నా వయసు ఇరవై ఎనిమిది.ఎత్తు ఐదు అడుగుల రెండు అంగుళాలు.పెండ్లయి మూడేండ్లు అవుతున్నది. పిల్లలు లేరు.డాక్టర్ను సంప్రదిస్తే అండాశయంలో ఎండోమెట్రియాసిస్ సిస్టులు ఉన్నాయని చెప్పారు. మందులు ఇచ్చారు. ఇలాంటి పరిస్థితుల్లో సాధారణ గర్భం వచ్చే అవకాశం ఉందా? ఈ సిస్ట్లు మళ్లీ వస్తాయా? వాటిని చాకొలెట్ సిస్ట్ అంటారని తెలిసింది. ఇవి ఎందుకొస్తాయి. మళ్లీ రాకుండా ఏం చేయాలి?
సాధారణంగా ఆడపిల్ల పుష్పవతి అయినప్పటి నుంచీ బిడ్డ పెరుగుదలకు అనుకూలంగా గర్భాశయ అంచుల వద్ద ప్రతి నెలా ఎండోమెట్రియం అనే పొర ఏర్పడుతుంది. ఒక వేళ ఆ నెల అండం ఫలదీకరణ చెంది పిండం ఏర్పడకపోతే, యోని గుండా ఆ పొర బయటికి వచ్చేస్తుంది. దాన్నే మనం రుతుస్రావంగా పిలుస్తాం. కానీ ఈ పొర కొన్నిసార్లు అండాశయం మీద, ఫాలోపియన్ ట్యూబుల దగ్గర, కటి ప్రదేశం లోపల ఏర్పడుతుంది. అక్కడి నుంచి స్రావం రూపంలో బయటికి రావడం కుదరదు కాబట్టి, అక్కడే స్రావం జరిగి ఆ నెత్తురు గడ్డలుగా మారుతుంది.
మీ విషయంలో జరిగింది కూడా అదే. ఆ గడ్డలు నల్లగా చాకొలెట్ను పోలి ఉంటాయి కాబట్టి, వీటిని ‘చాకొలెట్ సిస్ట్’లుగా పిలుస్తారు. అయితే, ఇలా ఎందుకు జరుగుతుందన్నది వైద్య ప్రపంచానికి అంతుబట్టడం లేదు. కారణం తెలియదు కాబట్టి, మళ్లీ రాకుండా ఏం చేయాలన్నదీ కచ్చితంగా చెప్పలేం. అయితే పెద్దగా కంగారు పడాల్సిన విషయమేం కాదు. మీ అండ నాళాలు ఎలా ఉన్నాయి, అండం విడుదల ఎలా ఉంది అనేది మీరు చెప్పలేదు. ఎందుకంటే, వీటిని బట్టి కూడా గర్భధారణ ఆధారపడి ఉంటుంది. ఎండోమెట్రియాసిస్ సిస్ట్లకు మందులు వాడుతున్నప్పుడు నెలసరి రాదు. కాబట్టి, ఈ సమయంలో గర్భం ధరించలేరు. కానీ పిల్లలు పుట్టకపోవడానికి ఇదొక్కటే కారణం కాకపోవచ్చు. మీ దంపతులిద్దరూ సీనియర్ గైనకాలజిస్టును కలిసి పరీక్షలు చేయించుకోండి. అవసరమైతే, ఐవీఎఫ్ ద్వారా ప్రయత్నించవచ్చు.
డాక్టర్ పి. బాలాంబ
సీనియర్ గైనకాలజిస్ట్