యస్య త్వేతాని చత్వారి వానరేంద్ర యథా తవ
ధృతిర్దృష్టిర్మతిర్దాక్ష్యం స్వకర్మ సు న సీదతి॥
(సుందరకాండ మొదటి సర్గ)
సీతమ్మను వెతికేపనిలో హనుమ సముద్రాన్ని దాటుతూ లంకవైపు వెళ్తున్నాడు. ఆ క్రమంలో పవనసుతుణ్ని పరీక్షించడానికి దేవతల పనుపున మైనాకుడు తనపై విశ్రాంతి తీసుకోమని ప్రార్థించాడు. ఇది కార్యసాధనలో ప్రలోభానికి సంబంధించినది. సురస అతనిని భయపెట్టే ప్రయత్నం చేసింది. ఇది ఆటంకానికి సంబంధించినది. తర్వాత ఎదురైన అవరోధం సింహిక. హనుమ ఆమెను వధించాడు. అప్పుడు సమస్త భూతాలూ ఆయనతో.. ‘చాలా భయంకరమైన కర్మను చేశావు. నీకు ప్రియమైన కార్యాన్ని సాధించు. నీకు శుభమగుగాక’ అని దీవించాయి.
ఎవరికైతే ధృతి (సడలని పట్టుదలతో చివరిదాకా ప్రయత్నించడం), దృష్టి (ఏకాగ్రతతో పని తాలూకు పరిపూర్ణ ఫలితాన్ని దర్శించడం-దార్శనికత), మతి (బుద్ధిబలం- ప్రణాళికలను తయారుచేసుకోవడం), దాక్ష్యం (కార్య నిర్వహణలో అవసరమైన సామర్థ్యం, శారీరక మానసిక సన్నద్ధత) ఉంటాయో వారికి విజయం లభిస్తుంది, ఆపదలు రావు. సాధనలో ఉన్న సాధకునికి ఏదైనా సాధించగలననే నమ్మకం అవసరం. ఆ సాధనలో ఎన్నో శక్తులు తనకు అలవడవచ్చు. ఆ ప్రలోభాలకు లొంగకుండా ముందుకు సాగడం ముఖ్యమైనది. పరీక్షలను ఎదుర్కొనే ప్రతిభ కావాలి. శక్తియుక్తులతో లక్ష్యాన్ని సాధించగలిగే ప్రజ్ఞ కావాలి.
వంద యోజనాల సముద్రాన్ని దాటగలననే నమ్మకంతో ఉద్యమించడం ధృతి. ఎవరి అండ చూసుకొని హనుమ ఆ సాహసం చేశాడు? శ్రీరాముని పట్ల పూర్తి సమర్పణ భావంతో ఉన్న ధైర్యం, రామ కార్యాన్ని సాధించడంలో తానొక సాధనంగా ఉపయోగపడాలనే తపనతో! సర్వ సమర్పణ భావనకు ఉండవలసిన ముఖ్య లక్షణం ఇది. ధృతి కలిగినవారు అడ్డంకులకు భయపడరు. మైనాకుని విన్నపాన్ని సున్నితంగా ఆదరించడం.. దృష్టి. ఇదే దార్శనికత. లక్ష్యం నుంచి దృష్టి మరల్చకపోవడం, సూక్ష్మపరిశీలనే దృష్టి. ఇక్కడ అణిమాది సిద్ధులు తనకు లభించవచ్చు. ఆ ప్రలోభాలకు లొంగితే కార్యభంగమవుతుంది. సాధనకు విఘ్నం కలుగుతుంది. కార్యసాధకులు ప్రలోభాలకు లొంగరు.
సురస ఆశీస్సులు పొందడం.. మతి. కార్య నిర్వహణకు సంబంధించిన సమగ్రమైన జ్ఞానమే మతి. దానినే ధీ అనీ, బుద్ధి అనీ అంటారు. విచక్షణ, వివేచన దీనికి అంగాలు. పట్టుదలతో, జవాబుదారీతనంతో, ఈ పని ఫలితానికి ‘నేనే’ కర్తను అనే భావనకు దూరంగా పనిని ఉపాసనాభావనతో నిర్వహించడం బుద్ధిగా, మతిగా చెప్పుకోవచ్చు. ‘మతిరాగామి గోచరా’ అంటే చేసే పని ఫలితాన్ని కచ్చితంగా ఊహించగలగడం. కాకపోతే ఆ ఫలితానికి అతుక్కుపోకుండా ఉండటం చాలా ప్రముఖమైనది. సింహికను సంహరించడం.. దాక్ష్యం. అదే సామర్థ్యం. కొన్ని పనులను నిర్వహించడంలో పూర్తి శక్తిసామర్థ్యాలను వినియోగించవలసి వస్తుంది. ఆ సామర్థ్యం కలిగినవారిని పరీక్షించి వారికే యాజమాన్యం అలాంటి ముఖ్యమైన కార్యాన్ని అప్పగిస్తుంది. ‘అకర్తవ్యం నకర్తవ్యం ప్రాణఃకంఠ కతైరపి, కర్తవ్యమేవ కర్తవ్యం ప్రాణఃకంఠ కతైరపి’ ప్రాణం పోతున్నా నిషిద్ధకర్మలను ఆచరించవద్దు. అలాగే చేయవలసిన కర్మలను విడిచిపెట్టవద్దు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా వాటిని అధిగమించి లక్ష్యాన్ని సాధించినవాడే చరిత్రలో నిలిచిపోతాడు.
మైనాకుడు, సురస, సింహిక అనే త్రిగుణాలను అధిగమించిన హనుమంతుడనే సాధకుడు సీత అనే ఆదిశక్తిని దర్శించగలిగాడు. నిజానికి సింహిక కూడా ఆ నాలుగు శక్తులనూ కలిగినదే. కాకపోతే సింహిక లక్ష్యం స్వార్థానికి సంబంధించినది. హనుమ లక్ష్యం స్వామి కార్యానికి సంబంధించినది. కాబట్టే ఆ అడ్డంకిని అధిగమించగలిగాడు హనుమ.
– పాలకుర్తి రామమూర్తి