గణితానికి మానవ జీవితానికి విడదీయరాని బంధం ఉన్నది. మనిషి దైనందిన జీవితంలో ప్రతిచోటా లెక్కలుంటాయి. అనేక వృత్తులు, సంగీతం, ఆటలన్నింటిలోనూ గణిత భావనలు ఇమిడి ఉంటాయి. గణితశాస్త్రం.. శాస్త్ర, సాంకేతిక రంగాలకు ఊపిరి వంటిది. అటువంటి గణితం అభివృద్ధిలో ప్రపంచవ్యాప్తంగా భారతీయుల పాత్ర ఎంతో ఉన్నది. సంఖ్యామానానికి పట్టుకొమ్మ అయిన ‘సున్నా’ (0) ఆవిష్కరణే దీనికి నిదర్శనం. సంఖ్యామానంలో అత్యంత కీలకమైన సున్నా ఆవిష్కరణ ప్రపంచ గణితశాస్ర్తానికి భారతీయుల అద్భుత కానుక.
గణితంలో 70 ఏండ్లుగా ప్రపంచానికి అంతుపట్టకుండా ఉన్న అత్యంత క్లిష్టమైన ‘జరిస్కి క్యాన్సిలేషన్’ సమస్యకు పరిష్కారం సూచించారు నీనా గుప్తా. అందుకుగానూ ఆమె ప్రఖ్యాత గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ జ్ఞాపకార్థం ఇచ్చే ప్రతిష్ఠాత్మకమైన ‘ది రామానుజన్ ప్రైజ్’ పురస్కారానికి ఎంపికయ్యారు. కోల్కతాలో జన్మించిన నీనా గుప్తా.. బెతూన్ కళాశాల నుంచి గణితశాస్త్రం ఆనర్స్లో పట్టా పొందారు. గుప్తా ఇప్పుడు తను బోధిస్తున్న ‘ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్’ (ఐఎస్ఐ) సంస్థ నుంచి డాక్టరేట్ తీసుకున్నారు. ఆమె అకడమిక్ కృషికి ఇప్పటికే డజను అవార్డులు వచ్చాయి. కోల్కతాలోని ‘ఐఎస్ఐ’లో ప్రొఫెసర్గా ఉన్న ఆమె ‘అఫైన్ ఆల్జీబ్రాక్ జ్యామితి’, ‘కమ్యుటేటివ్ ఆల్జీబ్రా’లో చేసిన అత్యుత్తమ కృషికి, ప్రత్యేకించి ‘అఫైన్ స్పేస్’ల కోసం ‘జరిస్కీ రద్దు’ సమస్య పరిష్కారం కోసం బహుమతిని అందుకున్నారు. జరిస్కీ రద్దుకు చేసిన పరిష్కారం ఆమెకు ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడమీ 2014 ‘యంగ్ సైంటిస్ట్’ అవార్డును సంపాదించి పెట్టింది. 2019లో శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డు అందుకున్నారు గుప్తా. యువ గణిత శాస్త్రవేత్తలకు ఇచ్చే ప్రతిష్ఠాత్మకమైన ‘రామానుజన్ అవార్డు’ నీనా గుప్తాకు ఇచ్చారు.
శ్రీనివాస రామానుజన్ అయ్యంగార్ గొప్ప గణిత శాస్త్రవేత్త. 20వ శతాబ్దంలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన గొప్ప గణిత మేధావుల్లో ఒకరు. రామానుజన్ గణిత శాస్త్ర మేధోసంపత్తి అద్భుతమైనది. పదమూడేండ్ల నాటికే సొంతంగా సిద్ధాంతాలు రూపొందించడం ప్రారంభించారు. గణితంలో ఆయన చేసిన కృషికి గుర్తుగా రామానుజన్ పుట్టినరోజును జాతీయ గణితశాస్త్ర దినంగా పాటిస్తున్నాం. గణితంపై ఆసక్తితో అత్యున్నత పరిశోధనల కోసం 1914 మార్చి 17న రామానుజన్ ఇంగ్లండ్కు చేరుకొని పరిశోధనలకు ఉపక్రమించారు. నిరంతర శ్రమతో 32 పరిశోధనా పత్రాలు సమర్పించారు. అక్కడి ప్రతికూల వాతావరణ పరిస్థితుల ప్రభావం వల్ల రామానుజన్ అనారోగ్యం పాలయ్యారు. తీవ్రమైన అనారోగ్యంతో ఉండి కూడా ప్రఖ్యాత గణిత శాస్త్రవేత్త హార్డీకి 1729 సంఖ్య ప్రత్యేకతను తెలియజెప్పి ఆశ్చర్యచకితుడిని చేశారు. 1729 సంఖ్య గురించి చెప్తూ.. ‘ఇది చాలా ఆసక్తికరమైన సంఖ్య. రెండు సంఖ్యల ఘనాల మొత్తాన్ని రెండు వేర్వేరు విధాలుగా చెప్పగలిగే సంఖ్యల్లో ఇది అన్నిటికంటే చిన్నది’ అని రామానుజన్ అన్నారు. రామానుజన్ ఆరోగ్య పరిస్థితి విషమించ డంతో 1919 మార్చిలో స్వదేశానికి తిరిగివచ్చారు. 1920, ఏప్రిల్ 26న ఆయన కన్నుమూశారు.
శుద్ధ గణితంలో ‘నంబర్ థియరీ’లోని రామానుజన్ పరిశోధనలు, స్ట్రింగ్ థియరీ, క్యాన్సర్ పరిశోధనల వంటి ఆధునిక విషయాల్లో ఉపయోగపడుతు న్నాయి. రామానుజన్ చివరిదశలో ‘మ్యాక్-తీటా ఫంక్షన్స్’పై చేసిన పరిశోధనలు ప్రసిద్ధమైనవి. ఆయన ప్రతిపాదించిన అంశా లు కొన్ని ఇప్పటికీ అపరిష్కృతంగానే ఉండటం విశేషం. అంతటి గొప్ప వ్యక్తి పేరు మీద ఉన్న రామానుజన్ అవార్డు నీనా గుప్తాకు రావడం హర్షణీయం.
(నేడు జాతీయ గణిత దినోత్సవం) (వ్యాసకర్త: కేయూలో గణిత శాస్త్ర అధ్యాపకుడు)
–డాక్టర్ టి.నాగయ్య,
97012 75354