‘సినిమా కలెక్షన్స్ కంటే అభిమానుల ప్రేమ నాకు ముఖ్యం. కరోనా మహమ్మారి కారణంగా ఉత్తరాదితో పాటు పలు రాష్ర్టాల్లో సినిమా ప్రదర్శనలు నిలిచిపోయాయి. కానీ తెలుగు ప్రేక్షకులు మాత్రం సంక్రాంతికి సినిమాను విడుదలచేస్తే చూస్తామని భరోసా ఇచ్చారు. సినిమాను బ్లాక్బస్టర్ చేశారు’ అని అన్నారు నాగార్జున. నాగచైతన్యతో కలిసి ఆయన హీరోగా నటించిన చిత్రం ‘బంగార్రాజు’. కల్యాణ్కృష్ణ కురసాల దర్శకుడు. నాగార్జున నిర్మించారు. ఇటీవలే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చింది. మంగళవారం ఏపీలోని రాజమండ్రిలో విజయోత్సవ వేడుకను నిర్వహించారు. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ ‘సినిమా అంటే సంక్రాంతి..సంక్రాంతి అంటే సినిమా అని తెలుగు ప్రేక్షకులు మరోసారి నిరూపించారు. ఏపీ సీఏం జగన్తో జరిపిన భేటీ గురించి నా మిత్రుడు చిరంజీవిని అడిగా. సినిమా ఇండస్ట్రీకి అంతా మంచి జరుగుతుందని ఆయన చెప్పారు. అచ్చమైన తెలుగు సినిమాగా ‘బంగార్రాజు’ అందరినీ అలరిస్తున్నది’ అని అన్నారు. ‘కరోనా ఉధృతి ఎక్కువగా ఉన్నా కథపై నమ్మకంతో సినిమాను విడుదలచేశాం. నాన్నతో పాటు నా కెరీర్లోనే బెస్ట్ ఓపెనింగ్స్ను ఈ సినిమా రాబట్టింది’ అని నాగచైతన్య చెప్పారు. ఆర్.నారాయణమూర్తి మాట్లాడుతూ ‘నాగార్జున ఓ ఆల్రౌండర్, అన్నమయ్య, రామదాసు లాంటి సినిమాలతో తన జన్మను ధన్యం చేసుకున్నారు. నాగచైతన్య వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. కుటుంబ విలువలను ఈ సినిమాలో చక్కగా చూపించారు’ అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ మంత్రి కన్నబాబు, ఎంపీ భరత్, కృతిశెట్టి పాల్గొన్నారు.