రైతుబంధు రైతులోకానికి సముద్రంలో దీపస్తంభం వంటిదని సామాజిక ఉద్యమకారుడు అన్నాహజారే మెచ్చుకుంటే.. రైతులకు అంధకారంలో వెలుగురేఖ వంటిదని విఖ్యాత వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ ప్రశంసించారు. ప్రపంచబ్యాంకు నుంచి ఐక్యరాజ్యసమితి వరకూ అనేక అంతర్జాతీయ సంస్థలు ఈ పథకాన్ని కొనియాడాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ మానస పుత్రిక రైతుబంధు దిగ్విజయంగా ఐదేండ్లను పూర్తి చేసుకుంది. ఇంత స్వల్ప వ్యవధిలో ఈ పథకం కలిగించిన ప్రభావం అంతాఇంతా కాదు. తప్పనిసరి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం దీన్ని కాపీ కొట్టి కిసాన్ సమ్మాన్ నిధి పేరుతో ఇటువంటి పథకాన్ని ప్రారంభించక తప్పలేదు. ఇక పశ్చిమ బెంగాల్ క్రిషక్బంధు పేరుతో, జార్ఖండ్ ఆశీర్వాద్ పేరుతో, ఒడిశాలో కాలియా పేరుతో, ఏపీలో రైతు భరోసా పేరుతో రైతుబంధు వంటి పథకాలు అమలవుతున్నాయి. నేడు దేశవ్యాప్త రైతాంగానికి బీఆర్ఎస్ ఇస్తున్న పిలుపు ‘అబ్ కీ బార్ కిసాన్ సర్కార్’కు రైతుబంధు పథకమే పునాదిగా నిలుస్తున్నది.
2018 వానాకాలం సీజన్లో సీఎం కేసీఆర్ ప్రారంభించిన రైతుబంధు ఇంతింతై అన్నట్లుగా వృద్ధి చెందింది. తొలి విడుతలో 50.25 లక్షల మంది రైతులు రూ.5,236 కోట్ల లబ్ధి పొందగా, ప్రస్తుతం రైతుల సంఖ్య 66 లక్షలకు, సాయం రూ.7,311 కోట్లకు పెరిగింది. ఈ ఐదేండ్లలో ఈ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం రూ.65,192 కోట్ల మొత్తాన్ని అన్నదాతలకు అందించింది. రైతులకు ఇంత భారీ ఎత్తున ప్రయోజనం చేకూర్చే ప్రత్యక్ష నగదు బదిలీ పథకం మన దేశ చరిత్రలోనే లేదు. చేపలు తెచ్చివ్వటం కాదు.. చేపలు పట్టటం నేర్పాలి అని ఒక ప్రసిద్ధ ఆంగ్ల సామెత ఉన్నది. మనుష్యులను సొంతకాళ్ల మీద నిలబడేలా చేయాలనేది దాని సారాంశం. ఇప్పటి వరకూ దేశంలో ప్రభుత్వాలు, పాలకులు రైతులను ఎప్పటికీ తమ మీద ఆధారపడే వారిగానే చూశాయి తప్ప వారి స్వయంసమృద్ధికి చర్యలు తీసుకోలేదు. రుణమాఫీ వంటి అరకొర పథకాలు కూడా రైతులను మౌలికంగా అభివృద్ధి చేసేవి కావు. ఇటువంటి తరుణంలో కేసీఆర్ భిన్నంగా ఆలోచించారు. పెట్టుబడి దశ నుంచే సమస్యలు ఎదుర్కొంటున్న రైతులకు అక్కడే సాయం అందించి, నిలబెట్టాలని భావించారు. దాని ఫలితమే రైతుబంధు. దీని వల్ల రైతులకు పెట్టుబడి చింత లేకుండా పోయింది.
కరోనా వంటి కష్టకాలంలో, రాబడి తగ్గిన దశలో కూడా రైతుబంధును ప్రభుత్వం ఆపలేదు. రైతుబంధు వల్ల రాష్ట్రంలో అధిక సంఖ్యలో ఉన్న చిన్న, సన్నకారు రైతులు లాభపడ్డారు. వీరిలో ఎక్కువ మంది బీసీ, ఎస్సీ, ఎస్టీలు కావటం ఈ పథకంలోని సామాజిక కోణా న్ని కూడా మన ముందుంచుతున్నది. ఐఐఎం అహ్మదాబాద్ నిర్వహించిన పరిశోధనలో, రైతుబంధు వల్ల రైతుల్లో ఆర్థిక స్థోమత పెరిగిందని, రైతు కుటుంబాల వినిమయ వ్యయం సగటున 12.9 శాతం మేర వృద్ధి చెందిందని వెల్లడైంది. తెలంగాణ వ్యవసాయ రంగ పునర్వైభవంలో రైతుబంధు పాత్ర గొప్పది. దీంతోపాటు 24 గంటల ఉచిత విద్యుత్తు, సాగునీటి ప్రాజెక్టులు, మిషన్ కాకతీయ రాష్ట్రంలో వ్యవసాయ విప్లవా న్ని సృష్టించాయి. తెలంగాణ మాడల్కు హరిత కాంతులనద్దాయి.