Dry Throat | శీతాకాలం ముగిసి ఉష్ణోగ్రతలు పెరగడం ప్రారంభమైనప్పుడు, చాలా మందిలో ఒక సాధారణ సమస్య కనిపిస్తుంది. చాలా మందికి ఉదయం లేవగానే గొంతు ఎండిపోయినట్టు, గరుకుగా లేదా గొంతు బిగుసుకున్నట్టు అనిపిస్తుంది. వసంత కాలం పూలతో అందంగా ఉన్నప్పటికీ, అదే సమయంలో గాలిలో పుప్పొడి స్థాయిలు పెరుగుతాయి, వాతావరణ మార్పులు వేగంగా జరుగుతాయి. ఈ మార్పులు శ్వాసకోశ మార్గానికి చికాకును కలిగించి గొంతు అసౌకర్యానికి కారణమవుతాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అలర్జీ సంబంధిత శ్వాస సమస్యలతో బాధపడుతున్నారు. భారతదేశంలో వసంత కాలంలో చెట్లు, గడ్డి నుంచి వచ్చే పాలెన్, ధూళి, కాలుష్యం, తేమ మార్పులన్ని కూడా గొంతు, శ్వాసనాళాలపై ప్రభావం చూపుతాయి.
అలాగే వసంతకాలంలో గొంతు ఎండిపోయినట్టు, పొడిగా అనిపించడానికి అనేక కారణాలు ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. వసంత కాలంలో మొక్కలు పెద్ద మొత్తంలో పుప్పొడిని విడుదల చేస్తాయి. ఈ చిన్న కణాలు శ్వాసలోకి వెళ్లినప్పుడు శరీరం హిస్టమిన్స్ ను విడుదల చేస్తుంది. దీంతో ముక్కు, గొంతులో వాపు వస్తుంది. దీని వల్ల గొంతు ఎండిపోవడం, దురద, దగ్గు, గొంతు గరుకుగా మారడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. గొంతులో చికాకుకు మరో సాధారణ కారణం పోస్ట్-నాసల్ డ్రిప్. ఈ పరిస్థితిలో మ్యూకస్ గొంతు వెనుక భాగంలో చేరుతుంది. ఇది నిరంతరం గొంతులోకి జారుతుంది. దీంతో నిరంతరం చికాకు, దగ్గు, గొంతు సవరించడం, గొంతు గరగర వంటి లక్షణాలు ప్రేరేపించబడతాయి. అలాగే వసంత కాలంలో ఉష్ణోగ్రతలు మారుతుంటాయి. పొడి గాలులు, ధూళి పెరుగుతాయి. కాలుష్యం ఎక్కువ అవుతుంది. ఇవి గొంతు ఎండిపోవడానికి కారణమవుతాయి. వీటితో పాటు ఇండోర్ వాతావరణాలు కూడా ఈ సమస్యకు దోహదం చేస్తాయి. AC గదుల్లో తేమ తగ్గిపోవడం వల్ల గొంతు, ముక్కు ఎండిపోతాయి. ఇంట్లోని పొడి గాలి శ్వాసకోశ మార్గానికి చికాకును కలిగించి అలెర్జీలు ఉన్న వారిలో లక్షణాలు మరింత తీవ్రతరం అవుతాయి.
పొడిగొంతు సమస్యతో బాధపడే వారికి ఉపశమనం కలిగించే కొన్ని సులభమైన నివారణలను కూడా వైద్యులు సూచిస్తున్నారు. రోజంతా ఎక్కువ నీరు తాగాలి. నీరు తాగడం వల్ల గొంతు తడిగా ఉండి శ్లేష్మం పలుచన అవ్వడానికి సహాయపడుతుంది. వేడి ద్రవాలు కూడా ఉపశమనాన్ని కలిగిస్తాయి. హెర్బల్ టీ, సూప్, తేనె కలిపిన గోరువెచ్చని నీరు వంటి ద్రవాలు చికాకును తగ్గిస్తాయి. ఇవి గొంతును సాంత్వనపరుస్తాయి. అలాగే ఉప్పునీటితో గార్గిల్ చేయడం కూడా మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఇలా చేయడం వల్ల గొంతులో వాపుతో పాటు చికాకు కూడా తగ్గుతుంది. వీటితో పాటు హ్యూమిడిఫైయర్ వాడడం అలవాటు చేసుకోవాలి. దీనిని వాడడం వల్ల గదిలో తేమ పెరుగుతుంది. శ్వాస తీసుకోవడం సులభం అవుతుంది. ఇవే కాకుండా అలర్జీ కారకాలకు గురి కావడాన్ని కూడా తగ్గించుకోవాలి. పుప్పొడి ఎక్కువగా ఉన్న రోజుల్లో కిటికీలు మూసి ఉంచుకోవాలి. బయట నుంచి వచ్చాక స్నానం చేయాలి. అవసరమైతే ఎయిర్ ప్యూరిఫైయర్ ను వాడాలి. అలాగే చికాకు కలిగించే వాటిని నివారించాలి. పొగ త్రాగడం, ఎక్కువగా కాఫీ తాగడం మానుకోవాలి.
అలెర్జీ లేదా సీజనల్ పొడిదనం వల్ల వచ్చే గొంతు సమస్యలు కొన్ని రోజుల్లో లేదా వారాల్లో తగ్గిపోతాయి. అయితే లక్షణాలు తగ్గకుండా ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. గొంతులో చికాకు 2 వారాలకంటే ఎక్కువ కొనసాగడం, జ్వరం, తీవ్రమైన నొప్పి ఉంటే లేదా మింగడం కష్టంగా ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. వసంత కాలంలో గొంతు ఎండిపోవడం సాధారణమే. ఇది ఎక్కువగా పుప్పొడి అలర్జీలు, పోస్ట్-నాసల్ డ్రిప్, కాలుష్యం, పొడి గాలి వల్ల వస్తుంది. అయితే సరైన జాగ్రత్తలు తీసుకుంటే ఈ సమస్యను సులభంగా నియంత్రించవచ్చునని, కొద్దిపాటి జాగ్రత్తలతో వసంత కాలాన్ని ఆరోగ్యంగా ఆనందించవచ్చునని వైద్యులు చెబుతున్నారు.