1949 నవంబర్ 26న మన దేశ రాజ్యాంగం ఆమోదించబడింది. ఏటా ఆ రోజును రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకోవాలని మోదీ ప్రభుత్వం నిర్ణయించింది. బాబాసాహెబ్ అంబేద్కర్ 125వ జయంతి సందర్భంగా కేంద్రం 2015లో ఈ నిర్ణయం తీసుకున్నది. ఆ రోజు ప్రత్యేకించి విద్యాసంస్థల్లో రాజ్యాంగ విలువలు, స్ఫూర్తిపై అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని నిర్దేశించింది. కానీ గత ఆరేండ్ల మోదీ పాలనలో జరుగుతున్నదేమంటే నోటితో నవ్వుతూ, నొసలుతో వెక్కిరించిన చందంగా ‘రాజ్యాంగం పవిత్ర గ్రంథం, అంబేద్కర్ మహోన్నతుడు’ అంటూ ఒక పక్క కొనియాడుతూనే మరో పక్క రాజ్యాంగ స్ఫూర్తికి అనువైన నియమాలు, ప్రకరణలను యథేచ్ఛగా ఉల్లంఘించడం, అంబేద్కర్, నెహ్రూ వంటి దార్శనికుల కృషిని, చరిత్రను తక్కువ చేసి, విస్మరించే ధోరణి సర్వసాధారణమైంది.
సుదీర్ఘంగా కొనసాగిన స్వాతంత్య్రోద్యమంలో పెల్లుబుకిన ప్రజల ఆకాంక్ష లు, త్యాగాలు, పోరాటాల నేపథ్యంలో ‘సంక్షేమ రాజ్యం హృదయం’గా రాజ్యాంగాన్ని రూపొందించారు. 1776 నాటి అమెరికా స్వాతంత్య్ర ప్రకటన ‘మానవులందరూ సమానంగా సృష్టించబడ్డారనీ, మేం విశ్వసిస్తున్నాం’, 1789 నాటి ఫ్రెంచి విప్లవ ప్రకటన ‘స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం’ వంటి భావాలు జాతీయోద్యమ నాయకులని, లక్షలాది జన హృదయాలను పులకింపజేశాయి.
భారతీయ సమాజంలో అవకాశాల్లో, అవసరాలలో, ఎంపికలో సమానత లోపించింది. ఇకపై ఇలా జరగకూడదని, 90 శాతం ఉన్న వర్గాలకు జరిగిన అన్యాయాలు, వివక్షలు ఇకముందు ఉండకూడదని రాజ్యంగ నిర్మాతలు భావించారు. అం దుకే రాజకీయ, ఆర్థిక, సామాజిక ప్రజాస్వామ్యాల ప్రాతిపదికగా సమాజం నిర్మించబడాలనే దృక్పథంతో రాజ్యాంగాన్ని రూపొందించారు.
దేశంలో నెలకొని ఉన్న నైసర్గిక స్వరూపం, భిన్నజాతుల, తెగల, ప్రాంతాల ప్రత్యేకతను పరిగణనలోకి తీసుకొని నిబంధనలను రూపొందించారు. జూలై 22,1947లో నెహ్రూ రూపొందించిన ‘లక్ష్యాల తీర్మానం’ ఆధారంగా రాజ్యాంగ పీఠికను రూపొందించారు. ఈ పీఠిక స్ఫూర్తిని ప్రతిఫలించేలా నియమ నిబంధనలను రాజ్యాంగంలో పొందుపర్చారు. పీఠికలోని తొలి పదం ‘సర్వసత్తా క’ భారతదేశాన్ని స్వతంత్ర దేశమని సూచిస్తుంది. వలసగా గాని అధినివేశంగా లేమని ప్రకటిస్తుంది.
‘సోషలిస్టు’ పదం సంపద కేంద్రీకృతం కాకూడదని, ఉత్పత్తి సాధనాలు, ప్రకృతి వనరులు ప్రత్యేకించి ప్రజల మౌలిక ప్రగతికి తోడ్పడే రంగాలన్నింటిని ప్రభుత్వమే నిర్వహించాలని నిర్దేశిస్తుంది. ప్రాథమిక పరిశ్రమలతో పాటు, కార్పొరేషన్లు, బీమా కూడా ప్రభుత్వమే స్వయంగా నిర్వహించాలనే భావనలను ‘సోషలిస్టు’ పదానికి అన్వయించారు. ఈ స్ఫూర్తితోనే నెహ్రూ, ఇందిరాగాంధీలు జమీందారీలను రద్దుచేశారు. బీమా, బ్యాంకులు, బొగ్గు, రవాణా, విద్యుత్ వంటి అనేక రంగాలను జాతీయం చేశారు. అన్ని మతాలవారిని రాజ్యాం గం గుర్తించాలని ‘లౌకిక’ పదం తెలుపుతుంది. ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం ద్వారా ప్రభుత్వాలు ఏర్పడాలని ‘ప్రజాస్వామ్యం’, ప్రజల చేతనే రాజ్యాధినేత ఎన్నుకోబడాలని ‘గణతంత్రం’ పదా లు నిర్దేశించాయి.
జాతీయవాదులు అధికారంలోకి వచ్చిన ప్రతిసారి రాజ్యాంగ విలువలను కాలరాస్తున్నారు. తీవ్రమైన ఆర్థిక దోపిడీతో పాటు ప్రజలలో విద్వేషపు విషపు భావజాలాన్ని నింపుతున్నారు. రాజ్యాంగాన్ని రద్దుచేయాలి, మార్చాలనే వీరి రహస్య ఎజెండాను క్రమక్రమంగా బాహాటంగానే అమలుచేస్తున్నారు. ప్రభుత్వ పరిశ్రమలు, కార్పొరేషన్ల నుంచి పెట్టుబడులను ఉపసంహరిస్తూ ప్రైవేటుపరం చేస్తున్నారు. 2014 నుంచి కొనసాగుతున్న బీజేపీ పాలనలో ‘ప్రైవేటీకరణ’ వేగంగా కొనసాగుతున్నది.
ప్రజా సంక్షేమం కోసం స్థాపించిన నవరత్న, మినీరత్న పరిశ్రమలను కారుచౌకగా అమ్మేస్తున్నా రు. భారత ఆర్థిక ఆత్మగా ఉన్న ఎల్ఐసీ విలువను తగ్గించారు. భారత అల్యూమినియం కంపెనీ, హిందుస్థాన్ జింక్, ఇండియన్ పెట్రో కెమికల్స్ కార్పొరేషన్ వంటి లాభదాయిక కంపెనీలను రిలయన్స్కు అమ్మివేశారు. విదేశీ సంచార్ నిగమ్ లిమిటెడ్ను టాటా సంస్థకు అప్పజెప్పారు. ఆయి ల్ అండ్ నేచురల్ గ్యాస్, హిందుస్థాన్ పెట్రోకెమికల్స్ నుంచి ప్రభుత్వ వాటాను తగ్గించుకున్నారు. భారత హెవీ పెట్రో కెమికల్స్, కంటెయినర్ కార్పొరేషన్, షిప్పింగ్ కార్పొరేషన్లను ప్రైవేటుపరం చేస్తామని కేంద్రం ప్రకటించింది.
పెట్టుబడుల ఉపసంహరణ, National Monetisation Policyలో భాగంగా 2022-23 ఆర్థిక సంవత్సరంలో 1.63 వేల కోట్ల సమీకరణకు ఐటీడీసీ అశోక హోటల్స్ను ప్రభుత్వం అమ్మకానికి పెట్టింది. ఆర్థిక సంస్థల అంచనా ప్రకారం 18 లక్షల కోట్ల ప్రజా సంపదను పాలకులు ప్రైవేటుపరం చేశారు.
పెట్టుబడుల ఉపసంహరణ, National Monetisation Policyలో భాగంగా 2022-23 ఆర్థిక సంవత్సరంలో 1.63 వేల కోట్ల సమీకరణకు ఐటీడీసీ అశోక హోటళ్లను ప్రభుత్వం అమ్మకానికి పెట్టింది. ఆర్థికసంస్థల అంచనా ప్రకారం 18 లక్షల కోట్ల ప్రజా సంపదను పాలకులు ప్రైవేటుపరం చేశారు. వీటితోపాటు పాలనలో జవాబు దారీతనం, పారదర్శకత కోసం ప్రజలకు ఆయుధంగా రూపొందించిన సమాచార హక్కు చట్టాన్ని, కేంద్ర సమాచార కమిషన్ విధి విధానాలను అనేక సవరణలు చేసి బలహీనం చేశారు. స్వయం ప్రతిపత్తితో పనిచేసే రిజర్వ్బ్యాంకు, ఎలక్షన్ కమిషన్, సీబీఐ, ఈడీ వ్యవహారాలలో తలదూర్చి రాజ్యాంగ స్ఫూర్తిని అపహాస్యం చేస్తున్నారు. గోవా, కర్ణాటక, మహారాష్ట్ర, అనేక ఈశాన్య రాష్ర్టాలలో పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని ఉల్లంఘించి ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకున్నారు. రాజ్యాంగం దేశప్రజలకు కుల, మతాలకతీతంగా నచ్చిన వృత్తిని ఎంచుకోవచ్చునని చెప్పింది. నిజాం రాజు సహాయంతో పండిత్ మదన్ మోహన్ మాలవీయ స్థాపించిన బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో సంస్కృత ఆచార్యునిగా ఎంపికైన ఫిరోజ్ఖాన్ అనే ప్రొఫెసర్ను అడ్డుకుని పెద్ద గొడవ చేశారు. విద్యాలయాలలో మతపరమైన పతాకాలు ఉండకూడదని, తొలగించిన ఉద్యోగిని బలవంతంగా రాజీనామా చేయించారు. రాజ్యాంగానికి ‘పవిత్ర గ్రంథం’ హోదాను దాన్ని రూపొందించిన అంబేద్కర్ గానీ, జాతీయోద్యమ నాయకులు గానీ ఇవ్వలేదు. భవిష్యత్లో రాజ్యాంగ ప్రవేశిక స్ఫూర్తికి ఏ మాత్రం భంగం కలుగకుండా సవరణలు చేసుకునే అవకాశాన్ని కల్పించారు. ప్రవేశిక పవిత్రత, ఉదాత్తతను మంటగలుపుతూనే రాజ్యాంగం పవిత్ర గ్రంథమని నరేంద్ర మోదీ మాట్లాడుతున్నారు.
ప్రస్తుతం దేశం ఆకలి, ఆరోగ్యం, విద్య, జీవన ప్రమాణ సూచికలలో అధమ స్థానానికి చేరుకున్నది. నిరుద్యోగ రేటు పెరిగిపోయింది. పెరిగిన అసమానతలతో తీవ్ర అశాంతి, అంతర్యుద్ధం అంచుకు దేశం నెట్టివేయబడుతున్నది.రాజ్యాంగ లక్ష్యాల అమలు చేయించడంలో సామాజిక విప్లవ నేత అంబేద్కర్ తాత్వికతను కరిగిపోనీయకుండా ప్రయత్నించే బాధ్యత పౌరసమాజానిదే. మహనీయుల కృషి, త్యాగాల స్మృతిని సజీవంగా కొనసాగించడానికి ప్రజాస్వామికవాదులు కదలాల్సిన తరుణం కూడా ఇదే.
(వ్యాసకర్త: అధ్యక్షుడు, దొడ్డి కొమురయ్య ఫౌండేషన్ )
-అస్నాల శ్రీనివాస్
9652275560