‘నీరు పల్లమెరుగు..’ అనేది పాతకాలం ముచ్చట. ఇప్పుడు ‘నీరు ఎగువకూ పరుగులు తీయు..’అన్నది కేసీఆర్ ప్రవచిత జల తెలంగాణలోని నిజం. .
నాయకులకు, పార్టీలకు రాజకీయాలు కావాలి. నీళ్లకు మాత్రం అవేం అక్కర్లేదు. సకల మనో వికారాలకు అతీతంగా, ప్రాణుల దూప తీర్చుతాయి. నీళ్లు ఏ జీవి గొంతైనా, ఎవరి చేలైనా తడుపుతాయి. కాబట్టి, ఆ నీటికి సరికొత్త నడక పరిచయం చేసిన ఆధునిక కాలపు భగీరథుడికి ఎలాంటి మరకలంటించినా ఆ నీరే తన నడకలతో సమాధానం చెప్తుంది. అందువల్ల కేసీఆర్ నీళ్ల గురించి ఎంత చర్చించినా, ఎంత అక్షరీకరించినా, ఎన్ని కోణాల్లో ఆవిష్కరించినా.. దాహం తీరదు!
దిగువ ప్రాంతం నుంచి ఎగువ మానేరు ప్రాజెక్టులోకి గోదావరి జల ఆగమనం ఓ కనుల పండుగ. 1945-50 దశకంలో ఆ డ్యాం కట్టించిన నిజాం కానీ, డిజైన్ చేసిన ఆ కాలపు ఇంజినీర్లు కానీ ఇది ఊహించి ఉండరు. మాడు పగిలే మార్చిలోనూ అప్పర్ మానేరు చల్లని, కమ్మనైన నీటితో అబ్బురపరుస్తుందనీ! కాళేశ్వర జలాలను కదిలించి, స్థానిక నీటి వనరుల వైపు పారించిన నాటి నుంచే ఆయకట్టు దారులు ఆ నీటికి నామకరణం చేసిన పేరు.. ‘కేసీఆర్ నీళ్లు’!
‘నీరు పల్లమెరుగును’ నానుడి తిరగరాస్తూ, ‘నీరు ఎగువకూ పరుగులు తీయును’ అని కండ్లకు కట్టిన జల తరంగిణిని తెలంగాణ పాలకుడి ‘కేసీఆర్ నీళ్లు’ అని పేరు పెట్టి పిలుచుకోవడం సగటు రైతు సంస్కారం. ఒకప్పటి కల్లోలిత సిరిసిల్ల జిల్లా.. వర్తమానంలో సిరులు పారించి కళకళలాడించడం అసలైన విప్లవం, అంటే మార్పు! అందుకే తాగు, సేద్యపు నీరు అంశంలో తెలంగాణను కేసీఆర్ పాలనకు ముందు, కేసీఆర్ పాలనలో అని చూడాలి, చెప్పుకోవాలి.
మధ్యతరహా జలాశయం ఎగువ మానేరు ప్రాజెక్టు చంద్రబాబు పాలనలో పూర్తిగా వట్టిపోయింది. దాదాపు దశాబ్దం పాటు కరువు కరాళ నృత్యం చేసింది. వ్యవసాయ, దాని అనుబంధ రంగాలు అగాథంలోకి నెట్టబడ్డాయి. ఆసామి, గరీబు అనే అంతరం లేకుండా అందరూ అరిగోస పడ్డారు. పరాయి పాలకుల నిర్వహణ లోపం, వివక్షకు మౌన సాక్షిగా ఎగువ మానేరు ప్రాజెక్టు నెర్రెలు బారింది. 18 వేల ఎకరాల ఆయకట్టు నుంచి పదెకరాలకైనా నీరందించలేని నిస్సహాయతకు నిదర్శనమైంది.
ఉద్యమ శక్తిగా కేసీఆర్ రైతులతో కలిసి అనేక పోరాటాలు చేసి, ఉమ్మడి ఏలికల్లో వణుకు పుట్టించారు. అంతే కాదు, నాడు డ్యాం శిఖంలో తలపెట్టిన సభలో ప్రజలకు వాగ్దానం చేశారు. స్వరాష్ట్రంలో ఎగువ మానేరు ప్రాజెక్టుకు పూర్వవైభవాన్ని, అంతకుమించిన సామర్థ్యాన్ని అందుబాటులోకి తెస్తామని ప్రకటించారు. ఆ మాటను కేసీఆర్ రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో, గోదారమ్మ సాక్షిగా మన అనుభవంలోకి తెచ్చారు. దశాబ్దాల కష్టాలు తీరిపోయే రోజులను తీసుకువచ్చారు. తాతల కాలంలో, అదే ఎగువ మానేరులో తమ పొలాలు కోల్పోయిన ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబానికి ఈ జలాశయంతో భావోద్వేగ సంబంధం ఉన్నది. స్థానిక ఎమ్మెల్యేగా ఎగువ మానేరుకు శాశ్వత పరిష్కారం చూపించిన యువనేత కల్వకుంట్ల తారక రామారావు ప్రాతినిధ్యాన్ని పది కాలాల పాటు కాపాడుకోవడం తమ బాధ్యత అనుకునేవారికి ఈ అంశం చాలదా?