Health Tips : ఆనందంగా, ఆరోగ్యంగా దీర్ఘకాలం జీవించాలని మనలో కోరుకోని వారుండరు. చీకూ చింతా లేకుండా వ్యాధుల బారినపడకుండా ఉల్లాసంగా బతికేందుకు ఏం చేయాలో ప్రముఖ వైద్య, పోషకాహార నిపుణులు డాక్టర్ మైఖేల్ గ్రెగర్ కీలక విషయాలతో ముందుకొచ్చారు. మూడు అంశాలు పాటిస్తే ఎక్కువకాలం ఆరోగ్యంగా ఉండవచ్చని సీడీసీ ఆధ్వర్యంలో ఆరేండ్ల పాటు సాగిన అధ్యయనంలో వెల్లడైందని ఆయన చెప్పుకొచ్చారు. ఈ మూడు సులభమైన అలవాట్లు, ప్రవర్తన మార్పులతో అధ్యయన కాలంలో ప్రజల మరణాల ముప్పు 82 శాతం తగ్గిందని అమెరికన్ కాలేజ్ ఆఫ్ లైఫ్స్టైల్ మెడిసిన్ వ్యవస్ధాపక సభ్యుడు కూడా అయిన డాక్టర్ గ్రెగర్ వెల్లడించారు.
మనం తీసుకునే ఆహారమే మన ఆరోగ్యానికి మూలం. అనారోగ్యకర ఆహారపు అలవాట్లు వ్యాధులబారిన పడేలా చేస్తాయి. యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే ఆహారంతో వ్యాధులు, వయోసంబంధ సమస్యలకు చెక్ పెట్టవచ్చు. జంతు సంబంధ ఆహారంతో పోలిస్తే ప్లాంట్ ఆధారిత ఆహారంలో64 రెట్లు అధికంగా యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయని పరిశోధకులు చెబుతున్నారు. యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండే కూరగాయలు, రకరకాల పండ్లు, ఔషధ గుణాలు కలిగిన మసాలా దినుసులు తరచూ తీసుకోవడం ద్వారా తీవ్ర అనారోగ్యాల బారినపడే ముప్పుతో పాటు వయో సంబంధ వ్యాధుల ముప్పు తగ్గి దీర్ఘకాలం ఆరోగ్యంగా ఉంటారని డాక్టర్ గ్రెగర్ చెబుతున్నారు. ప్రాసెస్డ్ ఆహారాన్ని పక్కనపెట్టి వీట్ పాస్తా, ఆలు, బ్రౌన్ రైస్, బీన్స్, టమాట, తృణధాన్యాలు అధికంగా తీసుకోవాలని హౌ నాట్ టు డై..హౌ నాట్ టూ డైట్ అనే పుస్తకంలో ఆయన రాసుకొచ్చారు.
ఆరోగ్యానికి పొగతాగడం ఎంత ప్రమాదకరమో పలు అధ్యయనాలు వెల్లడించాయి. పండ్లు, కూరగాయలతో పాటు స్మోకింగ్కు దూరం కావడం వల్ల మన డీఎన్ఏను కాపాడే క్రోమోజోముల చివరన ఉండే టెలిమోర్స్ పదికాలాల పాటు పదిలంగా ఉంటాయని డాక్టర్ గ్రెగర్ చెబుతారు. మనం పుట్టిన తర్వాత ఎదుగుతున్న కొద్దీ టెలిమోర్స్ కుచించుకుపోతుంటాయి. ఇవి ఎంతదెబ్బతింటే మనం మృత్యువుకు అంతగా చేరువవుతున్నట్టు లెక్క. రిఫైన్డ్ గ్రెయిన్స్, సోడా, మాంసం, డెయిరీ వంటి ఆహారపదార్ధాలతో ఇవి వేగంగా హరించుకుపోతాయి. అయితే పండ్లు, కూరగాయలు ఇతర యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండే ప్లాంట్ ఫుడ్ ద్వారా టెలిమోర్స్ను దీర్ఘకాలం కాపాడుకోవచ్చు. పొగతాగే పురుషులు, మహిళల్లో టెలిమోర్స్ పొట్టిగా ఉన్నట్టు గుర్తించారు.
కరోనా మహమ్మారితో లాక్డౌన్లు విధించడం వర్క్ ఫ్రం హోంతో ఉద్యోగులు సతమతమవుతున్న పరిస్ధితుల్లో ప్రయాణాలు తగ్గి ఎక్కువసేపు కూర్చుని ఉండాల్సిన పరిస్ధితి. దీంతో శారీరక వ్యాయామం తగ్గడం ఆపై స్ధూలకాయం బారినపడుతున్న వారు అధికమవుతున్నారు. రోజుకు కనీసం 21 నిమిషాల పాటు వ్యాయామం చేయాలని డాక్టర్ గ్రెగర్ సూచిస్తున్నారు. వేగంగా నడవడం, ప్రకృతితో మమేకమవుతూ జాగింగ్ లేదా ఆటలు ఆడటం వంటి వ్యాయామాలు ఎంచుకోవాలని ఎక్కువసేపు కూర్చుని ఉండటం అవాయిడ్ చేయాలని చెబుతున్నారు.