మనిషి జీవితం ఎంతో సంక్లిష్టమైనది. అది ఎప్పుడూ స్కేలు పెట్టి గీచినట్టు సరళరేఖగా ఉండదు. చలనశీలత, ప్రవాహశీలత దాని ప్రధాన లక్షణం. నమ్మిన సిద్ధాంతాన్ని ఆలంబనగా చేసుకొని బతుకుతున్నప్పటికీ తడబాట్లు, పొరపాట్లు, పరిమితులు తప్పవు. ఎందుకంటే ఏ సిద్ధాంతమూ ఎల్లకాలం నిలబడదు. ఎంతో శాస్త్రీయమైనప్పటికీ, ఆచరణీయమైనప్పటికీ అది సమాజానికి చేయవలసినంత మేలు చేస్తూ పరిమితుల దగ్గర నిలిచిపోతుంది.
ప్రపంచవ్యాప్తంగా వస్తున్న సాంఘిక, ఆర్థిక, రాజకీయ, సాంకేతిక మార్పులకనుగుణంగా ఒక చారిత్రక అనివార్యత ఏర్పడినప్పుడు సిద్ధాంతం మార్చుకోవటాన్ని కూడా తప్పు పట్టలేం. మారినా, మారకున్నా తను ఎటువైపు ఉన్నాడన్నది ముఖ్యమైన అంశం. మనిషికి ఉండే కొన్ని పరిమితుల దృష్ట్యా కొన్ని తప్పులు చేసినా మొత్తంగా న్యాయం వైపు, ప్రజల వైపు ఉన్నాడా లేదా అన్న కొలమానంలో ఒక వ్యక్తిని అంచనా వేయవలసి ఉంటుంది. చేసిన కొన్ని తప్పులను, లోపాలను ఎత్తిచూపుతూ సమాజంలో అతడు నిర్వహించిన ప్రభావశీలమైన పాత్రను విస్మరించటం సంకుచితమే అవుతుంది. ‘ఉర్వి జనులకెల్ల ఉండు తప్పు’ అన్నాడు కదా మన వేమన్న.
ఐ యామ్ లార్జ్, ఐ కంటైన్ మల్టీట్యూడ్స్. ఇది వాల్ట్ విట్మన్ రచించిన ‘లీవ్స్ ఆఫ్ గ్రాస్’ అనే కవితలోని వాక్యం. ఈ వాక్యం ముఖ్యంగా గొప్ప గొప్ప కవులకు, కళాకారులకు, మేధావులకు వర్తిస్తుంది. అంటే వాళ్లలో సమర్థనీయమైన వైరుధ్యాలు, సంక్లిష్టతలుంటాయని అర్థం. గాంధీ చనిపోయినప్పుడు శ్రీశ్రీ అతని మీద రాసిన కవితను తప్పుబట్టిన వారున్నారు. శ్రీశ్రీలోని కవి గాంధీ మరణాన్ని అతనిపై కవిత రాయకుండా ఉంచలేకపోయింది. కాళోజీ నారాయణరావు ఎమ్మెల్సీ పదవిని, పద్మభూషణ్ పురస్కారాన్ని స్వీకరించినప్పుడు విమర్శలకు గురికాక తప్పలేదు. అయినా అతను కడదాకా నిత్య సత్యాగ్రహిగానే మిగిలాడు.
గద్దర్ను కూడా విప్లవ పంథా నుంచి నిష్ర్కమించిన తర్వాత అతని జీవితంలో వచ్చిన మార్పులను, పరిణామాలను ఈదృష్టితోనే అంచనా వేయాల్సి ఉంటుంది. మొత్తంగా చూస్తే గద్దర్ జీవితమంతా పెను సంచలనమే. ఆయన రూపు, ఆహార్యంలోనే ఒక విలక్షణత ఉన్నది. ఆయనతో పోల్చదగినవాడు ఆయనే అనిపిస్తుంది.
ప్రాథమికంగా, మౌలికంగా, వస్తుపరంగా చూస్తే ఆయన ఒక అనుపమాన నిరుపమాన కళాకారుడు. ఆ తర్వాతనే అతను మార్క్సిస్ట్, బుద్ధిస్ట్, అంబేద్కరిస్ట్. అతనిలోని ఈ మౌలికమైన కళాకారుడే అతన్ని సమతావాది అయిన రామానుజాచారిపై పాట రాయటానికి ప్రేరణ కల్పించి ఉండొచ్చు. కళాకారుడిగా చూస్తే అతను బహుముఖీనుడు. ఎంత గొప్పగా పాటలు రాయగలడో అంత గొప్పగా గళమెత్తి పాడగలడు. అంతకంటే మిన్నగా అభినయంతో ప్రదర్శనలు ఇవ్వగలడు. ఈ మూడు అంశాల్లో దేనిపాలు ఎక్కువ అంటే చెప్పలేం. ఆయన కాలికి గజ్జ, నడుముకు గోచి, చేతిలో కర్ర, కర్రపై జెండా, తలపై పాయలు పాయలుగా జాలువారే నెరిసిన జుట్టుతో స్టేజిపై నర్తిస్తుంటే పూనకంతో స్వయానా ఆ నిటలాక్షుడే గజ్జె కదిలించి రంగస్థలంపై రుద్ర తాండవం చేస్తున్నట్టుగా దర్శనమిస్తాడు. ఇక ప్రేక్షకులు పూనకాలతో ఊగిపోవడంలో ఆశ్చర్యమేముంది.
చిన్నచూపుతో చూడబడే గోచి గుడ్డను చివికిన గొంగడికి సమున్నత గౌరవాన్ని తెచ్చిపెట్టాడు. ఆయన కొన్ని వేల పాటలు రాసి ఉండవచ్చు. విప్లవ స్ఫూర్తి, భావుకత, అభ్యుదయం గంగమ్మతల్లి పాయలై పారుతున్నట్టుగా ఆయనలో ప్రవహిస్తాయి. విప్లవ గీతాలు రాసినప్పుడు గొప్ప విప్లవ కవిగా కనిపిస్తాడు. తల్లిపై, చెల్లిపై, భార్యపై, స్త్రీలపై రాసినప్పుడు ఆయనకు మించిన ఫెమినిస్ట్ మరొకరు ఉండరనిపిస్తుంది. ఏ అంశంపై రాసినా ఆ అంశాన్ని, వస్తువును తాత్వికస్థాయిలో కవిత్వీకరిస్తాడు. ఇది ఆయనలో కనిపించే అసాధారణ ప్రజ్ఞ. కవిత్వంలోని పాత పదాలు, పాత డిక్షన్, అలంకారాలు, ఛందస్సు, ఉపమానాల నడ్డి విరక్కొట్టి మళ్లీ లేవకుండా చేశాడు శ్రీశ్రీ. గద్దర్ కూడా తెలంగాణలో బహుజనులు వాడే, చీత్కారాలకు లోనై, మరుగునపడిన ఉర్దూ పదాలతో కలగలిసిన తెలుగు భాష, యాస, శైలిని వెలికితీసి, వాటిని శిఖరాన నిలిపి కావ్యస్థాయిని కల్పించాడు. ఆయన వర్ణనలు, ఉపమానాలు, ప్రతీకలన్ని తెలంగాణ మట్టిలో పుట్టినవే. అంతేనా! ‘నగరో నాగారో, అలివో అలివో, హోలా హోలియా, నగనాల నగనాలమ్మో’ లాంటి కొత్త పదాలను సృష్టించి తెలంగాణ భాషకు ఒక కొత్త డిక్షన్ అందించాడు. కవిత్వం ఒక ఆల్కెమి అంటాడు బాలగంగాధర తిలక్. గద్దర్ తన భాషను కూడా ఆల్కెమిగా మార్చి నూతన ఒరవడిని సృష్టించాడు. ఆయన శ్రీశ్రీ లాగా ప్రపంచ సాహిత్యాన్ని ఔపోసన పట్టిన కవి కాదు. గద్దర్ పాటలు రాసేటప్పుడు మెదడును కరిగించి, జుట్టు పీక్కొని కష్టపడి రాసినట్టుగా ఉండవు. ఒక సింహం గర్జించినట్టుగా లేడిపిల్ల గెంతులేస్తున్నట్టుగా, పిట్ట గాలిలో ఎగురుతున్నట్లుగా, చెలిమలో నీరు ఊరుతున్నట్టుగా ఉంటాయి.
అప్పటికప్పుడు స్పందించి సునాయాసంగా పాట రాయగలడు. ఆయనలోని మరో ప్రత్యేకత ఆయన గళం. నవరసాలను అలవోకగా ఆ గొంతులో పలికించగలడు. తెలుగు నేపథ్య గాయకులకు కూడా అంత వైవిధ్యమైన స్వరం ఉందో లేదో తెలియదు. బహుశా అందుకే ఆయనను వాగ్గేయకారుడితో పోల్చుతారు. ఆయన పాటల ప్రభావానికి లోనుకాని వ్యక్తి లేడు. ఆయన పాటలు చేరని ఊరు లేదు. వినని శ్రోత లేడు. అంటే ఆశ్చర్యపోనక్కరలేదు. ఇప్పుడు ఊరూరా నవతరం, యువతరం గద్దర్లు పుట్టుకొస్తున్నారంటే వారంతా ఆ మహా వృక్షానికి పూచిన పూలే, కాసిన కాయలే. ఆయన పాటల ఆకర్షణకు లోనై అడవిబాట పట్టి అన్నల్లో కలిసిన వారు వేల సంఖ్యలో ఉండవచ్చు.
గద్దర్ పాల్గొనని ఉద్యమం లేదు. ఏ ఉద్యమంలో ఉన్నా అవన్నీ ఆయన ఆటపాటతో ఊపిరిపోసుకున్నవే. గద్దర్ రాసిన కొన్ని పాటలు మహాకవులు కూడా రాయలేరనిపిస్తుంది.
‘నన్నూ గన్న తల్లులారా తెలుగు తల్లి పల్లెలారా.. పాటనై వస్తున్నానమ్మో, మీ పాదాలకు వందనాలమ్మో’ పాట శ్రీశ్రీ రాసిన ‘తెలుగు వీర లేవరా దీక్షబూని సాగరా’ అనే పాటను గుర్తుకుతెస్తుంది. మలిదశ తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో రాసిన పాటలు ‘నన్నూగన్న తల్లులారా తెలుగు తల్లి పల్లెలారా’, ‘పొడుస్తున్న పొద్దుమీద నడుస్తున్న కాలమా పోరు తెలంగాణమా’ వంటి పాటలు ఉద్యమస్ఫూర్తినే కాకుండా తెలంగాణ భౌగోళిక, సాంస్కృతిక అస్తిత్వాన్ని ఎంతో ఆత్మీకరించుకుంటే తప్ప రాయటం కష్టం. అలాగే ‘నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మా.. తోడబుట్టిన రుణం తీర్చుకుంటనే చెల్లమ్మా’ అని చెల్లెలు మీద రాసిన పాటలోని ఈ చరణాన్ని ఒక కావ్యంగా పరిగణించవచ్చు. ప్రపంచ సాహిత్యంలోనే చెల్లెలుపై రాసిన గీతాల్లో ఇదొక అపూర్వమైన ఆణిముత్యం.
‘కుక్కపిల్ల, అగ్గిపుల్ల, సబ్బుబిల్ల కవితామయమేనోయి అన్ని’ అని శ్రీశ్రీ అంటే, ‘పాత చెప్పు, చెత్తకుండి కూడ కవితామయమే’ అంటాడు గద్దర్. చెత్తకుండిపై ఆయన రాసిన పాట మనస్సును ఆర్ద్రతతో బరువెక్కిస్తుంది. పాట ఎత్తుగడలోనే ‘ఎంత చక్కగున్నదో నా చెత్తకుండి అందాల బొమ్మనన్నదో నా చెత్తకుండి’ అనే అద్భుతమైన పల్లవితో మొదలుపెడతాడు. అందులో తల్లిలేని కుక్కపిల్లను ఎత్తుకొని ఎంగిలిమెతుకులు ఏరిపెడుతుందని, కడుపుతోని ఉన్న ఆడపందికి కన్నతల్లయి కాన్పు చేస్తుందని, పాలు పిండుకొని గడ్డివెయ్యక తన్ని తరిమివేసిన ఆవు కనుపాపను ముద్దాడి కాగితాలు తినిపిస్తుందని, తల్లిదండ్రులు లేని పిల్లలకు, సీసపెంకెలు, ఇనుప ముక్కలు ఏరిపెట్టి పైసలిచ్చి ఫికర్ చెయ్యొద్దంటుందనీ, పసిగుడ్డును మూటగట్టి పారవేసినప్పుడు చేతులెల్లి అందుకుంటుందని మూతి తుడిసి ముద్దాడుతుందని, చివరికి నిప్పురవ్వ వేసినప్పుడు భగ్గుభగ్గున మండి మండి పోరుబాట చూపుతుందని చెప్పి ముగిస్తాడు.
ఇంత అద్భుతమైన పాట రాయటం మామూలు కవులకు సాధ్యం కాదు. ఏ రవీంద్రుడో, కవీంద్రుడో రాయగలడేమో. బాహ్య ప్రపంచపు సమస్తజీవుల బాధ. దుఃఖం, వేదనను తనలో అనుభవించి, పలవరించకపోతే గొప్ప కవిత్వం పుట్టదని చెప్తారు. భారతీయ వేదాంతం దీన్ని ఆత్మ జగత్తులో జగత్తు ఆత్మలో ఐక్యం కావడమంటారు. సబ్జెక్టులో ఆబ్జెక్ట్ లీనమవడం అన్నమాట.
గద్దర్లో పోరాటం, ధిక్కారం, ఎదుర్కోవటం వంటి క్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఒక గొప్ప కళాకారుడికి ఉండవలసిన పసితనపు అమాయకత్వం ఆయనలోనే ఉన్నది. దీన్ని ‘సెర్మనీ ఆఫ్ ఇన్నోసెన్స్’ అంటారు. మిగతా ఉద్యమకారులందరు గద్దరు నుంచి నేర్చుకోవలసిన లక్షణం ఇది. ఇలాంటి లక్షణం ఉన్నవారు సిద్ధాంతాలతో సంబంధం లేకుండా స్పందించే అవకాశం ఉన్న ప్రతిచోటుకి వెళ్తారు. బహుశా ఈ గుణమే గద్దర్ను సమతావాది అయిన రామానుజాచారి చెంతకు చేర్చి ఉంటుంది. ఆయన రామానుజునిపై రాసిన గేయం స్వయానా ఆధ్యాత్మిక విప్లవకారుడైన రామానుజుడే రాసినట్టుగా ఉన్నాయి అందులోని పంక్తులు. ఆ గేయంలోని ఒక పంక్తి! ‘జన్మస్థానం ఒకటైనప్పుడు జంధ్యమేల జగడమేల’ అన్న వాక్యం విన్నప్పుడు అన్నమయ్య రాసిన ‘బ్రహ్మ మొక్కటే పరబ్రహ్మ మొక్కటే’ అన్న కీర్తన గుర్తుకొస్తుంది.
చివరగా గద్దర్ ప్రజాక్షేత్రంలో ఉండకపోతే ఏమయ్యేవాడు? అతను ఇంజినీరింగ్ కోర్సును పూర్తిచేసి ఉంటే గొప్ప ఇంజినీర్ అయ్యేవాడు. డబ్బులకు కొదవ ఉండేది కాదు. తెలుగు సాహిత్యంలో కృషిచేసి పట్టాలు పొంది ఉంటే ఏ ప్రొఫెసర్గానో, స్థిరపడి గొప్ప గొప్ప అవార్డులు, రివార్డులు పొందేవాడు. ఒకవేళ శాస్త్రీయ సంగీతంలో సాధన చేసి ఉంటే, దేశంలో అగ్రశ్రేణి గాయకుడయ్యేవాడు. అవేవీ కాలేదు కనకనే గద్దర్ అయ్యాడు.
(వ్యాసకర్త: టీఎస్పీఎస్సీ మాజీ సభ్యులు)
-బాణాల మన్మథరెడ్డి
76749 45216