‘సామాన్యుడు మాట్లాడే భాషలో ఏయే క్రమాలను పాటిస్తున్నాడో, వాక్యాలను ఎన్ని రకాలుగా నిర్మిస్తున్నాడో గమనించి సూత్రీకరించే ‘వ్యాకరణం’ కావాలి. ఈ సూత్రీకరణ ఇవాళ మనం మాత్రమే చేసుకుంటున్నది కాదు. వ్యాకరణాన్ని వృద్ధి చేసేది భాషా శాస్త్రవేత్తలు కారు. భాషా సాహిత్యాలు బోధించే అధ్యాపకులూ కారు. పైగా కుహనా భాషా శాస్త్రవేత్తలు, రచయితలు కొందరు అసలు వ్యాకరణమే లేదని బుకాయించవచ్చు.
లేదా ఏదో మెలిక పెట్టి ఉన్న వ్యాకరణాలకు సరైన ప్రచారం చేయనీయకుండా, విలువ తగ్గేలా అడ్డు పడుతుండవచ్చు. వారి భ్రమలను సమాజంపై రుద్దే ప్రయత్నమూ చేయవచ్చు. ఇలా కుయుక్తులు పన్నేవారు ‘వ్యాకరణం’ రాయబోయి విఫలమైనవారై ఉండాల’ని ఆధునిక ఆంగ్ల వ్యాకరణ వేత్త ప్రొఫెసర్ హోలడే వక్కాణించారు.
ఓ పరదేశీయుడు మన మధ్యలోకి వచ్చి తన అనుభవాలను గుదిగుచ్చి చెప్పగా.. ఎందరికి జ్ఞానోదయం కలిగిందన్నది ప్రశ్నార్థకమే! కానీ, మన తెలుగు గడ్డ మీద ఇదే వాస్తవం నాలుగు దశాబ్దాలుగా జరుగుతున్నా నేటికీ మన విశ్లేషకులు సరిగ్గా స్పందించకపోవడం ఎంత దారుణం?
నిజమైన విద్వాంసుని దార్శనికత అన్ని కాలాల్లోనూ, విపత్కర పరిస్థితుల్లోనూ చెక్కుచెదరక నిలిచి ఉంటుంది. దీన్నే ‘అమోఘం’, ‘ఆచంద్రార్కం’ అని మన పెద్దలంటారు. అలాంటి అమోఘమైన ‘వ్యావహారిక భాషా వ్యాకరణాన్ని శేముషి వాఙ్మయ మహాధ్యక్ష డాక్టర్ వడ్లమూడి గోపాల కృష్ణయ్య ఎంతో దార్శనికతతో తెలుగు జాతికోసం రచించారు. ఇప్పుడు యాసా ప్రయుక్త రాష్ర్టాలుగా వేరైన తెలంగాణ, ఆంధ్ర రాష్ర్టాల్లోని తెలుగు భాష చదివే విద్యార్థులకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందన్నది అతిశయోక్తి కాదు!
వడ్లమూడి గోపాలకృష్ణయ్య తన 28వ ఏట అంటే 1956-57 మధ్యకాలంలో ఉమ్మడి ఏపీలోని 23 జిల్లాల్లోనూ తిరిగి, యాస భాషలన్నిటినీ క్షుణ్ణంగా అధ్యయనం చేశారు. 1474 వాడుక భాషా సూత్రాల తో వ్యాకరణ గ్రంథం రచించారు. ఈ గ్రంథంలో పది (1.సంజ్ఞా పరిచ్ఛేదం, 2.సంధి పరిచ్ఛేదం, 3.శబ్ద పరిచ్ఛేదం, 4.కారక పరిచ్ఛేదం, 5.సమాస పరిచ్ఛేదం, 6.తద్ధిత పరిచ్ఛేదం, 7.క్రియాపరిచ్ఛేదం. 8.కృదంత పరిచ్ఛేదం, 9.వాక్యపరిచ్ఛేదం. 10.ప్రకీర్ణక పరిచ్ఛే దం) సూత్రాలను విపులీకరించారు. విశేషమేమం టే ‘వక్ష్య మాణ విధి’ చేత పదశబ్ద విభజన చేసి అనేక తెలంగాణ, ఆంధ్ర పదాలకు సూత్రాలు రచించారు. ఇదే ఆయన విశేష కృషికి తార్కాణమైంది.
వాడుక భాషా వ్యాకరణ గ్రంథంలోని సూత్రాలను కొన్నింటిని ఇక్కడ విపులీకరించాల్సి ఉన్నది. మన ఉభయ తెలుగు రాష్ర్టాల్లోనూ చలామణిలో ఉన్నది ‘రాజు శబ్దం’, ‘సంజ్ఞా పరిచ్ఛేదం’ ప్రకారం ‘దంత్యయుక్తం రాజు శబ్దం’ అని వడ్లమూడి వారు సూత్రీకరించి.. రాజు శబ్దం సంస్కృత సమమే అయినా ఇకారాంతం కాకపోయినా దానికి పరంలో బహువచనం లేకపోయినా దంత్యయుక్తంగా కనిపిస్తున్నదని తాత్పర్యమిచ్చారు. ఉదాహరణగా ‘రాజు-రాజులు-రాజును-రాజు చేత-రాజుకు’ అన్న శబ్దాలిచ్చారు. ఇలాంటి అన్యభాషా పదాలెన్నో మన భాషలో లీనమైపోవడం వల్ల ప్రామాణికత ప్రాధాన్యాలు తగ్గే అవకాశం లేదు.
‘దేశ్యా లైన నవలాదుల తుది దీర్ఘానికి హ్రస్వ అరుదుగా వస్తుంది’ అని సూత్రం చెప్పారు. ఇందులో ‘నవలా – నవల – నేజా – నేజ -లకోరీ -లకోరి – తేజీ – తేజి’ మొదలైనవి నవలాదులుగా విపులీకరించారు ఆయన.
‘ఆనికి ‘క’ కారానికి ద్విత్వం విభాష’ అన్న సూత్రరీత్యా ‘ఆనికి-అనిక్కి’ అంటూ వడ్లమూడి ఉభయ యాసా శబ్దాలకూ సమపీఠం చూపారు.
‘పెండ్లి’-‘పెళ్ళి’ శబ్దాలకు రెండు వేర్వేరుగా చక్కని సూత్రాలు కట్టారు. తొలుత తెలంగాణలో చలామణి అయ్యే ‘పెండ్లి’ శబ్దాన్ని గమనిస్తే… ‘బహువచన పరమైతే ‘పెండ్లి’ శబ్దానికి బిందు పూర్వక
‘డు’ వర్ణం ఆగమంగా వస్తుంది’ అని సూత్రీకరించారు. పెండ్లిండులు – ఉత్వలోపం పెండిండ్లు- డాకు ‘ళా’ దేశం బిందులోపం -పెండ్లిళ్లు – పెండిండ్లతో – పెండ్లిళ్లతో – పెండ్లిండ్లలో – పెండ్లిళ్లలో-అని వివరణిచ్చారు.
ఆంధ్ర యాసలో వచ్చే ‘పెళ్ళి’ శబ్దాన్ని తీసుకుం టే- ‘పెండ్లి డాకు ‘ళా’ దేశం విభాష’ అని సూత్రీకరించి, పెండ్లి-పెళ్ళి-‘ళా’ దేశావస్థలో బిందులోపం నిత్యం-పెళ్లిళ్లుగా చూపారు. ఇక్కడ ప్రస్తుత పరిస్థితుల ప్రకారం ‘పెళ్ళిళ్ళు’ శబ్దం మాత్రం ఉభయ యాసభాషల్లోనూ ప్రబలంగా నాటుకుపోయి ఉందన్నది గమనార్హం.
నుడుల గురించి వచ్చే ప్రస్తావనలో… ‘కొన్ని నుడుల ఆది మధ్య మాంతాల అత్వానికి ఇత్వం బహుళంగా వస్తుంది’ అని సూత్రం చెప్పారాయన. ఈ సూత్ర రీత్యా
ఆది:-దబ్బడ-దిబ్బడ-టంగణా-టింగణా, మధ్య:-తడక-తడిక-నరయు-నరియు-
నెరయు-నెరియు,
అంతం:-చిన్న-చిన్ని-పోలిక-పోలికి. మరి కొన్ని నుడులకు మధ్యమాంతాల్లో అత్వానికి ఉత్వం బహుళంగా వస్తుందని సూత్రీకరించారు..
మధ్య: -నడచు-నడుచు-నడవడి-నడువడి-చదను-చదును., చలవ-చలువ-నలగు-నలుగు అంటూ పద వ్యుత్పత్తి భేదాలు చూపారు.
‘కొన్ని పదాది మధ్యమాల్లో అత్వానికి ఎత్వం బహుళం’ అన్న మరో సూత్రంలో… ఉదాహరణగా
ఆది:-గడ-గెడ-గడ్డ-గెడ్డ-గంతులు-గెంతులు, -నమిలి-నెమిలి-మట్టె-మెట్టె, మయివడి-మెయివడి-రక్కొను-రెక్కొను పదాలిచ్చారు.
‘కొన్నిచోట్ల పదాది మధ్యమాంతాల్లో ఇత్వానికి ఉత్వం బహుళం’ అని సూత్రం చెప్పి, ఆది పదం ఉదాహరణగా.. ఇసుళ్లు-ఉసుళ్లు-ఇసుక- ఉసుక’ అని వివరించారు.
మధ్య: -మొగిలి-మొగులు-మొయిలు-మొయులు-అరిది-అరుదు.. అలికిడి-అలుకుడు-కానిక-కానుక-కుత్తిక-కుత్తుక, నాలిక- నాలుక-పిచ్చిక-పిచ్చుక అని పేర్కొన్నారు.
అంతం: ‘అరిది – అరుదు – జవాది – జవాదు – తెల్లమి -తెల్లము – తెల్లం – బుడిగి – బుడుగు – రద్ది – రద్దు -వేరమి – వేరము -వేరం’ అని సూచించారు.
‘పదాంత ఎత్వానికిత్వం కొన్నిచోట్ల అరుదుగా వస్తుంది’ అనే సూత్రరీత్యా సంపంగె – సంపంగి – కొండె – కొండి – గోనె – గోని – మిద్దె – మిద్ది – పెట్టె – పెట్టి – నూనె – నూని – మల్లె -మల్లి వంటి శబ్దాలు రెండు యాసల్లోనూ ప్రయుక్తాలవుతాయని విపులీకరించారు.
అందున వర్ణకాలకు ఒకానొకచోట ఉంచి ఉండులు అను ప్రయుక్తాలౌతున్నాయన్న సూత్రంలో.. నాకలోకం నందుంచి -నాకలోకం నందుండి – నడాననుంచి – నడాన నుండి, నడాన్నుంచి- నడాన్నుండి మొదలైన శబ్దాలు ప్రయుక్తాలవుతున్నాయని చూపారు.
‘త్రికాదుల మీది కడ శబ్దం ‘క’ వర్ణానికి లోపం పూర్వ హ్రస్వానికి దీర్ఘం బహుళం’ అన్న సూత్రం కింద… అ-కడ-ఆడ-అక్కడ, ఈ-కడ-ఈడ-ఇక్కడ, ఏ- కడ-ఏడ-ఎక్కడ, ఆది శబ్దం చేత- పెందల-కడ-పెందలాడ-పెందలకడ; తల-కడ-తలాడ-తలగడ ఇత్యాదులు గ్రాహ్యాలుగా వడ్లమూడి చూపారు.
‘అద్విరుక్తాలైన తడవాదులు ప్రాయికంగా సంఖ్యా పూర్వకాలవుతాయి’ అన్న సూత్రంలో..ఒకతడవ-రెండు తడవలు మొదలైనవి ప్రయుక్తాలవుతాయి.
ఇక్కడ తడవ-తూరి-తేప-సారి-మారు ఇత్యాదులు ఉభయ యాసల్లో నూ ‘తడవాదులుగా’ వడ్లమూడి
పేర్కొన్నారు.
(మిగతా వచ్చేవారం)
రాజఫణి: 92479 37923