ఇంట్లో ఎవరికైనా ఒంట్లో నలతగా అనిపిస్తే.. కొంచెం వాము తిని, నీళ్లు తాగితే తగ్గిపోతుందని చెబుతాం. భోజనం తర్వాత సోంపు నమలడమూ సాధారణమే. దీంతో అరుగుదల సాఫీగా ఉంటుంది. వీటివల్ల మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని అంటున్నారు పోషకాహార నిపుణులు.
సోంపు గింజల్లో యాంటీపారాసైటిక్ లక్షణాలు అపారం. ఇవి గ్యాస్ను నియంత్రిస్తాయి. పేగుల్లో ఇబ్బందులు కలిగించే సూక్ష్మ క్రిములపై పోరాడుతాయి. ఇన్సులిన్ స్థాయులను నియంత్రించి మధుమేహ రోగులకు సాయపడతాయి. నాణ్యమైన విటమిన్స్, మినరల్స్ కారణంగా బరువు తగ్గడంలో సహాయంగా నిలుస్తాయి. ఇక వాములో యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్ పుష్కలం.
జీర్ణవ్యవస్థకు ఇవి మేలు చేస్తాయి. ఇందులో యాంటీసెప్టిక్ లక్షణాలు కూడా ఉంటాయి. ఇవి మొటిమలను తగ్గిస్తాయి. వెంట్రుకలు తెల్లబడటాన్ని నివారిస్తాయి. నెలసరి సక్రమంగా జరగకపోవడం, అధిక రక్తస్రావం వంటి సమస్యలను అడ్డు కుంటాయి. వాము, సోంపు నీటిని పానీయంగా కూడా తీసుకోవచ్చు. రాత్రంతా నీళ్లలో నానబెట్టి తిన్నా, రెండిటినీ కలిపి పొడి చేసుకుని తీసుకున్నా కూడా మంచి ప్రయోజనాలే లభిస్తాయి.