స్వయంకృషితో తన పేరును తనే చరిత్ర పుటల్లో లిఖించుకున్న ప్రజ్ఞాశాలి ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ. తొలిదశ ఉద్యమంలో, తెలంగాణ కోసం మంత్రి పదవిని తృణప్రాయంగా వదులుకొన్నారు ఆయన. తెలంగాణ స్వరాష్ట్రంగా ఆవిర్భవించే వరకూ ఏ ఒక్క పదవిని తీసుకోననిచెప్పి, మాటకు కట్టుబడిన నిష్టాగరిష్ఠుడు. మలిదశ ఉద్యమంలోనూ ఆయన పాత్ర మరువలేనిది.
పేదలపై పెత్తందారీల అరాచకాలకు వ్యతిరేకంగా కొండా లక్ష్మణ్ బాపూజీ యుక్త వయసులోనే ఉద్యమించారు. అందులో భాగంగానే నిజాం పాలనకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో పాల్గొన్నారు. బీసీల హక్కుల కోసమూ ఆయన ఉద్యమించారు. చేనేత సహకారోద్యమంలో చురుగ్గా పాల్గొనటమేగాక దశాబ్దాలపాటు నాయకత్వం వహించారు. తెలంగాణ రైతాంగం కోసం పోరాడారు. భారత స్వాతంత్రోద్యమం, తెలంగాణ తొలి, మలిదశ ఉద్యమాల్లోనూ శాయశక్తులా పాల్గొన్నారు. అందుకే ఆయన బహుముఖ పోరాటయోధుడు.
నియంతృత్వ, భూస్వామ్య నిజాం పరిపాలనకు వ్యతిరేకంగా తలెత్తిన ఉద్యమంలో యువ కార్యకర్తగా రాజకీయ జీవితం ప్రారంభించిన బాపూజీ, సాయుధ ప్రతిఘటనోద్యమంలో క్రియాశీలకంగా పాల్గొన్నారు. 1941లో ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాలలో కిసాన్ సదస్సు ఏర్పాటుచేసి జాతీయ నాయకులు జయప్రకాష్ నారాయణ, ఎన్జీ రంగా వంటివారిని ఆహ్వానించారు. 1942లో ఏర్పడిన ఆంధ్ర మహాసభతో అనుబంధం పెంచుకొని రావి నారాయణరెడ్డి, బద్ధం ఎల్లారెడ్డి, ఆరుట్ల రామచంద్రరెడ్డిలతో కలిసి ఉద్యమంలో పాల్గొన్నారు. హైదరాబాద్ సంస్థానాన్ని ఇండియన్ యూనియన్లో కలపడానికి జరిగిన ప్రయత్నాల్లో కీలకపాత్ర పోషించిన కొండాను 1947లో నిజాం పోలీసులు అరెస్టు చేయడానికి ప్రయత్నించగా అజ్ఞాతంలోకి వెళ్లి రైల్వే, పోలీస్ స్టేషన్లపై బాంబులు వేయడమే కాదు, 1947 డిసెంబర్ 4న నిజాం నవాబుపై కూడా బాంబు దాడి చేసిన బృందానికి ఆర్థిక తదితర సహకారం అందించారు.
ఆదిలాబాద్ జిల్లా ఆసిఫాబాద్ నుంచి 1952 లో తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. కాంగ్రెస్లో 23 ఏండ్ల రాజకీయ జీవితంలో ఎమ్మెల్యేగా, డిప్యూటీ స్పీకర్గా, మంత్రిగా విశేష సేవలందించారు. 1969 తెలంగాణ ఉద్యమంలో భాగంగా మంత్రి పదవికి రాజీనామా చేశారు. మండల్ కమిషన్ నివేదికకు వ్యతిరేకంగా పార్లమెంట్లో రాజీవ్గాంధీ మాట్లాడినందుకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. 2001లో టీఆర్ఎస్ ఏర్పడినప్పుడు పార్టీ కోసం తన ఇల్లు జలదృశ్యంను ఇచ్చి ఉద్యమానికి ఊపిరులూదారు. బాపూజీపై కక్షగట్టిన నాటి చంద్రబాబు ప్రభుత్వం ఆ ఇంటిని నేలమట్టం చేసింది. తన సామాజికవర్గమైన పద్మశాలీలతోపాటు వడ్రంగి, కంసాలి, కంచర, మేదర, బెస్త, కల్లుగీత, దర్జీ, వడ్డెర వంటి ఉత్పత్తి కులాల అభ్యున్నతి కోసం బాపూజీ విశేష కృషిచేశారు. మలిదశ తెలంగాణ ఉద్యమానికి పెద్దదిక్కయ్యారు.
తెలంగాణ కోసం అహర్నిశలు కృషిచేసిన ఆయన జయంతిని ప్రభుత్వం అధికారికంగా జరపాలని నిర్ణయించడం ఆహ్వానించదగిన పరిణామం.
సాయిని నరేందర్
9701 916091
(నేడు కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి)