటుంది. ఇందులో ఔషధ సిద్ధతైలాలలో ముంచిన దూది (యోనిపిచు)ని యోనిలోపల 2 గంటలపాటు ఉంచి తీసేస్తారు.
యోని ప్రక్షాళన: చాలామంది మహిళల్లో గర్భం రాకపోవడానికి యోని మార్గంలో ఉండే ఫంగల్, బ్యాక్టీరియల్, ప్రోటోజొవల్ ఇన్ఫెక్షన్లు ప్రధాన కారణం. ఈ సమస్యలకు విరుగుడుగా యోని ప్రక్షాళన చికిత్స చేస్తారు. ఇందుకోసం కాచిన కషాయాలను ఔషధంగా ఉపయోగిస్తారు.
పుంసవన కర్మ: తరచూ గర్భస్రావం అయ్యేవారికి ‘పుంసవన కర్మ’ చికిత్స అందిస్తారు. ఇందులో నాసికా రంధ్రం ద్వారా ఔషధాన్ని బిందువుల రూపంలో ప్రయోగిస్తారు.
శిరోధార: మానసిక ఒత్తిడి, ఆందోళనకు గురయ్యే వారిలో హార్మోన్ల విడుదలలో తేడా వస్తుంది. దాంతో నెలసరి క్రమంలో ఇబ్బందులు వస్తాయి. దీన్ని సరిదిద్దడానికి ‘శిరోధార’ చికిత్స అత్యుత్తమ మార్గం. ఇందులో ఔషధ సిద్ధ తైలాలను, తక్రాన్ని ఉపయోగించి శిరస్సుపై ఒక ధారలా ప్రయోగిస్తారు. సంతానలేమికి తగిన కారణాలను తెలుసుకుని దానికి అనుగుణంగా, శరీర ప్రకృతులైన వాత ప్రకృతి, పిత్త ప్రకృతి, కఫ ప్రకృతి
అనుసారంగా ఔషధాలను నిర్దేశిస్తారు. మాతృత్వం ప్రతి మహిళ సహజ హక్కు. ఆయుర్వేద వైద్యం ఆ దిశగా తనవంతు భరోసా కల్పిస్తుంది.
పంచకర్మలు
కృత్రిమ గర్భధారణ పద్ధతుల ద్వారా సంతానం లభించనివారికి ‘పంచకర్మలు’ సమర్థంగా పనిచేస్తాయి. శరీరాన్ని సంపూర్ణంగా శుద్ధి చేసే ప్రక్రియలే ఈ ‘పంచకర్మలు’. ఇందులో ఔషధాన్ని నోటిద్వారా ఇచ్చి, వాంతుల రూపంలో దోషాలను బయటికి పంపే క్రియను ‘వమనం’ అంటారు. కడుపులో పేరుకుపోయిన దోషాలను విరేచనాల రూపంలో బయటికి పంపే క్రియ.. ‘విరేచనం’. ఔషధాన్ని కషాయం రూపంలో చేసి మలద్వారం గుండా ప్రయోగించే ‘ఎనిమా’ లాంటి చికిత్సా పద్ధతిని ‘కషాయస్తి’గా, ఔషధాలను తైలాల రూపంలో మలద్వారం నుంచి పంపే ప్రక్రియను ‘తైలవస్థి’గా వ్యవహరిస్తారు. ఇక ఔషధాన్ని తైల ప్రధానంగా బిందువుల రూపంలో నాసిక మార్గంలో ప్రయోగించే విధానాన్ని ‘నస్యకర్మ’ అంటారు. గర్భధారణకు సంబంధించిన ఎలాంటి సమస్యకైనా చికిత్స పూర్తయ్యేందుకు ఆరు నెలలు లేదా అంతకుమించిన సమయం పడుతుంది. ఆయుర్వేదం అనగానే వేడి చేస్తుందనో, పడకపోతుందనో, కఠినమైన పథ్యం పాటించాలనో అనుకోవడం.. పూర్తిగా అపోహే! అయితే, అర్హత కలిగిన ఆయుర్వేద వైద్యుల ఆధ్వర్యంలోనే, సంతానలేమికి సరైన చికిత్స చేయించుకోవాలి.
ప్రొఫెసర్ డా. యశోద పెనుబాల
ప్రసూతి & స్త్రీల వైద్య నిపుణులు
డా.బూర్గుల రామకృష్ణారావు ఆయుర్వేద వైద్య కళాశాల, హైదరాబాద్