Lentils | పప్పులు భారతీయ ఆహారంలో కీలక భాగంగా ఉంటాయి. ఇవి ప్రోటీన్, ఫైబర్, అవసరమైన పోషకాలతో నిండి ఉండడంతో రోజువారీ భోజనంలో ఎక్కువగా వాడుతుంటారు. అయితే పప్పులు తిన్న తర్వాత కొందరికి పొట్ట ఉబ్బరం, బరువుగా అనిపించడం, గ్యాస్ వంటి సమస్యలు ఎదురవుతుంటాయి. అయితే దీనికి పప్పులు కారణం కాకపోవచ్చని, వాటిని సరైన విధంగా సిద్ధం చేయకపోవడమే ప్రధాన కారణమని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. పప్పులు వండే ముందు నానబెట్టడం చాలా ముఖ్యమని నిపుణులు సూచిస్తున్నారు. అయితే అన్ని రకాల పప్పులకు ఒకే విధమైన నానబెట్టే సమయం సరిపోదని చెబుతున్నారు. ఏ పప్పును ఎంతసేపు నానబెట్టాలో తెలుసుకుంటే జీర్ణక్రియ మెరుగుపడటంతోపాటు పొట్ట ఉబ్బరం వంటి సమస్యలు తగ్గే అవకాశం ఉందని వివరిస్తున్నారు.
చిన్న పరిమాణంలో ఉండే పూర్తి గింజల పప్పులు ఇతర పెద్ద లెగ్యూమ్స్తో పోలిస్తే తేలికగా జీర్ణమవుతాయని నిపుణులు చెబుతున్నారు. వీటిని సుమారు 7 నుంచి 8 గంటలు, ముఖ్యంగా రాత్రంతా కొద్దిగా ఉప్పు వేసి నానబెట్టడం మంచిదని సూచిస్తున్నారు. ఇలా చేయడం వల్ల పప్పులు మెత్తబడటంతో పాటు వండటానికి సులభమవుతాయి. జీర్ణక్రియ కూడా మెరుగుపడుతుందని చెబుతున్నారు. అలాగే రాజ్మా, శనగలు, చోలే వంటి పెద్ద లెగ్యూమ్స్కు మరింత సమయం అవసరమని చెబుతున్నారు. వీటి పై పొర గట్టిగా ఉండటంతో జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. అందువల్ల ఇవి గ్యాస్, పొట్ట ఉబ్బరం వంటి సమస్యలకు కారణమవుతాయని వివరిస్తున్నారు. కనీసం 10 నుంచి 12 గంటల పాటు రాత్రంతా నానబెట్టాలని సూచిస్తున్నారు. ఇలా చేయడం వల్ల జీర్ణానికి ఇబ్బంది కలిగించే కొన్ని సంయోగాలు తగ్గిపోతాయని అంటున్నారు.
అలాగే పొట్టు తీసిన రకాలైన కందిపప్పు, మినప పప్పు వంటి వాటికి ఎక్కువసేపు నానబెట్టాల్సిన అవసరం లేదని చెబుతున్నారు. వీటిలో బయటి పొర లేకపోవడంతో ఇవి తేలికగా జీర్ణమవుతాయని పేర్కొంటున్నారు. సుమారు 4 నుంచి 5 గంటలు నానబెట్టడం సరిపోతుందని సూచిస్తున్నారు. పప్పులు నానబెట్టడం ఒక ఎంపిక కాదు, తప్పనిసరి అలవాటు కావాలని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడటంతో పాటు గట్ ఆరోగ్యం కూడా బాగుంటుందని తెలియజేస్తున్నారు. ఈ చిన్న అలవాటు వల్ల పొట్ట ఉబ్బరం తగ్గడం, పోషకాలు శరీరానికి మెరుగ్గా అందడం, భోజనం తిన్న తర్వాత తేలికగా అనిపించడం వంటి ప్రయోజనాలు కలుగుతాయని సూచిస్తున్నారు. పప్పులు తిన్నప్పుడు జీర్ణ సమస్యలు వస్తున్నాయని భావించే వారు ముందుగా వాటిని నానబెట్టే విధానాన్ని పరిశీలించుకోవాలని చెబుతున్నారు.