కొత్తతరం ప్రజా గాయకుల్లో సాయిచంద్ ఒక గాన సునామీ. ఒక సాంస్కృతిక విస్ఫోటనం. మలిదశ తెలంగాణ ఉద్యమ గమనానికి సాయిచంద్ ఒక సాంస్కృతిక రహదారిగా భాసిల్లాడు. తెలంగాణ ఉద్యమ సముద్ర గర్భంలో దాగిన బడబానలాన్ని తన పాటల కరంటు తీగెలతో మోసుకెళ్లి ప్రతిపల్లెను జగజ్జేగీయమానంగా వెలిగించాడు. సాయిచంద్ గొంతెత్తితే ‘కోటి రత్నాల వీణ’ మీటినట్టుంటుంది. పాలమూరు మట్టిగోస భాషించినట్టుంటుంది. సాయిచంద్ పాట వింటే సమరోత్సాహం రగులుతుంది. బహిరంగసభ కండ్లు ఎరుపెక్కుతాయి. భగభగమంటూ ప్రజాకోటి ఉక్కు పిడికిలి బిగిస్తుంది. అతని ఉపన్యాసం నిప్పుల ఉప్పెనలా సభాసదులను ముంచెత్తుతుంది.
అమరుల గురించి పాడినా, అంబేద్కర్ గీతం ఆలపించినా గుండెను సముద్రంగా మార్చే పరమ ఆర్ద్రమైన అగ్నికంఠ గానం సాయిచంద్ సొం తం. ఉద్వేగభరితమైన పాటతో, ఉత్తేజకరమైన మా ట తో ఒక సాంస్కృతిక సౌధాన్ని నిర్మించి, లక్షలాది మంది ప్రజలను గంటల తరబడి అందులో బంధించే సమ్మోహనశక్తి సాయిచంద్లో కనిపిస్తుంది. అందుకే అతనిపాట ప్రవాహం అమరచింత నుంచి అమెరికా వరకు ప్రతిధ్వనించింది. తాత చెన్నయ్య ఆలపించే భజన పాటలతో, తండ్రి వెంకటరాములు పాడే ప్రజాగీతాల చరణాల జాడల్లో, అమరచింత నేర్పిన ఆటపాటల ఒరవడిలో సాయిచంద్ బుడిబుడి నడకలు నేర్చుకున్నాడు. అరుణోదయ కళాకారులైన కానూరి, నాగన్న ల గాన కళా వారసత్వాన్ని అందిపుచ్చుకున్నాడు. ఆరేండ్ల ప్రాయం నుంచే పాటలు పాడే సాయి పాటల పోటీలో ‘నీ కన్నీరు నా కన్నీరు కలిగినోళ్లకు పన్నీరా యే’ అనే పాట పాడి బాల గద్దర్లా కదం తొక్కాడు. హైదరాబాద్లో ఉన్నత చదువు అభ్యసిస్తూనే, మరొక వైపు విద్యార్థి నాయకునిగా, యువ గాయకునిగా ప్రజా పోరాటాల్లో పాలుపంచుకున్నాడు.
మలిదశ తెలంగాణ ఉద్యమం సాయిచంద్ జీవన ప్రస్థానాన్ని మరో మలుపు తిప్పింది. తెలంగాణ ఉద్యమ నాయకుడు కేసీఆర్ ఆమరణ నిరాహారదీక్షతో రగులుకున్న ఉద్యమాగ్నిజ్వాలల వెలుగుల్లో, శ్రీకాంతాచారి లాంటి అమరవీరుల బలిదానాల ఉద్విగ్న సం దర్భంతో సాయిచంద్ ప్రభావశీలమైన ప్రజాగాయకుడిగా రూపుదిద్దుకున్నాడు. మిట్టపల్లి సురేందర్ రాసిన ‘రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా’ అనే పాటను సాయిచంద్ ఆలపిస్తుంటే తెలంగాణ మొత్తం ఒక బాధాసరిత్సాగరమై బావురుమన్నది. కేసీఆర్తో పాటు కోట్లాదిమంది తెలంగాణ బిడ్డల గుండెలు కన్నీటి ఊటచెలిమలై ఉప్పొంగాయి. గోరటి వెంకన్న రాసిన ‘వాగు ఎండిపాయెరో’ అన్న పాట సాయిచంద్ పాడుతుంటే ప్రేక్షకుల హృదయాలు దుందుభి నదులయ్యాయి. కేసీఆర్ రాసిన ‘వలసలతో వలవల విలపించే కరువుజిల్లా పాలమూరు’ అనే పాట ఆలపిస్తుం టే అఖిల జనావళి గుండె బరువెక్కేది. తాను పాడే పాటలో పరివ్యాప్తమైన భావోత్తేజాన్ని, ఉద్యమావేశా న్ని సంపూర్ణంగా ఆవాహన చేసుకొని ఆ భావప్రకంపనలను తన గళంలో ఒంపుకొని, గానంలో నింపుకొని, సాయిచంద్ ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాడు. తెలంగాణ గాయాలను ఎంతో ఆర్ద్రంగా ఆలపించిన సాయిచంద్ తెలంగాణ ఉద్యమ విజయాలను, రాష్ట్ర ప్రగతి గేయాలను కూడా మరింత ఆత్మవిశ్వాసంతో గానం చేశాడు. తెలంగాణ నాయకులకు తలలోని నాలుకలా విలసిల్లాడు.
సాయిచంద్ గొప్ప గాయకుడే కాదు, ప్రభావశీలమైన కవి కూడా. తెలంగాణ ఉద్యమ సందర్భంలో జైలు నిర్బంధాలను పరమానందంగా భరించాడు. తనువారా లాఠీదెబ్బలు తిన్నాడు. ‘కంఠంపై కత్తిపెట్టి, కణతపై తుపాకీ పెట్టి/ కడసారిగా పలకమంటే, పలికే చివరిమాట కూడా జై తెలంగాణ’ అంటూ రాజ్యం గుండెలదిరేలా వేయి గొంతుకలతో నిప్పుల నినాదాల ను అణువణువులో ప్రసరించాడు. ‘పారిన వీరుల రుధిరం తెలంగాణ తల్లికి నుదుటి తిలకమైందని’ అమరుల త్యాగచింతనతో అభివర్ణించాడు. ‘తంగేడు బతుకమ్మ తలమీద గౌరమ్మ’ అనే తన గీతంతో విశ్వవిఖ్యాతమైన పూలపండుగ పరిమళాలను వెదజల్లా డు. ‘గంప కింద మూసి పెట్టిన కోడి కూతలిని/ ఆ తూరుపమ్మ పొత్తిళ్లలో పొద్దు పొడుస్తది/ ఊరి నట్ట నడుమ ఉన్న రావి చెట్టుమీద పక్షుల పిలుపులతో పల్లె తెల్లవారుతుంది’ అంటూ ఉషోదయ దృశ్యాన్ని కళాత త్వ శోభితంగా వర్ణించాడు. ‘మేము కళాకారులం/ కళాబాటసారులం/ కళయే మా జీవితం/ కళకే మేమంకితం/ గాత్రమే జీవన సూత్రంగా బతుకుతాం’ అంటూ సాయిచంద్ ఉదాత్తమైన కళాకారుల జీవన స్థితిగతులను, వారి అసాధారణ ప్రతిభా పాటవాలను సమున్నతంగా చిత్రించాడు.
‘అనురాగాల పల్లవి అమ్మ ప్రేమ/ మమతల కోవెల మణిదీపం’ అంటూ సాయిచంద్ కన్న తల్లి మణెమ్మను తీయని ఆత్మీయతను అక్షరబద్ధం చేశాడు. ‘నాన్న నాన్న నీ మనసెంత మంచిదో నాన్న’ అంటూ నాన్న వ్యక్తిత్వాన్ని అద్భుతమైన పాటగా మలిచాడు. ‘కష్టమంత భద్రంగా కడుపులోనే దాచుకొని, కన్నీళ్లను కంటిరెప్ప దాటనీయని’ తండ్రి మహోన్నత పాత్రను సాయిచంద్ అద్భుతంగా తనపాటలో బొమ్మకట్టించాడు.
అమ్మానాన్నల ఔన్నత్యాన్ని కీర్తిస్తూ విశ్వ జనీన దృష్టితో సాయిచంద్ రాసిన, ఆలపించిన ఈ పాటలు ఎంతోమందిని కదిలించాయి. తల్లిదండ్రుల యాదిని గుండెల్లో కుమ్మరించాయి.
మా ఆకలి కడుపులపై కంజిర దరువేస్తాము/ మా ఎండిన డొక్కలపై డప్పులు మోగిస్తాము/ మా పేగులు తీగెలుగా కిన్నెర వాయిస్తాము/ మా ఊపిరితిత్తులతో మురళిని పలికిస్తాము/ మా పెదవులపై పదముల నాట్యం చేయిస్తాము/ మా పల్లె జానపదుల పల్లకినే మోస్తాము’ అంటూ తన పాటలో సాంద్రతరమైన గేయకావ్య స్ఫూర్తిని సాయిచంద్ చాటిచెప్పాడు. పాట లు పాడే క్రమంలో కళాకారులు అనుభవించే మేధోపరమైన వేదనను, శ్రమగతమైన కష్టనష్టాలను అభివ్యక్తి సుందరంగా సాయిచంద్ విశ్లేషించాడు. జానపదుల సంగీత, సాహిత్య, కళావారసత్వ మహత్తును చాటిచెప్పాడు. సాయిచంద్ ఎం.ఏ తెలుగు చదివినప్పటికీ నిఘంటువుల భాషకు భిన్నం గా జానపదుల భాషతోనే తన పాటలకు పుటం పెట్టుకున్నాడు.
సాయిచంద్ తెలంగాణ ఉద్యమ చైతన్యంతో పాటు దళితోద్యమ స్ఫూర్తిని కూడా తన పాటల్లో పలికించాడు. దళిత తాత్విక భావజాల సమన్వితమైన గీతా లు రచించాడు. ‘బాబా అంబేద్కరా మా బతుకులకు భాస్కరా/ మీరే లేకుంటే మేమేమై పోతుంటిమో’ అంటూ అంబేద్కర్ బహుముఖీన ప్రాశస్త్యాన్ని కీర్తిస్తూ ఆ విజ్ఞానమూర్తి, సాహసమూర్తి, త్యాగమూర్తి లేకపోతే దళితులు బుగ్గయి పోయేవారని సాయి పాడుతుంటే అశేష జనసముద్రం జైభీమ్ అంటూ పోటెత్తిం ది. ప్రతిభావంతుడైన గాయకునిగా, కవిగా, వక్తగా, వర్తమాన వాగ్గేయకారునిగా ప్రజాకోటి హృదయపీఠం పై కొలువుతీరిన సాయిచంద్ అత్యున్నతమైన ఆ పీఠా న్ని విడనాడి అందరినీ దుఃఖ సాగరంలోముంచి భస్మసింహాసనాన్ని అధిరోహించాడు. ‘పాటమ్మ అడిగినాది నాకొడుకు ఏడని? పల్లె అడిగినాది నా బిడ్డయాడని’ అని అరుణోదయ రామారావు స్మృతిలో సాయిచంద్ విలపించినట్టుగానే ఇప్పుడు యావత్ తెలంగాణ కలవరిస్తున్నది నా కళాబాటసారి ఏడని? పాటమ్మ బోరున ఏడుస్తున్నది తన గారా ల, గానాల బిడ్డ సాయిచంద్ ఏడని?
డా. కోయి కోటేశ్వర రావు: 94404 80 274
(వ్యాసకర్త: ప్రభుత్వ సిటీ కళాశాల తెలుగు శాఖ అధ్యక్షులు)