మూత్రపిండ రుగ్మతలు ఉన్నంత మాత్రాన.. భయపడిపోవాల్సిన పన్లేదు. రోగి ప్రాణాలను నిలబెట్టే అత్యాధునిక వైద్య విధానాలు అందుబాటులోకి వచ్చాయి. మూత్రపిండ మార్పిడిలో అవరోధాలూ తొలగిపోతున్నాయి. దాత,స్వీకర్త.. బ్లడ్గ్రూప్ కలవకపోయినా సరే.. ‘ఏబీవో ఇన్కంపాటిబుల్ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్’ తదితర విధానాలు రక్షణ కవచాలుగా నిలుస్తున్నాయి.
కిడ్నీ.. మనిషి శరీరంలోని ప్రధాన అవయవాలలో ఒకటి. మారుతున్న జీవన విధానం, ఆహారపు అలవాట్లు, కుటుంబ నేపథ్యం తదితర కారణాల వల్ల కిడ్నీ సమస్యలు పెరిగిపోతున్నాయి. దేశంలో ఏటా సుమారు 2.2 లక్షల మందికి కిడ్నీ మార్పిడి అవసరం అవుతున్నది. కానీ, అందులో 7 వేల నుంచి 8 వేల మందికి మాత్రమే మార్పిడి సాధ్యపడుతున్నది. ఈ దుస్థితికి అనేక కారణాలు..
1. బ్రెయిన్ డెడ్ మరణాల కంటే కిడ్నీ అవసరం ఉన్న రోగుల సంఖ్యే అధికంగా ఉండటం.
2. దాతలు సిద్ధంగా ఉన్నా.. వారి బ్లడ్ గ్రూప్, రోగి బ్లడ్ గ్రూప్తో కలవకపోవడం.
ఈ రెండు పరిమితుల వల్ల చాలామంది మృత్యువాత పడుతున్నారు. కిడ్నీ దాతల కోసం నిరీక్షిస్తుండగానే పరిస్థితి విషమిస్తున్నది. ఈ ఆరోగ్య సంక్షోభాన్ని
అరికట్టేందుకు నిపుణులు ఓ పరిష్కారం కనిపెట్టారు.
బ్లడ్ గ్రూప్ కలవకపోయినా కిడ్నీ మార్పిడి సులభతరం చేసేందుకు ‘ఏబీవో ఇన్కంపాటిబుల్ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్’ పద్ధతిని ఆవిష్కరించారు. ఈ మార్పిడి చికిత్స ఎలా చేస్తారు, ఎవరికి చేస్తారు.. తదితర అంశాలకు సంబంధించి సాధారణ ప్రజలలో ఎన్నో సందేహాలు.
మార్పిడే శరణ్యం
ఈజీఎఫ్ఆర్ రేటు 10 ఎంఎల్ కంటే తక్కువ స్థాయికి పడిపోయిన రోగులకు ప్రస్తుతం ఎలాంటి చికిత్సా అందుబాటులో లేదు. రెండే మార్గాలున్నాయి.
ఒకటి.. వారానికి మూడుసార్లు హీమోడయాలసిస్ లేదా పెరిటోనియల్ డయాలసిస్ చేయించుకోవడం.
రెండు.. కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స.
ఈ రెండు ఆప్షన్లలో కిడ్నీ మార్పిడే అత్యుత్తమ మార్గం. ఎందుకంటే కిడ్నీ మార్పిడి వల్ల మూత్ర పిండాలు 100 శాతం సమర్థంగా పనిచేస్తాయి. దీంతో జీవన నాణ్యత బాగుంటుంది. డయాలసిస్తో పోలిస్తే చికిత్స ఖర్చులు కూడా తక్కువే. డయాలసిస్తో 50-60 శాతం మాత్రమే కిడ్నీ పనితీరు మెరుగుపడుతుంది. డయాలసిస్ కోసం నెలకు రూ.30 వేల నుంచి రూ.40 వేల వరకు ఖర్చుపెట్టాల్సి ఉంటుంది. అయితే, 100 మంది కిడ్నీ రోగుల్లో 5 నుంచి 7 శాతం మందికే కిడ్నీ ట్రాన్స్ప్లాంట్స్ జరుగుతున్నాయి. మిగిలిన 95 శాతం మంది డయాలసిస్పైనే బతుకు వెళ్లదీస్తున్నారు. దీనికి ప్రధాన కారణం బ్లడ్ గ్రూప్స్ కలవకపోవడం. ఈ పరిమితిని కూడా ఇప్పుడు సమర్థంగా అధిగమిస్తున్నాం. బ్లడ్ గ్రూప్స్ కలవక పోయినా కిడ్నీ మార్పిడి చేసేందుకు ఒకటే దారి.. ‘ఏబీవో ఇన్కంపాటిబుల్ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్’.
తొలిసారిగా..
ప్రపంచంలోనే తొలిసారిగా 1980లో బెల్జియంలోని ఓ వైద్యశాలలో ‘ఎబీవో ఇన్కంపాటిబుల్ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్’ చేశారు. అప్పట్లో సక్సెస్ రేటు 70 శాతం వరకూ ఉండేది. మిగతా 30 శాతం కేసుల్లో రోగి పరిస్థితి ప్రాణాంతకమే. ఔషధాలు కూడా ఎక్కువగానే వాడాల్సి వచ్చేది. దీనివల్ల దుష్ఫలితాలు ఇబ్బంది పెట్టేవి. ప్రస్తుతం ‘రిటక్స్మాబ్’ అనే ఇంజక్షన్ సాయంతో.. బ్లడ్ గ్రూప్ కలవని రోగులకు కూడా కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేస్తున్నాం. దీనివల్ల సక్సెస్ రేటు 70 శాతం నుంచి 96 శాతానికి పెరిగింది. అదే బ్లడ్ గ్రూప్ రోగుల్లో ట్రాన్స్ప్లాంట్ చేసినా సక్సెస్ రేట్ 97 శాతం నుంచి 98 శాతం వరకూ ఉంటున్నది. అంటే, ఏబీవో ఇన్కంపాటిబుల్ ట్రాన్స్ప్లాంట్ ఫలితాలు సైతం సాధారణ ట్రాన్స్ప్లాంట్తో సమానంగా ఉంటున్నాయి. జపాన్లో కెడావర్ (బ్రెయిన్డెడ్కు గురైన వ్యక్తి నుంచి సేకరించే అవయవాలు) ట్రాన్స్ప్లాంట్స్ చేయరు. దీంతో అక్కడ 40 శాతం కిడ్నీ రోగులు ‘ఏబీవో ఇన్కంపాటిబుల్ ట్రాన్స్ప్లాంట్’ చేయించుకుంటారు. కానీ, మన దేశంలో అవగాహన లోపం కారణంగా కేవలం 1-2శాతం మంది మాత్రమే ఇటువైపు మొగ్గుచూపు తున్నారు.
ఇదీ పద్ధతి..
మనలో నాలుగు రకాల బ్లడ్ గ్రూప్స్ ఉంటాయని తెలిసిందే. ఏ-గ్రూప్లోనేమో బీ-గ్రూప్ను తిరస్కరించే యాంటీబాడీస్ ఉంటాయి. బీ-గ్రూప్ వారిలోనేమో ఏ-గ్రూప్ను తిరస్కరించే యాంటీబాడీస్ ఉంటాయి. అలానే ఓ-గ్రూప్ రక్తంలో.. ఏ, బీ గ్రూపులను తిరస్కరించే యాంటీబాడీస్ ఉంటాయి. అదే ‘ఏబీ’ బ్లడ్ గ్రూప్లో అసలు యాంటీబాడీసే ఉండవు. కాబట్టే, ఏబీ గ్రూప్ వారికి ఎవరైనా మూత్రపిండ దానం చేయవచ్చు. అంటే, వాళ్లు ఏ బ్లడ్ గ్రూప్ వారినుంచైనా కిడ్నీ స్వీకరించవచ్చు. అందుకనే వారిని ‘విశ్వ స్వీకర్తలు’గా వ్యవహరిస్తారు.
ఓ-గ్రూప్ వారు ఎవరికైనా కిడ్నీ దానం చేయవచ్చు. కానీ ఇతరుల కిడ్నీ స్వీకరించలేరు. అందుకని వారిని ‘విశ్వ దాతలు’ అంటారు. బ్లడ్ గ్రూప్స్ ఒకదానితో ఒకటి కలవకపోతే, కిడ్నీలు పనిచేయవు. అందుకని యాంటీబాడీస్ను తొలగించాల్సి ఉంటుంది. అందుకోసం ‘ప్లాస్మా ఫెరసిస్’ పద్ధతిని ఉపయోగిస్తారు. ఉదాహరణకు ఏ-గ్రూప్ రోగికి, బీ-గ్రూప్ ఉన్న దాత మూత్రపిండాన్ని దానం చేసే సమయంలో.. రోగి బ్లడ్గ్రూప్లోని రిజెక్ట్ చేసే యాంటీబాడీలను 1:128 లేదా 1:264 నుంచి 1:8కు తగ్గించడం జరుగుతుంది. అంతేకాకుండా, రిజెక్షన్ యాంటీబాడీస్ పునరుత్పత్తి కాకుండా ‘రిటక్స్మాబ్’ ఇంజక్షన్ ఇస్తారు. దీనికి 10 నుంచి 15 రోజుల సమయం పడుతుంది. ఈ ప్రక్రియ తరువాత రక్త గ్రూపుతో సంబంధం లేకుండా.. దాత నుంచి సేకరించిన కిడ్నీని రోగికి మార్పిడి చేస్తారు.
కిడ్నీ ఫెయిల్యూర్ అంటే
ఆరోగ్యవంతమైన మూత్రపిండాలు.. నిమిషానికి 70 మి.లీ నుంచి 100 మి.లీ. రక్తాన్ని శుద్ధి చేస్తాయి. దీన్నే ఎస్టిమేటెడ్ జీఎఫ్ఆర్ (గ్లోమెర్యులర్ ఫిల్టరేషన్ రేట్) అంటారు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు, షుగర్, బీపీ, క్యాన్సర్ తదితర రుగ్మతల చికిత్సలో భాగంగా శక్తిమంతమైన మందులు వాడేవారు, వంశ పారంపర్యంగా కిడ్నీ వ్యాధులు ఉన్నవారు.. ఈ మూడు విభాగాలలో క్రమంగా ‘ఈజీఎఫ్ఆర్’ రేటు తగ్గిపోతుంది. ఆ స్థాయి నిమిషానికి 10 ఎంఎల్ కంటే తక్కువకు పడిపోతే మాత్రం.. అడ్వాన్స్డ్ కిడ్నీ ఫెయిల్యూర్ స్టేజ్ లేదా సీకేడీ స్టేజ్-5గా పరిగణిస్తారు.
అవసరమైతే మళ్లీ
కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స జరిగిన తరువాత 2 నుంచి 4 వారాల వరకు రోగి శరీరంలో తిరుగుబాటు స్వభావం ఉన్న యాంటీ బాడీస్ ఏమైనా పెరుగుతున్నాయా అన్నది గమనిస్తూ ఉంటారు. ఆ తరువాత పెరిగినా ఎలాంటి నష్టం ఉండదు. ఆ లోపు మార్పిడి చేసిన కిడ్నీ సర్దుకుంటుంది. అయితే 2 నుంచి 4 వారాల లోపు యాంటీబాడీస్ పెరిగి కిడ్నీ పనితీరు తగ్గినప్పుడు మాత్రమే మరోసారి ‘ప్ల్లాస్మా ఫెరసిస్’ చికిత్స చేస్తారు. కిడ్నీ మార్పిడి చేసిన నాలుగు వారాల్లోపు యాంటీబాడీస్ పెరిగినా.. కిడ్నీ పనితీరు మాత్రం బాగానే ఉన్నప్పుడు ఎలాంటి చికిత్సా అవసరం లేదు. సమస్య ఇంతవరకూ రాకుండా.. ఆరోగ్యకరమైన జీవనశైలితో, మంచి అలవాట్లన మూత్రపిండాలను ఆరోగ్యంగా ఉంచుకోవడమే మేలు. ఏ చిన్న రోగ లక్షణాన్నీ నిర్లక్ష్యం చేయకూడదు.
డాక్టర్ జి.శ్రీధర్
డైరెక్టర్, నెఫ్రాలజీ &
ట్రాన్స్ప్లాంట్ విభాగం
స్టార్ హాస్పిటల్, హైదరాబాద్
…?మహేశ్వర్రావు బండారి