జాతి సాంస్కృతిక, చారిత్రిక వారసత్వానికి ప్రతీకలుగా ప్రభుత్వ చిహ్నాలు రూపొందుతాయి. అందులో గత చరిత్ర ఆనవాళ్లు చోటుచేసుకుంటాయి. వీటిని ప్రభుత్వాలు మారినప్పుడల్లా మార్చరు. ప్రభుత్వాలు వస్తుంటాయి, పోతుంటాయి. కానీ రాజ్యం శాశ్వతం. అందుకే అసాధారణ పరిస్థితుల్లో తప్ప చిహ్నాల జోలికి వెళ్లరు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం అందుకు భిన్నమైన మార్గంలో వెళ్తుండటం గమనార్హం. కేసీఆర్ మీదున్న కక్ష, కార్పణ్యమే అందుకు కారణమని చెప్పాలి. స్వరాష్ట్ర సాధకుడిగా కేసీఆర్ పేరు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది.
పదేండ్ల పాలనలో తెలంగాణను అద్వితీయంగా అభివృద్ధి పరచి దేశానికే ఆదర్శంగా నిలిపి పాలనలోనూ తనదైన ముద్ర వేశారాయన. ఆ ముద్రను ఎలాగైనా చెరిపేయాలని తెగ ఉవ్విళ్లూరుతున్నారు సీఎం రేవంత్. అది సాధ్యం కాదని తనకు తెలుసు. అందుకే రాష్ట్ర చిహ్నం మీద పడ్డారు. కేసీఆర్ మీది అక్కసుతో కాళేశ్వరాన్ని గంగపాలు చేయాలని చూశారు. అది కుదరలేదు. చిహ్నం మార్చడం చేతిలో పని కదా అని ఆ వైపుగా అడుగులు వేస్తున్నారు. ఇంతకూ ప్రభుత్వ చిహ్నంపై ఆయనకున్న అభ్యంతరమేమిటి? అంటే ‘రాజరికపు ఆనవాళ్లు’ అనే సమాధానం వస్తున్నది. ఘనమైన మన చారిత్రక వారసత్వ సంపదను ఈ సాకుతో మరుగునపడేసేందుకు రేవంత్ సిద్ధమవుతున్నారు. ఇది ఎంతో ఆందోళన కలిగించే విషయం.
సంపద్వంతమైన తెలుగు గడ్డపై ఢిల్లీ సుల్తాన్ దండయాత్రను ఎదిరించి విజయం సాధించినందుకు గుర్తుగా కాకతీయులు నిర్మించిన శిలాతోరణాన్ని రాచరికపు గుర్తు అని అంటున్నారు. కుతుబ్షాహీల కాలంలో మహమ్మారి వల్ల పెద్దఎత్తున జనం మరణిస్తే నిర్మించిన స్మారకం చార్మినార్ను కూడా రాచరికపు ఆనవాలేనని కొట్టిపారేస్తున్నారు. వాటిని రాష్ట్ర గేయం నుంచి కూడా తొలగిస్తానని పంతం పూనారు. ఇవన్నీ జాతి జీవితంపై అవగాహన లేని మాటలు. వారసత్వంపై, సాంప్రదాయంపై ఏ మాత్రం గౌరవం లేని అవాకులు, చెవాకులు. ఇదివరకటి సర్కారు మీద అక్కసుతో వెళ్లగక్కుతున్న తలతిక్క తర్కం ఇది. ఈ తర్కాన్ని సాగలాగితే ఢిల్లీ సర్కారుకు ప్రతీకగా నిలిచే నాలుగు సింహాలూ రాజరికపు ముద్ర కిందికే వస్తాయి. మరి కేంద్ర నాయకత్వాన్ని ఒప్పించి దానినీ తప్పిస్తారా? ఆగస్టు 15న ఎర్రకోట మీద నుంచి ప్రధాని జాతినుద్దేశించి ప్రసంగిస్తారు. అదీ రాజరికపు చిహ్నమే కదా! ఈ సంప్రదాయాన్ని కూడా మార్చాలని కాంగ్రెస్ కోరుకుంటున్నదా?
రేవంత్ తిమ్మిని బమ్మిని చేసి చిన్నవయసులో సీఎం అయ్యారు. ఎంతో కొంత ఉరుకులాట ఉండాల్సిందే. బయట చాలా సమస్యలు పరిష్కారాల కోసం ఎదురు చూస్తున్నాయి. ఎన్నికల ముందు ఎడాపెడా ఇచ్చేసిన హామీల అమలు కోసం ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్నారు. వాటి అమలుకు అవసరమైన ఆర్థిక వనరులు సమకూర్చాల్సి ఉంది. హింసారాజకీయాలు పెట్రేగుతున్నాయి. ప్రతీకార దాడులు పెచ్చరిల్లుతున్నాయి. కీలకమైన ఐటీ రంగం ఒడుదొడుకులు ఎదుర్కొంటున్నది. రియల్ ఎస్టేట్ రంగం పడిపోతున్నది. ఇవన్నీ గాలికి వదిలేసి చిహ్నం, గేయం అంటూ చిందులు తొక్కుతున్నారు ముఖ్యమంత్రి రేవంత్. ఇదంతా గమనిస్తే తమ పాలన వైఫల్యాల మీద నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు ఇలాంటి పనిలేని పనులు ముందేసుకుంటున్నారా? అనే సందేహం కలుగకమానదు.
వాగ్గేయకారుడు అందెశ్రీ రాసిన జయజయహే గీతం తెలంగాణ ఉద్యమంలో బహుళ జనాదరణ పొందిన గీతాల్లో ఒకటి. ఈ పాట కాలక్రమంలో మార్పులకు గురి కావడమూ అందరికీ తెలిసిందే. కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ (ఇదివరకటి టీఆర్ఎస్) ఉద్యమ సభల్లో, ఎన్నికల ప్రచారాల్లో దీనికి ఎంతో ప్రాచుర్యం కల్పించింది. వచ్చే జూన్ 2 ఉత్సవాలపై తన ముద్ర వేయాలనే అత్యుత్సాహంతో సీఎం రేవంత్ హడావుడి చేస్తున్నారు. వివిధ కారణాల వల్ల ఈ అంశం వివాదాస్పదమవుతుండటం మనం చూస్తున్నాం.
ప్రభుత్వ ముద్రలో వద్దన్న రాజముద్రలు రాష్ట్ర గేయంలో ఉండవచ్చా? అనే చర్చలూ ముందుకు వచ్చాయి. దీంతో జయజయహే గీతంలోనూ కాకతీయం, చార్మినార్ కత్తిరింపునకు గురవుతాయనే మాటలు వినిపిస్తున్నాయి. మన ఇరుగుపొరుగు రాష్ర్టాల్లోనూ సాంస్కృతిక ప్రతీకలు, చారిత్రక కట్టడాలు రాజ్య అధికారిక చిహ్నాల్లో కనిపిస్తాయి. ప్రభుత్వాలు మారినప్పుడల్లా వాటిని మార్చరు. కానీ, రాష్ట్ర ప్రభుత్వం తన దారి వేరని అంటున్నది. వాహనాలపై టీఎస్ అని ఉంటే దానిని టీజీగా మార్చారు. ఇప్పుడు రాజరిక ముద్రలు అనే నెపం మీద వారసత్వపు గుర్తులను ప్రభుత్వ చిహ్నాల నుంచి తొలగించే పనికి సర్కారు సిద్ధమవుతున్నది. త్యాగాలు, పోరాటాలు స్ఫురించేలా చిహ్నం, గేయం మారుస్తామని ఉద్యమంతో ఏ మాత్రం సంబంధం లేని సీఎం రేవంత్ చెప్పడం హాస్యాస్పదం.