భారతీయ కుటుంబ వ్యవస్థలో అన్నదమ్ములంటే రామలక్ష్మణులు, బలరామకృష్ణుల్లా ఉండాలని కోరుకుంటారు. రామలక్ష్మణులు దశరథుడి కొడుకులు. కానీ తల్లులు వేరు. బలరామకృష్ణులకూ అంతే. తండ్రి వసుదేవుడు కాగా, తల్లులు వేరు. బలరాముడి తల్లి రోహిణి, కృష్ణుడి తల్లి దేవకి. బలరాముడు దేవకి ఏడో గర్భం. కంసుడు ఎలాగైనా సంహరిస్తాడనే ఉద్దేశంతో, ఆ పిండాన్ని విష్ణువు యోగమాయ సాయంతో గోకులంలో ఉన్న వసుదేవుడి మరో భార్య రోహిణి గర్భంలో ప్రవేశపెట్టాడని కథ. దాంతో బలరాముడు సంకర్షణుడు అయ్యాడు. దేవకి ఎనిమిదో సంతానం కృష్ణుడిని కంసుడి బారినుంచి రక్షించడానికి వసుదేవుడు మథుర నుంచి గోకులానికి తరలిస్తాడు. నందుడి ఇంటికి చేరుస్తాడు. అలా బలరాముడు, కృష్ణుడు కొంతకాలం గోకులంలో, మరికొంతకాలం బృందావనంలో పెరిగి పెద్దవుతారు.
బలరామకృష్ణులను విష్ణువు ఎనిమిది, తొమ్మిదో అవతారాలుగా పరిగణిస్తారు. కొన్నిచోట్ల మాత్రం బలరాముడిని కేవలం విష్ణువు అంశగానే భావిస్తారు. విష్ణువు తల్పమైన ఆదిశేషుడే బలరాముడిగా పుట్టాడనే కథ కూడా ప్రచారంలో ఉంది. శ్రీమహావిష్ణువు, ఆదిశేషుడిని వేరుగా చూడలేం. బలరామకృష్ణులు కూడా అంతే! బలరాముడిది తెలుపు రంగు, కృష్ణుడిది నలుపు రంగు. బలరాముడు నీలం రంగు వస్త్రం, కృష్ణుడు పసుపు రంగు పీతాంబరం ధరిస్తారు. కృష్ణుడి కళ్లలో కొంటెతనం ఉట్టిపడుతుంటుంది. బలరాముడేమో బోళాతనం ప్రదర్శిస్తాడు. ఈ రకంగా ఇద్దరూ శివకేశవుల్లా అనిపిస్తారు. మామూలుగా చూస్తే బలరామకృష్ణులు శారీరకంగా వేర్వేరు. కానీ, వాళ్లు ఆడుతూ, పాడుతూ విహరిస్తుంటే మాత్రం కవలపిల్లలు తిరుగుతూ ఉన్నట్లే ఉండేది. ఈ నేపథ్యంతోనే అన్నమయ్య ‘అనుచు నిద్దరు నాడేరు అమడల వలెనే/ మొనసి ఇవెల్లా జూచి మొక్కిరి బ్రహ్మాదులు’ అంటూ సంకీర్తన రూపంలో వారిద్దరి బాల్యపు చేష్టలను కండ్లకు కట్టాడు. ఇందులో ‘అమడలు’ అంటే కవలలు అని అర్థం. నిజానికి వాళ్లు కవలలు కాదు. అలా కనిపిస్తారు.
ఓ సందర్భంలో బలరాముడు ఏవో పండ్లు తింటుంటాడు. అది గమనించిన కృష్ణుడు ‘అన్నయ్యా! నాకు కూడా రెండు పండ్లు ఇవ్వొచ్చు కదా!’ అని అడుగుతాడు. దానికి బలరాముడు ‘నువ్వు నాకు ఇలాగే ఇస్తావా?’ అంటాడు. ‘నేను నీకంటే చిన్నవాణ్ని కదా! ఇస్తే ఏం పోతుంది?’ అని ముద్దుగా అంటాడు ముకుందుడు. అంతకుముందెప్పుడో అన్నయ్య కూడా కన్నయ్యను తనకు పండ్లిమ్మని అడిగి ఉంటాడు. అప్పుడు కృష్ణుడు కాదన్నాడేమో! అందుకే బలరాముడు అలా అని ఉంటాడు. ఓమారు కృష్ణుడు వెన్నకోసం ఉట్టిని అందుకునే ప్రయత్నంలో ఉన్నట్లున్నాడు. అక్కడే ఉన్న బలరాముడు తనను కూడా ఉట్టిని అందుకోనివ్వమని అడుగుతాడు. దానికి కృష్ణుడు ‘నువ్వు ఇక్కడికి రావద్దు, కిందపడిపోతావు’ అని ఆటపట్టిస్తాడు. అప్పుడు ‘నీకు దండం పెడతానురా! ఒక్కసారి నన్ను ఎక్కనివ్వు, లేకుంటే అమ్మకు చెబుతాను. నిన్ను కిందికి దింపేస్తుంది చూడు’ అని హెచ్చరిస్తాడు బలరాముడు. మొత్తానికి కన్నయ్య అల్లరిని అన్నయ్య తట్టుకోలేకపోయాడు. అంతే.. ‘నువ్వెక్కడి తమ్ముడివిరా? ఇద్దరిలో ఎవరు ఎక్కువో తేల్చుకుందాం’ రమ్మంటాడు. నువ్వు శ్రీమహావిష్ణువు (వేంకటేశ్వరుడు)అయినాసరే, నేను నీకంటే పెద్ద అనే సంగతి మరచిపోవద్దని గుర్తుచేస్తాడు. బలరామకృష్ణుల అల్లరిని చూసిన మనుషులే కాదు బ్రహ్మాది దేవతలు సైతం వాళ్లకు మొక్కుతున్నారని కీర్తిస్తాడు అన్నమయ్య.
కృష్ణుడు, బలరాముడు బాల్యంలోనే ఎన్నో లీలలను చూపించారు. పూతన, శకటాసురుడు, బకాసురుడు తదితర రాక్షసులను కృష్ణుడు సంహరిస్తాడు. బలరాముడేమో ధేనుకాసురుడు, ప్రలంబుడు, ద్వివిదుడిని హతమారుస్తాడు. ఆ తర్వాత మథురలో కంసుణ్ని చంపడం, అక్కడినుంచి ద్వారకకు పయనం ఇలా ప్రతీ సందర్భంలో బలరామకృష్ణు లు ఇద్దరూ కలిసే ఉన్నారు. కానీ, కృష్ణుడు పాండవుల పక్షపాతిగా ఉండ గా, బలరాముడు కౌరవుల పక్షాన మాట్లాడటం విచిత్రం. అవతారం పరంగా చూస్తే త్రేతాయుగంలో విష్ణువు రాముడిగా, ఆదిశేషుడు లక్ష్మణుడిగా అన్నాతమ్ముళ్లుగా అవతరించారు. ద్వాపరంలో మాత్రం ఆదిశేషుడు అన్న బలరాముడిగా, విష్ణువు తమ్ముడు కృష్ణుడిగా జన్మించారు. శ్రీరాముడిని అనుక్షణం కనిపెట్టుకుని ఉన్నందుకు లక్ష్మణుడు కోరుకున్న వరం కారణంగానే ఈ విధంగా జరిగిందనే కథలు ప్రచారంలో ఉన్నాయి. అలా పరమాత్ముడు రెండు అవతారాల మధ్య సమతుల్యత సాధించినట్లయింది.
– చింతలపల్లి హర్షవర్ధన్