మొలకు వస్త్రములేక చలికి వడకుచు నీవు/పొలమలికి యటుపైన కర్షకా/ కలుపెల్ల దీసెదవు జలములో నానెదవు/ ఫలము మాత్రము సున్న కర్షకా..!/ కలలోననైన నీకష్టంబు లివి యనుచు/గనుగొనని వారలో కర్షకా/ కఠిన శాసకలైరి గను నీ కష్టముల/ కంతు లేకున్నదో కర్షకా…!! అంటూ మంత్రిప్రగడ వెంకటేశ్వరావు రైతుల కష్టాలు చూసి కన్నీరు గార్చారు. ఆరుగాలం కష్టపడి పసిడి పంటలు పండించినా ‘అమ్మబోతే అడివి-కొనబోతే కొరివి అన్న చందం’గా ఉండేది. కానీ ఇదంతా గతకాలపు దుస్థితి. తెలంగాణ రాష్ట్ర అవతరణ తర్వాత రైతు దశ, దిశ మారింది. కరోనా పరిస్థితుల్లో రైతులు ఇబ్బంది పడకుండా, ధాన్యం అమ్ముడు పోదేమోననే దిగులు లేకుండా సర్కారే ముందుకు వచ్చి యాసంగిలో పండిన ప్రతిగింజను కొనుగోలు చేసేందుకు నిర్ణయించింది. దీనికి సంబంధించిన నిధులను కూడా విడుదల చేసి సంబంధిత శాఖలను సమాయత్తం చేయటం హర్షణీయం.
కొంత కాలంగా దేశంలో ఏర్పడిన ప్రత్యేక పరిస్థితులు రైతులను నిరాశా నిస్పృహలకు గురిచేస్తున్నాయి. ముఖ్యంగా పంటలకు కనీస మద్దతు ధర చెల్లించటం ప్రభుత్వ బాధ్యత కాదని కేంద్రం చెప్తున్నది. ఎక్కడ లాభసాటిగా ఉంటే అక్కడ అమ్ముకునే స్వేచ్ఛ రైతుకు ఉన్నదని చెబుతూ, చాలా రాష్ర్టాల్లో ప్రభుత్వ వ్యవసాయ మార్కెట్లను ఎత్తివేసింది. దీంతో దేశవ్యాప్తంగా రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ధాన్యం ధరను పూర్తిగా మార్కెట్ శక్తుల చేతిలో పెట్టడం రైతుల పాలిట శాపంగా కర్షక లోకం భయపడుతున్నది. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో కూడా మద్దతు ధరతో ప్రతి ధాన్యపు గింజనూ కొంటామని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. కొవిడ్ పరిస్థితుల్లో ఆర్థిక స్థితిగతులు ఎలా ఉన్నా రైతుకు మేలు చేకూర్చటమే ప్రథమ ప్రాధాన్యంగా రాష్ట్ర ప్రభుత్వం భావించింది
ప్రభుత్వం రైతుకు అండగా నిలబడటం ఇది మొదటిసారి కాదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన వెంటనే ఎరువులు, విత్తనాల సరఫరా మొదలుకొని అన్ని విధాలా రైతులను ప్రోత్సహిస్తూనే ఉన్నది. గత ఏడాది కరోనా కోరలు సాచి గడగడలాడిస్తున్న సందర్భంలోనూ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో వ్యూహాత్మకంగా వ్యవసాయ కార్యకలాపాలు దెబ్బతినకుండా కాపాడింది. ఆ తరువాత ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతులను ఆదుకొన్నది. 9,199 కోట్ల రూపాయల విలువైన ధాన్యాన్ని, 10,167 కోట్ల రూపాయల విలువైన పత్తిని కొనుగోలు చేసి రైతులోకానికి భరోసా ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం సాగించిన కృషి మూలంగా గత ఏడాది అన్ని రంగాలూ వెనకబడ్డా వ్యవసాయ రంగం 20.9 శాతం వృద్ధిని సాధించింది. రాష్ట్రం ఇప్పటికే విత్తన భాండాగారంగా దేశవిదేశాలలో గుర్తింపు పొందింది. ప్రపంచంలోనే మన్నికైన పత్తికి కేంద్రంగా భాసిల్లుతున్నది. వ్యవసాయ రంగంలో సాధించిన అభివృద్ధి ఇతర రంగాల వృద్ధికి ప్రేరకంగా మారుతుందనడంలో సందేహం లేదు.