ముంబై: కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం కరోనాను దీటుగా ఎదుర్కోవడంలో విఫలమైందని మహారాష్ట్ర మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత అశోక్ చవాన్ ధ్వజమెత్తారు. 12.21 కోట్ల ఉద్యోగాలు పోతుంటే చూస్తూ కూర్చున్నారని మండిపడ్డారు. మోదీ ప్రభుత్వం రెండో విడతలో రెండేండ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా చవాన్ వీడియో పత్రికా సమావేశంలో మాట్లాడారు. అన్ని నిర్ణయాధికారాలు గుప్పిట్లో పెట్టుకున్న కేంద్రం ఇప్పుడు కరోనా కల్లోలం అదుపు తప్పడంతో రాష్ట్రాల మీదకు నెపం తోస్తున్నదని చవాన్ అన్నారు. మోదీ ప్రభుత్వంలో మీకు నచ్చిన మంత్రి ఎవరు అని అడిగితే కేంద్రమంత్రి, నాగపూర్ ఎంపీ నితిన్ గడ్కరీ గురించి నాలుగు మంచిమాటులు చెప్పుకోవచ్చని సమాధానమిచ్చారు. సైద్ధాంతిక విభేదాలు ఉన్న పాల్టీలతోనూ ఆయన సంప్రదింపులు జరుపుతారని చవాన్ పేర్కొన్నారు. ఆయన సరైన వారే కానీ ఆయన పార్టీయే సరైనది కాదని, మహారాష్ట్ర పట్ల సానుకూల వైఖరి గడ్కరీకి ఉన్నప్పటికీ ఆయన అధికారాలను తగ్గిస్తున్నారని అన్నారు. పెట్రోల్ ధర రూ.100కు చేరుకున్నదని, 12.21 కోట్ల ఉద్యోగాలు పోయాయని, తలసరి ఆదాయం బాంగ్లాదేశ్ కన్నా తగ్గిందని, కేంద్రం విధానాలు దేశాన్ని నాశనం చేశాయని గతంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా కూడా పనిచేసిన చవాన్ దుయ్యబట్టారు. సహాయం, జీఎస్టీ పరిహారం చెల్లింపుతో సహా అన్ని రంగాల్లో కేంద్రం మహారాష్ట్రపై వివక్ష చూపుతున్నదని ఆరోపించారు.