Manipur violence | 1949 అక్టోబర్ 15న భారత్లో అంతర్భాగమైన మణిపూర్, కొన్ని దశాబ్దాల పాటు కేంద్ర పాలిత ప్రాంతంగా కొనసాగి, అనేక పోరాటాల ఫలితంగా 1972లో ఒక రాష్ట్రంగా అవతరించింది. సుమారు 30 వరకూ వివిధ కులాలు, తెగలు ఉన్నా, ముఖ్యంగా మూడు తెగలు మైతీ, నాగా, కుకీలు మెజారిటీగా ఉన్నారు. రాష్ట్ర జనాభా దాదాపు 38 లక్షలు. వీరిలో అత్యధికులు అనగా 60శాతంగా ఉన్న మైతీలు ఇతరుల పై పైచేయి కొనసాగిస్తున్నారు.
60 మంది శాసనసభ్యుల్లో 40 మంది శాసనసభ్యులు మైతీ తెగకు చెందినవారే. దీంతో గత కొన్నేండ్లుగా వీరి కి లాభపడే విధంగా వివిధ రకాల అటవీ చట్టాలు తయారు చేసుకుంటూ, కొన్ని రిజర్వేషన్లు అనుభవిస్తున్నారు. నాగా, కుకీలపై ఆధిపత్యం కోసం, వారిని పారదోలే పథకాలు రచిస్తున్నారు. తరచూ హింసాత్మక ఘటనలు చేపడుతూ అస్తవ్యస్తం చేస్తున్నారు. దీంతో మైతీలు వర్సెస్ నాగా, కుకీలు మధ్య తరచూ ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి. దీనికి తోడు రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ కూడా మైతీల పక్షపాతిగా వ్యవహరించడంతో ఈ ఘర్షణలు నేడు తారాస్థాయికి చేరుకున్నాయి.గత మూడు నెలలుగా మణిపూర్లో జరుగుతున్న ఘర్షణలపై ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. భారత్లో ప్రజాస్వామ్యం ధ్వంసమవుతుందని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని ఆరోపిస్తున్నాయి.
ఇటీవల కాలంలో వెలుగు చూసిన మహిళల నగ్న ఊరేగింపు, అఘాయిత్యాలు, హత్యలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి. నెలల తరబడి మౌనవ్రతం చేసిన ప్రధాని నోరు విప్పి ‘ఇది చాలా అమానుషం, దోషులను కఠినంగా శిక్షిస్తాం’ అంటూ సానుభూతి కురిపించే ప్రయత్నం చేశాడు. దీంతో రాష్ట్ర ,కేంద్ర ప్రభుత్వాలు మణిపూర్లో అల్లర్లను నియంత్రించడంలో విఫలం చెందాయని తేలిపోయింది. దీనికి తోడు, సుప్రీంకోర్టు కూడా మణిపూర్లో జరిగిన సంఘటన పట్ల తీవ్రంగా స్పందించింది. సుమోటోగా కేసు స్వీకరించింది. సాక్షాత్తు సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ ‘మణిపూర్ విషయం మీరు చూస్తారా (లేదా) మమ్మ ల్నే చూడమంటారా’…అని ఘాటుగా స్పందించారు. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆడిన దోబూచులాట బట్టబయలైంది.
దేశానికి స్వాతంత్య్రం వచ్చి, ఘనంగా 75 సంవత్సరాల ఆజాదీకా అమృతోత్సవాలు బాగా జరుపుకున్నా అసలు దేశంలో అట్టడుగు వర్గాల ప్రజలు ఎలా ఉన్నారు? వారి ఆర్థిక, సామాజిక పరిస్థితులు ఎలా ఉన్నాయో తులనాత్మక అధ్యయనం చేస్తున్నారా? అనే ప్రశ్న నేడు అందరి మదిలో మెదిలే అంశం. ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర పాలకులు అధికారం చేపట్టిన నాటినుంచి, ఆ అధికారాన్ని నిలబెట్టుకోవడం కోసమే పదవీకాలం అంతా వెచ్చిస్తున్నట్టు కనపడుతుంది తప్ప, దేశ ప్రజలందరికీ స్వాతంత్య్ర సమర యోధులు ఆశించిన ఫలాలు, రాజ్యాంగ ఆశయాలు అందుతున్నాయా అని చూడకపోవడం పెద్ద పరిపాలనా లోపం అని ఇకనైనా పాలకులు గ్రహించాలి. కేంద్ర పాలకులు తమ అధికారాన్ని సుస్థిరం చేసుకోవడానికి ప్రజల మధ్య కులాలు, తెగలు మతాలు, భాషలు, వివిధ రకాల దాడులతో చిచ్చులు పెడుతూ తిరిగి అధికారంలోకి రావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది శోచనీయం. విదేశీ శత్రుదాడులు, ఉగ్రవాదులు నుంచి దేశాన్ని కాపాడేందుకు ఎంత శ్రమ, ఖర్చు అవుతుందో… అంతకు మించి ఈ పాలకుల వైఫల్యం కారణంగా దేశంలో జరిగే అంతః కలహాల వల్ల కలిగే నష్టాలకు అంతకుమించి ఖర్చవుతుందని గ్రహించాలి. ప్రజాధనం వృథా అవుతున్నది. అనేక మంది ప్రాణాలు కోల్పోయే పరిస్థితి, ఆస్తి నష్టం కావున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, పాలకులు రాజ్యాంగ స్ఫూర్తితో పాలన అందించాలి. అందరికీ సమాన హక్కులు, అవకాశాలు కల్పించాలి. విద్యా, వైద్యం, నీరు, కూడు, గుడ్డ, నీడ అందించాలి. ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకోవాలి. మేధో వలసలు నివారించాలి. ప్రతి సంవత్సరం లక్షల సంఖ్యలో మన భారతీయ మేధావులు విదేశాలకు తరలి పోతున్నారు.
జీఎస్టీ ప్రతి నెలా ఒక లక్షా యాభై వేల కోట్ల రూపాయలు దాటిందని, త్వరలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ రూపొందుతుందని కూడా చెబుతున్న పాలకులు, అసలు భారతదేశంలో వివిధ ప్రాంతాల్లో ఉన్న ప్రజల సమస్యల పట్ల ఆలోచన చేస్తున్నా రా? మహిళలు, రైతులు, మైనారిటీలు, గిరిజనులు, అట్టడుగు బడు గు బలహీన వర్గాల ప్రజల సమస్యల్ని పరిష్కరించడానికి ఏ చర్య లు తీసుకోవాలి అనే విషయాన్ని మరిచిపోవడం బాధాకరం. కనీ సం టమోటా ధరలను నియంత్రించే విధానం కనుచూపు మేరలో కనపడటంలేదు.
గత మే నుంచి మణిపూర్ మంటల్లో కాలి బూడిదవుతుంటే, దేశ ప్రధాని కనీసం ఒకసారైనా ఆ రాష్ర్టాన్ని సందర్శించిన దాఖలాలు లేవు. కానీ, అదే సమయంలో ఎన్నికల క్యాంపెయిన్ కోసం కర్ణాటక రాష్ట్రంలో పలుమార్లు పర్యటించారు. అంటే ప్రజలు ఏమైపోయినా పర్వాలేదు. మాకు మాత్రం అధికారమే కావాలి అన్నట్టున్నది. అదే విధంగా వివిధ పార్టీలతో భవిష్యత్తులో అధికారం చేపట్టేందుకు కార్యాచరణ సమావేశాలు, విదేశీ పర్యటనలకు సమయం ఉంటుంది కానీ, స్వదేశంలో ప్రజల సమస్యల్ని పరిష్కరించడానికి సమయం కేటాయించకపోవడం బాధాకరం. ప్రపంచానికి, ప్రజలకు వాస్తవాలు తెలియకుండా ఉండటానికి మాత్రం ఇంటర్నెట్ షట్ డౌన్ చేయడం, మీడియాపై ఉక్కు పాదం మోపడం తరచూ చేస్తున్నారు. ప్రజాస్వామ్య హక్కులను తుంగలో తొక్కుతున్నారు. అసలు భారతదేశ విశిష్ట లక్షణం భిన్నత్వంలో ఏకత్వం అనే విషయాన్ని నేటి పాలకులు మరచిపోవడమే పెద్ద సమస్య. ఇదే నేడు దేశంలో అనేక సమస్యలకు కారణం కూడా. ప్రభుత్వాలు ఏవైనా ప్రజాస్వామ్య పద్ధతిలో, రాజ్యాంగ స్ఫూర్తితో పాలన అందించాలి. రాజ్యాంగ సంస్థలు, స్వయంప్రతిపత్తి కలిగిన సంస్థలను ఒక క్రమ పద్ధతిలో పనిచేసే అవకాశం అధికార పార్టీలు కలిగించాలి. అప్పుడు మాత్రమే దేశంలో అన్ని చోట్లా అందరూ ఆనందంగా జీవిస్తారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వా మ్య దేశంగా ఉన్న భారత్ విశిష్టత మరింత ఇనుమడిస్తుంది.
-రావుశ్రీ
63056 82733