లండన్: క్రిప్టోకరెన్సీ బిట్కాయిన్ ఆకాశాన్నంటే రీతిలో దూసుకెళుతున్నది. క్రిప్టో కరెన్సీ ఎక్స్చేంజీ ట్రేడింగ్లో ఆల్టైం రికార్డులతో మెరుపులు మెరిపిస్తున్నది. గత సెషన్ ఇంట్రాట్రేడింగ్లో కొద్దిసేపు 60,012 డాలర్ల వద్ద తచ్చాడిన బిట్ కాయిన్ న్యూయార్క్లో జరిగిన ట్రేడింగ్లో ఆదివారం ఎకాఎకీన 61,080 డాలర్లను దాటేసింది. అంటే మన కరెన్సీలో దాదాపు రూ.44.39 లక్షలు.
గత నెలాఖరులో భారీగా నష్టపోయిన బిట్కాయిన్ తాజా పుంజుకున్నది. కరోనా మహమ్మారితో దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేందుకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ గత గురువారం 1.9 ట్రిలియన్ డాలర్ల ప్యాకేజీపై సంతకం చేయడంతో బిట్కాయిన్ మార్కెట్కు మంచి ఊపునిచ్చిందని తెలుస్తున్నది. గత దీనివల్ల పెరిగిపోయే ద్రవ్యోల్బణం ప్రభావాన్ని తగ్గించడానికి ఇన్వెస్టర్లు బిట్ కాయిన్ కొనుగోలుకు ప్రాధాన్యం ఇస్తున్నారు.
గతేడాది డిసెంబర్ చివర్లో 170 శాతం పెరిగి 29వేల డాలర్లకు చేరిన బిట్కాయిన్ విలువ ఫిబ్రవరి 21వ తేదీన 58వేల డాలర్ల మార్కును దాటేసింది. కానీ, తర్వాత భారీగా పతనమై 45 వేల డాలర్లకు పడిపోయినా మళ్లీ క్రమంగా పుంజుకొని తాజాగా కొత్త జీవన కాల గరిష్ట రికార్డులు నమోదు చేసింది. బిట్కాయిన్ వచ్చిన కొత్తల్లో ఇది కేవలం కొన్ని సెంట్స్ మాత్రమే ఉన్న సంగతి తెలిసిందే. గతేడాది చివరి త్రైమాసికంలో 29 వేల డాలర్లుగా ఉన్న బిట్ కాయిన్ విలువ 40 వేలకు చేరుకున్నది. 2020లో బిట్ కాయిన్ వెయ్యిశాతం వ్రుద్ధి చెందింది.
కొన్నేండ్లుగా ప్రభుత్వాలు కూడా క్రిప్టో కరెన్సీలపై ఆసక్తి చూపడం బిట్కాయిన్కు కలిసొచ్చింది. భారత్ సైతం బ్లాక్ చెయిన్ టెక్నాటజీతో వర్చువల్ కరెన్సీని అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నది. బిట్ కాయిన్ సహా పలు క్రిప్టో కరెన్సీలు వెలుగులోకి వచ్చిన కొత్తల్లో వాటితో లావాదేవీలపై భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) నిషేధం విధించిన సంగతి తెలిసిందే.
బిలియనీర్ ఎలన్మస్క్తోపాటు ఇంటర్నేషనల్ ఫైనాన్సియల్ సర్వీసెస్ సంస్థలు మాస్టర్ కార్డ్, వీసా, పే పాల్ సైతం బిట్ కాయిన్ చలామణి ఆమోదయోగ్యమేనని పేర్కొనడం అది పుంజుకోవడానికి కారణం.