ఖలిస్థానీ కారుమబ్బులు పంజాబ్పై మరోసారి అలుముకుంటున్నాయి. నలభై ఏండ్ల కింద ఆ రాష్ర్టాన్ని అతలాకుతలం చేసిన వేర్పాటువాదం మళ్లీ పడగ విప్పుతున్నది. సిక్కులకు ప్రత్యేక దేశం కావాలనే నినాదం జోరందుకుంటున్నది. పైకి కనిపిస్తున్నది 30 ఏండ్ల యువకు డు అమృత్పాల్సింగే కావచ్చు కానీ లోపల అటు పాకిస్థాన్ ఐఎస్ఐ నుంచి ఇటు పలు పాశ్చాత్య దేశాల్లోని సిక్కు తీవ్రవాద సంస్థల పాత్ర ఉందని వార్తలు వస్తున్నాయి. నటుడు, ఖలిస్థాన్ ఉద్యమానికి బహిరం గ మద్దతు ప్రకటించిన సందీప్ సింగ్ సిద్ధూ స్థాపించిన ‘వారిస్ పంజాబ్ దే’కు అధిపతిగా అమృత్పాల్ పగ్గాలు చేపట్టేవరకూ, అంటే ఆరు నెలల కిందటి వరకూ అతడి గురించి దేశమంతటా అటుంచి పంజాబ్లో సైతం సాధారణ ప్రజానీకానికి తెలియదు. దుబాయ్లో తన బంధువుల ట్రాన్స్పోర్ట్ కంపెనీలో పనిచేసే సాదాసీదా అమృత్పాల్ అక్కడినుంచి వచ్చి, ఖలిస్థానీ అవతారం ఎత్తటం, రాష్ట్రంలో శాం తిభద్రతల సమస్యను సృష్టించటం, ఇప్పుడు దేశం యావత్తు తల తిప్పి చూసేలా చేయటం అంతా వెంటవెంటనే జరిగిపోయాయి.
పంజాబీలపై వివక్ష చూపుతున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు మాజీ ప్రధాని ఇందిరకు పట్టిన గతే పడుతుందంటూ అమృత్పాల్ వివాదాస్పద ప్రకటనలు జారీచేయటం ప్రారంభించాడు. కిడ్నాప్ కేసులో అరెస్టయిన తన అనుచరుడిని విడుదల చేయాలని పంజాబ్ పోలీసులను ‘ఆదేశించాడు’. వారు వినకపోవటంతో అతడి అనుచరు లు ఆటోమేటిక్ రైఫిళ్లతో, కత్తులతో పోలీస్ కాంప్లెక్స్పై దాడికి దిగి విధ్వంసం జరిపారు. గురుద్వారాల్లో ప్రార్థనలు నిర్దేశిత పద్ధతుల ప్రకా రం జరుగటం లేదని కొన్ని గురుద్వారాల్లో వీరంగం సృష్టించారు. 1980ల నాటి ఖలిస్థానీ ఉగ్రవాది భింద్రన్వాలేలాగే తలపాగా, వస్ర్తా లు ధరిస్తూ ఆయుధాలు చేబూనిన అంగరక్షకుల మధ్య సంచరిస్తూ రెచ్చగొట్టే ప్రసంగాలు ప్రారంభించాడు అమృత్పాల్సింగ్. ఇంత జరుగుతున్నా కేంద్ర ప్రభుత్వం రాష్ర్టానికి ముందస్తుగా సరైన సమాచారం ఇవ్వకుండా, అప్రమత్తం చేయకుండా చూస్తూ ఊరుకోవటం అర్థం కాని విషయం.
తాము అధికారంలోకి వచ్చాక ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపామని చెప్పుకొనే కేంద్రంలోని మోదీ సర్కార్.. ఖలిస్థానీ వాదం మళ్లీ మొగ్గతొడిగి, జడలు విప్పుతున్నా నిష్క్రియాపరత్వాన్ని చూపింది. పాకిస్థాన్తో సరిహద్దును పంచుకునే పంజాబ్ వ్యూహాత్మకంగా కీలక రాష్ట్రం. అక్కడ కొన్ని నెలలుగా తీవ్రవాదం తిరిగి తలెత్తుతున్నా కేం ద్ర ఇంటెలిజెన్స్ ఏం చేస్తున్నదో తెలియదు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఖలిస్థానీ వాదం పంజాబ్ కొత్త తరానికి విస్తరించలేదు. రాష్ట్ర ప్రజానీకం కూడా పాత గాయాల నేపథ్యంలో ఇటువంటి తీవ్రవాదాన్ని భరించే స్థితిలో లేదు. ఇదే అదనుగా అమృత్పాల్ వంటి దుశ్శక్తులను చట్టం ముందు నిలబెట్టి తగిన శిక్షపడేలా కేంద్ర, రాష్ర్టాలు తక్షణ చర్యలు చేపట్టాలి. అతడి వెనుక ఉన్న సంస్థలను, శక్తులను నిర్వీర్యపరచటానికి, మరొకమారు వేర్పాటువాదం తలెత్తకుండా దీర్ఘకాలిక, సమగ్ర వ్యూహాన్ని రూపొందించి అమలుచేయాలి.