దేశ ప్రజల ప్రాథమిక హక్కులను కాపాడేందుకు నిరంతరం పోరాటం చేసిన యోధుడు ఫాలీ సామ్ నారీమన్. స్వేచ్ఛాయుత ప్రపంచం కోసం ప్రతీ క్షణం పరితపించారాయన. దశాబ్దాల తన వృత్తి జీవితంలో రాజ్యాంగవాదిగా, లౌకికవాదిగా, ప్రాథమిక హక్కుల రక్షకుడిగా ఎన్నెన్నో పాత్రలను సమర్థవంతంగా పోషించారు నారీమన్. కోర్టుల్లో, కోర్టు బయట తన వాదనలతో రాజ్యాంగాన్ని సజీవంగా ఉంచారాయన.
న్యాయ కోవిదుడు నారీమన్ మరణంతో మన దేశం ఓ న్యాయ దిగ్గజాన్ని కోల్పోయింది. భారత్లో లక్షల మంది న్యాయవాదులు ఉండవచ్చు. కానీ, దేశ గతిని మార్చేసిన కేసుల్లో భాగమైన వారిని వేళ్లపైనే లెక్కించవచ్చు. అలాంటివారిలో ఒకరు నారీమన్. 70 ఏండ్ల సుదీర్ఘ కెరీర్లో రాజ్యాంగాన్ని పరిరక్షించేందుకు ఆయన ఎంతగానో కృషి చేశారు. ప్రాథమిక హక్కులు, మానవ హక్కులు హననానికి గురవకుండా ఇటు న్యాయస్థానాల్లోనూ, అటు న్యాయస్థానాల వెలుపల కూడా తన గళాన్ని వినిపించారు. సుప్రీంకోర్టు వెలువరించిన అనేక చరిత్రాత్మక కేసుల్లో వాదించిన ఘనాపాటిగా ఆయనకు పేరుంది.
నారీమన్ గొప్ప మానవతావాది. అన్యాయం జరిగిందని ఎవరు కోర్టు మెట్లెక్కినా ఆయన వెన్నంటి ఉండేవారు. న్యాయపరంగా సాయం చేసేవారు. ఈ క్రమంలోనే ఎన్నో ప్రతిష్టాత్మక కేసుల్లో భాగమయ్యారు. ఇప్పటికీ అనేక కేసుల్లో సర్వోన్నత న్యాయస్థానానికి మార్గదర్శిగా నిలుస్తున్న కేశవానంద భారతి తీర్పు ఈ కోవలోనిదే.
న్యాయం ప్రతిఒక్కరికీ దక్కాలని భావించే నారీమన్.. అందుకోసం అహర్నిశలు శ్రమించారు. పాలకుల చెప్పుచేతల్లోకి న్యాయస్థానాలు వెళ్లకుండా చేయడంలో కీలక భూమిక పోషించారు. నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్ కమిషన్ (ఎన్జేఏసీ) పేరిట కేంద్ర ప్రభుత్వం తెరలేపిన కుట్రను సమర్థంగా ఛేదించి పరిపాలనా యంత్రాంగానికి న్యాయవ్యవస్థ బానిసగా మారకుండా కాపాడారు. న్యాయమూర్తులను నియమించే హక్కు న్యాయస్థానాలకు రాజ్యాంగమే కల్పించిందని వాదించి న్యాయస్థానాల స్వతంత్రతను కాపాడారాయన. కొలీజియం వ్యవస్థ పురుడుపోసుకోవడానికి ఆద్యుడు నారీమనే. ఆయన వాదించిన ‘సుప్రీంకోర్టు అడ్వకేట్స్ ఆన్ రికార్డ్ అసోసియేషన్ యూనియన్ అఫ్ ఇండియా’ కేసు మూలంగానే కొలీజియం వ్యవస్థ అమల్లోకి వచ్చింది. అయితే కొలీజియం వ్యవస్థపై కూడా ఆయన విమర్శలు సంధించడం గమనార్హం. ‘హైకోర్టు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులను నియమించే సుప్రీంకోర్టు మొదటి ఐదుగురితో కూడిన కొలీజియంలో నాకు ఎటువంటి ప్రత్యేకతలు కనిపించడం లేదు. సీనియారిటీలో మాత్రమే వారు మొదటి ఐదుగురు.. విజ్ఞతలో కాదు’ అని బహిరంగంగా విమర్శించిన ధీశాలి నారీమన్.
స్వాతంత్య్రానికి పూర్వమే బర్మా ప్రావిన్స్లో జన్మించిన నారీమన్ అంచెలంచెలుగా ఎదిగి ఉన్నత శిఖరాలకు చేరుకున్నారు. బాంబే హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు తనదైన ముద్ర వేశారు. బాంబే హైకోర్టు నుంచి మొదలైన ఆయన ప్రస్థానం బార్ అసోసియేషన్ అఫ్ ఇండియా అధ్యక్షుడి వరకు అప్రతిహతంగా కొనసాగింది. ప్రపంచవ్యాప్తంగా కూడా ఆయనకు గుర్తింపు ఉంది.
నారీమన్ రాజ్యసభ సభ్యుడిగానూ రాణించారు. వృత్తి పరంగా ఎంత బిజీగా ఉన్నా ప్రజల తరఫున పార్లమెంట్లో గళం వినిపించే ఏ ఒక్క అవకాశాన్ని ఆయన వదులుకోలేదు. ప్రజలకు చేసిన సేవలకుగానూ పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ పురస్కారాలు ఆయన్ను వరించాయి. తన వృత్తి జీవితంలో ఎన్నెన్నో పదవులను అధిరోహించిన నారీమన్.. ఏనాడూ వాటి కోసం పాకులాడలేదు. ఆధిపత్యం, అహంకారం- ప్రాథమిక హక్కులకు మధ్య జరిగిన పోరులో నిస్సందేహంగా హక్కుల వైపే నిలబడ్డారాయన. అందుకు తన పదవులను కూడా తృణప్రాయంగా వదిలేశారు. ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించినప్పుడు అడిషనల్ సొలిసిటర్ జనరల్ అఫ్ ఇండియాగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఆయన ఆ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. తన పదవికి రాజీనామా చేసి ప్రజల హక్కులను హరిస్తున్న పాలకులపై పోరాడారు.
‘నేను లౌకిక భారత్లోనే పుట్టాను. లౌకిక భారత్లోనే పెరిగాను. దేవుడి దయ ఉంటే లౌకిక భారత్లోనే ప్రాణాలు వదలాలనుకుంటున్నాను’ అని తన ఆత్మకథ ‘బిఫోర్ మెమరీ ఫేడ్స్’లో రాసుకున్న నారీమన్ చివరి శ్వాస వరకు లౌకికవాదానికి అండగా నిలిచారు. ఇటీవలి కాలంలో దేశంలో మతోన్మాదం పెచ్చరిల్లడంపై కూడా ఆయన గొంతువిప్పారు. రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడేందుకు చెమటలు చిందించారు. నారీమన్ లాంటి రాజ్యాంగ కోవిదుని మరణంతో ఒక న్యాయ శకం ముగిసిందనే చెప్పాలి. కానీ, న్యాయజ్యోతి నిరంతరం వెలిగేందుకు కృషి చేసిన నారీమన్.. భవిష్యత్తులోనూ న్యాయాన్వేషణలో దివిటీలా నిలుస్తారనడంలో ఎటువంటి సందేహం లేదు.