‘ఆచార వ్యవహారాలు మనసులను క్రమమైన మార్గంలో పెట్టడానికి తప్ప, మనుషుల్ని కులమనే పేరుతో విడదీయడానికి కాదు’.. తాను నిమ్న కులానికి చెందిన వ్యక్తినని, ఈ బ్రాహ్మణుల ఇంట తాను వంట చేయవచ్చునో లేదో అన్న భావనతో తులసి పాత్రలో మంజుభార్గవి సందేహిస్తుంటే, శంకరశాస్త్రి పాత్రలో జే వీ సోమయాజులు ఆమెతో చెప్పే డైలాగ్ ఇది. బ్రాహ్మణవాది అని, సంప్రదాయవాది అని అక్కడక్కడా వినిపించే మాటలకు తన చిత్రంలోనే ఒక పాత్ర ద్వారా అంత సరళంగా, క్లుప్తంగా, సూటిగా జవాబిచ్చిన కళా తపస్వి కాశీనాథుని విశ్వనాథ్ గారు.
శంకరాభరణం చిత్రంతో తెలుగు సినిమా చరిత్రలో ఒక కొత్త మలుపుని తీసుకొచ్చి, భారతీయ సంగీత నాట్య సంస్కృతీ సంప్రదాయాలను తన వరుస చిత్రాల ద్వారా ప్రపంచానికి పరిచయం చేసిన పయనీర్ దర్శకులు విశ్వనాథ్ గారు. భారత ప్రభుత్వం తరఫున ఆస్కార్ ఎంట్రీకి 1986లోనే పంపించిన తొలి తెలుగు సినిమా శంకరాభరణం. ఆ సినిమా చూసిన తర్వాతే మన ఇళ్ళల్లోని వీణలు, ఫిడేళ్ళు, ఫ్లూట్లు అటకల మీద నుంచి కిందకు దిగాయి. సంగీతం క్లాసులకు వెళ్ళటం మళ్ళీ ఊపందుకుంది. నాకు శాస్త్రీయ సంగీతం వచ్చు అని బయటకు చెప్పుకోడానికి ఇబ్బంది పడినవాళ్లంతా, శంకరాభరణం తర్వాత విదేశాల్లో కూడా ప్రదర్శనలిస్తూ సెలబ్రిటీలయ్యారు. ఇంతటి పెనుమార్పుకు ఒక్క సినిమా కారణమయ్యిందంటే నమ్మలేం. కానీ, మన కళ్లముందే జరిగింది. దాని సృష్టికర్త కే విశ్వనాథ్.
ఆ శాస్త్రీయ సంగీతం పాటల్ని నేను పాడలేను మొర్రో అని ఎంత తప్పించుకున్నా, పట్టు వదలకుండా పాడించుకొని, ఎస్పీ బాలు పాడారు కాబట్టే శంకరాభరణంలోని పాటలు అంత ఎఫెక్టుని ఇవ్వగలిగాయని, అంతకు ముందు బాలుతో వద్దు అన్నవారితోనే శెభాష్ అనిపించగలిగిన గట్స్ కూడా విశ్వనాథ్ గారికే ఉన్నాయి. సిరిసిరిమువ్వ సినిమాతో వేటూరి సుందర రామమూర్తి రూపంలో, సిరివెన్నెల సినిమాతో సీతారామశాస్త్రి రూపంలో ఇద్దరు అద్భుత సినీ గీత రచయితలను తెలుగు సినిమాకు పరిచయం చేసిన ఘనత కూడా విశ్వనాథ్ గారికే దక్కుతుంది.
బీఎస్సీ తర్వాత మద్రాసులోని వాహినీ స్టూడియోలో సౌండ్ రికార్డిస్టుగా సినీరంగంలోకి ప్రవేశించిన విశ్వనాథ్ గారు, పాతాళ భైరవి సినిమా ద్వారా 1951లో అసిస్టెంట్ డైరెక్టర్గా దర్శకత్వ శాఖలోకి వెళ్లారు. 1965లో దర్శకుడిగా తన తొలి సినిమా ఆత్మగౌరవంకు ఉత్తమ చిత్రంగా నంది అవార్డు సాధించి పెట్టారు. తర్వాత వారు తీసిన చెల్లెలి కాపురం, శారద, ఓ సీత కథ, జీవన జ్యోతి వంటి సినిమాలన్నీ అంతర్లీనంగా ఆధునిక స్త్రీవాదానికి ఆ కాలపు ప్రతీకలు. సిరిసిరిమువ్వ నుంచి విశ్వనాథ్ సినిమాలకు సంగీతం, సాహిత్యం, నాట్యం వంటి కళల నేపథ్యం ఆత్మగా నిలిచింది. సంప్రదాయవాది అని కొందరు అనుకొనే విశ్వనాథ్ గారే అత్యధిక సంఖ్యలో సామాజిక స్పృహ ఉన్న సినిమాల్ని తీశారన్న వాస్తవం బహుశా చాలామందికి తెలియదు. సప్తపది, సిరివెన్నెల, సూత్రధారులు, శుభలేఖ, శృతిలయలు, శుభసంకల్పం, ఆపద్భాంధవుడు, స్వయంకృషి, స్వర్ణకమలం వంటి సినిమాలన్నీ సామాజిక సమస్యల నేపథ్యం ఉన్నవే. ప్యారలల్ సినిమాల్లో మాత్రమే చెప్పగలిగే సీరియస్ సబ్జక్టులకు- భారతదేశపు కళలు, సంస్కృతీ సంప్రదాయాలనే వన్నెలు అద్ది అద్భుతంగా రూపొందించి, మెప్పించిన సర్రియలిస్టిక్ సంప్రదాయవాది విశ్వనాథ్ గారు. ఆయన సినిమాలు అన్నీ ఒక ఎత్తు అయితే, అద్భుత కళాఖండం సాగర సంగమం మరొక ఎత్తు. ఈ ఒక్క సినిమా మీదనే వివిధ కోణాల్లో అనేక థీసిస్లు రాయవచ్చు.
సుమారు ఆరు దశాబ్దాల తన చలనచిత్ర జీవితంలో – విశ్వనాథ్గారు సుమారు 50 చిత్రాలకు దర్శకత్వం వహిం చారు. వీటిలో 9 హిందీ సినిమాలు. అనేక అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్రస్థాయి అవార్డులు, ఫిలిమ్ఫేర్ అవార్డులు ఆయనను వరించాయి. భారత ప్రభుత్వం నుంచి పద్మశ్రీ, దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారాల్ని అందుకున్నారు. దర్శకు డిగా విరామం తీసుకున్న తర్వాత నటుడిగా కూడా చాలా సినిమాల్లో తనదైన శైలిలో నటించి మెప్పించారు.
కట్ చేస్తే –
విశ్వనాథ్ గారు మంచి రైటర్. వారి రచనా విధానం విశిష్టమైనది. అందరూ సాధారణంగా ఒక పాయింట్ అనుకొని కథ రాసుకుంటారు. వారు మాత్రం ముందు తన ఊహల్లో ఒక పాత్ర అనుకొని, దానికి ఒక సీన్ జోడించి, కథ వెనక్కి అల్లుకుంటూ వస్తారు. ఆయన కథలన్నీ అద్భుత కళాఖండాలుగా నిలిచిపోయాయి. కథ రాసేటప్పుడే ఇక్కడ ఇలాంటి పాట ఉంటే బాగుంటుందని కొన్ని మాటల్ని రాసుకునేవారు. రఫ్గా ఆయన రాసుకున్న ఆ మాటలే ఆయన సినిమాల్లోని ఎన్నెన్నో పాటల పల్లవులు అంటే నమ్మగలరా? కానీ, ఇది నిజం.
రామ్గోపాల్వర్మ వంటి విశృంఖలవాది దర్శకుడు కూడా ఒక ఇంటర్వ్యూలో విశ్వనాథ్ గారి శంకరాభరణం సినిమా తన మీద చాలా విధాల ప్రభావం చూపిందని చెప్పారు. శంకరాభరణంలో శంకరశాస్త్రి చెప్పిన ఒక పూర్తి డైలాగ్ను అప్పటికప్పు డు తడుముకోకుండా చెప్పారు. అందరిపైనా అంతటి ముద్ర వేసిన శంకరాభరణం సినిమా 43 ఏళ్ల క్రితం రిలీజైన రోజైన ఫిబ్రవరి 2 నాడే విశ్వనాథ్ గారు నిష్క్రమించటం విశేషం.
మనోహర్ చిమ్మని: 99895 78125
(వ్యాసకర్త: రచయిత, ఫిల్మ్ డైరక్టర్)