2016 నవంబర్ 8న దేశంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం అట్టహాసంగా పెద్ద నోట్లను రద్దుచేసిన రోజు. ఆ తర్వాత సుమారు నెలన్నరకు పైగా, దేశంలోని జన సామాన్యం తమ రోజువారీ బతుకుల్లో సింహభాగం బ్యాంకుల ముందు క్యూలల్లో నిలబడిన కాలం అది. మోదీ నిర్ణయం-దేశంలోని నల్లడబ్బు దొంగలను కలుగులోనే పట్టుకునేందుకు అవసరమైనదిగా భావించి, అంతటి ఇబ్బందులను కూడా తట్టుకొని జనం ప్రభుత్వానికి సహకరించిన సందర్భం అది.
ప్రస్తుతానికి ఇదంతా జరిగి ఆరేండ్లు దాటిపోయింది. వెనక్కు తిరిగి చూసుకుంటే..! నాడు ఆ పెద్దనోట్ల రద్దు కాలంలో వారానికీ… 10 రోజులకు మారుతూపోయిన ఆ నోట్ల రద్దు తాలూకూ కారణాలను ఒక్కొక్కటిగా నేడు మనం పరిశీలించుకుంటే కనపడేదేమిటి? మొదటగా నోట్ల రద్దు ఆరంభంలో మోదీ చెప్పిన కారణం నల్లడబ్బుకు చెక్ పెట్టడం. మరి ఇది ఎంతమేరకు జరిగింది? నాడు రద్దయిన పెద్ద నోట్లు అయిన వెయ్యి రూపాయలు, 500 రూపాయల తాలూకూ మొత్తం విలువ రూ.15.41 లక్షల కోట్లుగా రిజర్వు బ్యాంకు గణాంకాలు చెప్పింది.
పెద్ద నోట్ల రద్దు తర్వాత చాలా కాలానికి అటు ప్రతిపక్షాలు, ఇటు ప్రజల్లోని ప్రశ్నించే గళాలు నిలదీయగా, నిలదీయగా చివరికి రిజర్వు బ్యాంకు వెళ్లగక్కిన నిజం ప్రకారంగా రద్దయిన 15.41 లక్షల కోట్ల రూపాయల మొత్తంలో, బ్యాంకులకు తిరిగి కాస్త కూస్త తేడాతో అంతమొత్తమూ, అంటే 15.31 లక్షల కోట్ల రూపాయలు తిరిగి వచ్చేశాయి. అంటే పట్టుకున్న నల్ల డబ్బు, పట్టుమని రూ.10 వేల కోట్లు కూడా దాటలేదు. అదీ కథ. కొండను తవ్వి ఎలుకను పట్టిన కథ! అంతిమంగా ఈ మొత్తం కథలో ఫోర్బ్స్ అనే అంతర్జాతీయ పత్రిక చెప్పినట్లుగా ఈ పెద్దనోట్ల రద్దు కార్యక్రమం ప్రపంచంలోనే అతిపెద్ద మనీలాండరింగ్ స్కీంగా మిగిలిపోయిందనే సందేహం మాత్రం మనకు మిగిలేపోతుంది.
ఇక ఈ పెద్దనోట్ల రద్దు సీరియల్ కథలో తర్వాత వచ్చి చేరిన కథనం పెద్దనోట్ల రద్దు అనేది, నగదు రహిత అంటే డిజిటల్ లావాదేవీలకు తెర తీయగలదనేది. అయితే కథనం తాలూకూ ఈ భాగం ఎంతవరకూ వాస్తవరూపం ధరించింది? ఈ అంశంలో కాస్తంత వాస్తవ రూపం ధరించింది. అయితే అందులో కూడా అనేక
అపస్వరాలు ఉన్నాయి.
ఉదాహరణకు డిజిటల్ లావాదేవీలు గనుక పెరిగితే వాస్తవంలో కాగితపు కరెన్సీ చెలామణి తగ్గిపోవాలి. కానీ జరిగింది ఇదేనా? కాదు, నిజానికి 2016లో పెద్ద నోట్ల రద్దు జరిగిన రోజుకు నాలుగు రోజుల ముందర చెలామణిలో ఉన్న కాగితపు కరెన్సీ మొత్తం విలువ 17.74 లక్షల కోట్ల రూపాయలుగా ఉన్నది. కాగా, 2022 డిసెంబర్ 23 నాటికి రిజర్వ్ బ్యాంకు గణాంకాల ప్రకారం ఈ మొత్తం 32.42 లక్షల కోట్ల రూపాయలుగా ఉన్నది. అంటే, కాగితపు కరెన్సీ స్థానంలో డిజిటల్ కరెన్సీని ప్రవేశపెట్టే లక్ష్యం, పూర్తిగా వికటించి వాస్తవంలో కాగితం కరెన్సీ చెలామణి రెట్టింపయ్యింది. కాగా మరోపక్క మాత్రం యూపీఐ చెల్లింపులూ… క్రెడిట్, డెబిట్ కార్డుల చెల్లింపులూ… ఆన్లైన్ లావాదేవీల రూపంలో జరిగే లావాదేవీలు కూడా భారీగానే పెరిగాయి. అంటే… ఈ అంశంలో అసలేం జరిగింది? మనం జాగ్రత్తగా గమనిస్తే, నాడు రద్దయిన 1000, 500 నోట్ల స్థానంలో వెలువడిన సరికొత్త 2000 రూపాయల నోట్లు నేడు సాధారణ చెలామణిలో కనబడటం లేదు. మరి ఆ నోట్లన్నీ ఏమైనట్లు? ఇక్కడే అసలు తతంగం ఉన్నది. పెద్దనోట్ల రద్దు పేరుతో వాటి స్థానంలో వచ్చిన ఈ మరింత పెద్దనోటు నేడు బడా బాబులు, అవినీతి రాజకీయనేతలూ, రియల్ ఎస్టేట్ వ్యాపారుల అవసరాల కోసం నల్లడబ్బుగా అండర్గ్రౌండ్కు వెళ్లిపోయింది. అంటే, పెరిగిపోయిన కాగితం కరెన్సీ చెలామణిలోని సింహభాగం నేడు ‘పెద్ద మనుషుల’ లావాదేవీల రూపంలో లెక్కలకు చిక్కకుండా తిరుగాడుతున్నది. కాగా, జన సామాన్యం చెల్లింపులూ, లావాదేవీలూ మాత్రం బహు పారదర్శకంగా నేడు డిజిటల్ ఎకానమీలో ప్రభుత్వ జీఎస్టీ ఆదాయపు రికార్డు స్థాయి పెరుగుదలలుగా నమోదవుతున్నది.
ఇక తర్వాతిది, పెద్ద నోట్ల రద్దు అనేది తీవ్రవాదులకు నిధుల అందుబాటు లేకుండా చేసే మార్గంగా ముందుకువచ్చింది. కాగా, 2016 నవంబర్లో పెద్ద నోట్ల రద్దు జరిగిన తర్వాతే పుల్వామా తీవ్రవాద దాడి జరిగిన విషయాన్ని మనం మరువరాదు. అయితే 2018, 2019, 2020 సంవత్సరాల కాలంలో జమ్మూకశ్మీర్ లో తీవ్రవాద దాడుల సంఖ్య 614 (2018), 594 (2019), 244 (2020)లుగా తగ్గుతూ వచ్చిందనేది నిజం. అయితే దీనికి కారణం పెద్ద నోట్ల రద్దు వల్ల తీవ్రవాదులకు నిధుల అందుబాటు లేకపోవడం కాదు. ప్రభుత్వం తీవ్రవాదం పట్ల అనుసరించిన ‘జీరో టాలరెన్స్’ విధానంతో పాటుగా… కాల్పుల నిలుపుదల ఒప్పందాల ఉల్లంఘనలూ, సరిహద్దుల ఆవల నుంచి కాల్పులు తదితర అంశాల్లో మన భద్రతా దళాలు వెనువెంటనే ప్రతిస్పందించి ఎదురుదాడి చేయడం వంటివన్నీ 2018-20ల కాలంలో తీవ్రవాదం తగ్గుదలకు కారణాలు.
చివరగా.. పెద్ద నోట్లు రద్దయితే ఆ క్రమంలో దొంగనోట్లు కూడా ఏరివేయబడుతాయనే వాదన కూడా పసలేనిదిగానే తేలిపోయింది. నిజానికి నేడు… అంటే పెద్ద నోట్లు రద్దు జరిగి సుమారు ఏడేండ్లు అవుతున్న క్రమంలో నకిలీ నోట్లు లేదా దొంగనోట్ల ఘటనలు పెరుగుతూనే ఉన్నాయి. మరి, ఈ పెద్దనోట్ల రద్దు మోదీ గారి పెద్ద వైఫల్యమా? అంటే, బహుశా కాదేమోననే అనిపిస్తున్నది.
ఈ పెద్దనోట్ల రద్దు క్రమంలో జరిగిన అనేకానేక పరిణామాలు ఇటువంటి నిర్ధారణకు ఆస్కారం కల్పిస్తాయి. మించి, అసలు పెద్ద నోట్ల రద్దుకు ఏమైనా, అప్రకటిత… రహస్య ఎజెండాలు… కారణాలూ ఉన్నాయా? అనే సందేహమూ రాకపోదు! ఉదాహరణకు పెద్దనోట్ల రద్దు క్రమంలో ఒక పెద్ద బాధిత వర్గం చిన్న వ్యాపారులూ, పారిశ్రామికుల వర్గం… అలాగే, రైతాంగం వంటి అసంఘటితరంగ ప్రజానీకం! పెద్దనోట్లు రద్దయి, ఆ క్రమంలో నగదుతో లావాదేవీలూ చేసే అవకాశం లేకుండా పోయినప్పుడు ఈ చిన్న వ్యాపారులూ, అసంఘటిత రంగంలోని వారూ తమ సరుకులనూ, సేవలనూ అమ్ముకోలేక అణగారిపోయారు. రోజువారీ అప్పులకూ, వడ్డీలకూ డబ్బు తెచ్చుకొని వ్యాపారాలు చేసుకొనే చిన్న చిన్న తోపుడుబండ్లూ, బుట్టల వ్యాపారస్తులు శాశ్వతంగా తమ ఉపాధిని కోల్పోయారు. అలాగే అనేకానేక మంది చిన్న పారిశ్రామికులు సైతం రోజువారీ ముడిసరుకు చెల్లింపులకో లేదా వేతనాల చెల్లింపులకో నగదు అందుబాటు లేక బోర్డులు తిప్పేశారు. ఈ క్రమంలోనే, వీరు కోల్పోయిన అమ్మకాలు లేదా లావాదేవీల అవకాశాలు డిజిటల్ లావాదేవీలు అంటే క్రెడిట్, డెబిట్ కార్డులూ అలాగే ఆన్లైన్ లావాదేవీలకు సదుపాయాలు అప్పటికే ఉన్న పెద్ద వ్యాపారసంస్థలూ… మాల్స్కు అదనపు అమ్మకాలు, లావాదేవీలుగా జమయ్యాయి. అంటే, పెద్దనోట్ల రద్దు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో కాకులను కొట్టి గద్దలకు వేసేదిగా పరిణమించింది.
దేశ ప్రజల పెట్టుబడుల లేదా మదుపుల ప్రాధాన్యాలను కూడా ఈ పెద్దనోట్ల రద్దు మార్చే ప్రయత్నం చేసింది. ఉదాహరణకు నాడు పెద్ద నోట్ల రద్దు ప్రకటించబడిన వెంటనే దేశంలో రియల్ ఎస్టేట్ రంగం కుదేలైంది. కాగా, భారతీయులు తమ పెట్టుబడుల పరం గా భౌతిక సంపత్తి వైపు అంటే రియల్ ఎస్టేట్ కొనుగోళ్లూ… లేదా బంగారం కొనుగోళ్ల వైపు మొగ్గు చూపుతారనేది అందరికీ తెలిసిందే. అంటే వీరు షేర్ మార్కెట్ల వంటి పెట్టుబడులను పెద్దగా ఇష్టపడరు. అయితే పెద్ద నోట్ల రద్దు ఈ ఇష్టాయిష్టాలపై పెద్ద దెబ్బే తీసింది. మరోపక్క ఈ నోట్ల రద్దు జరిగిన 15, 20 రోజులకు రేకెత్తించబడిన చర్చ ఏమిటంటే మగవారి వద్ద 250 గ్రాములు, మహిళల వద్ద 500 గ్రాముల కంటే అధికంగా బంగారం ఉం టే దానంతటికీ బిల్లులు లేదా కొనుగోలు రశీదులు ఉండి తీరాలని.
ఈ మేరకు జరిగిన చర్చలో ఒకానొక మరుగునపడిన పాత చట్టం తాలూకూ ప్రస్తావనలు ముందుకువచ్చాయి. ఈ చర్చ క్రమంలో టీవీ మైకుల ముందు మన మహిళలు తాము కలిగి ఉండేందుకు అవకాశం ఉన్న బంగారంపై పరిమితుల గురించిన అంశంలో తీవ్రాతితీవ్రంగా విరుచుకుపడ్డారు. విమర్శలు చేశారు. సహించమంటూ హెచ్చరికలు చేశారు. అయితే, అంతిమంగా ఈ రకమైన చర్చ కూడా కొంత, బంగారం కొనుగోళ్ల విషయంలో ప్రజల్లో భయాందోళనలను కలిగించగలిగింది.
ఏది ఏమైతేనేం, అనంతరకాలంలో భౌతిక సంపత్తిలో పెట్టుబడులు తగ్గి షేర్ మార్కెట్ల దిశగా దేశంలో రిటైల్ పెట్టుబడులు కూడా పెరిగాయి. పర్యవసానంగానే 2016 నవంబర్ తర్వాతికాలంలో దేశంలోని షేర్ సూచీలు భారీగా పెరిగాయి. అలాగే మ్యూచ్వల్ ఫండ్ సంస్థల యాజమాన్యం కింద ఉన్న ఆస్తుల విలువలు భారీగా పెరిగాయి. అంటే, ఇదంతా ఒకరకంగా అంతర్జాతీయ ఫైనాన్స్ పెట్టుబడులూ… వాటి ఒత్తిడి కింద, షేర్ మార్కెట్ల అవసరాలకూ తలొగ్గుతున్న ప్రభుత్వాలకూ కూడా విజయమే. ఇక కరోనా అనంతర లాక్డౌన్ల కాలం, మన ప్రజానీకంలో ఈ షేర్ మార్కెట్ల పెట్టుబడి అలవాటును మరింతంగా పెంచిపోషించింది. అదీ కథ…!
కాబట్టి, పెద్దనోట్ల రద్దు అనేది కేవలం నల్లడబ్బును నియంత్రించడం వంటి అమాయకమైన ఉద్దేశాలతో మాత్రమే జరిగిందని అనుకోలేం. ఈ నోట్ల రద్దు క్రమంలో దేశంలో… దాని ఆర్థిక రంగంలో జరిగిన పరిణామాలు… అంటే, చిన్న చేపను మింగేందుకు పెద్ద చేపకు అవకాశాలు కల్పించే పరిస్థితుల సృష్టి వంటివన్నీ అనేక సందేహాలకు కచ్చితంగా తావిచ్చి తీరుతాయి.
ప్రజల పేరు చెప్పి వారికే పంగనామాలు పెట్టే విధానాల రూపకల్పనలో బహుశా నేడు కేంద్ర పాలకులు కచ్చితంగా కొత్త పుంతలు తొక్కుతూ… కొంగొత్త దారులు వెతుకుతున్నారు. కానీ, సామాన్య ప్రజల పట్ల కనికరం లేని.. నికరంగా లాభాపేక్ష మినహా… ఏ మానవీయ విలువలు లేని.. ఈ విధానాలు అంతిమంగా, పాలకవర్గానికి పులిమీద స్వారీయే కాగలవు…!!!
దేశ ప్రజల పెట్టుబడుల లేదా మదుపుల ప్రాధాన్యాలను కూడా ఈ పెద్దనోట్ల రద్దు మార్చే ప్రయత్నం చేసింది. ఉదాహరణకు నాడు పెద్ద నోట్ల రద్దు ప్రకటించబడిన వెంటనే దేశంలో రియల్ ఎస్టేట్ రంగం
కుదేలైంది. కాగా, భారతీయులు తమ పెట్టుబడుల పరంగా భౌతిక సంపత్తి వైపు అంటే రియల్ ఎస్టేట్
కొనుగోళ్లూ… లేదా బంగారం కొనుగోళ్ల వైపు మొగ్గు చూపుతారనేది అందరికీ తెలిసిందే. అంటే వీరు షేర్ మార్కెట్ల వంటి పెట్టుబడులను పెద్దగా ఇష్టపడరు. అయితే పెద్ద నోట్ల రద్దు ఈ ఇష్టాయిష్టాలపై పెద్ద దెబ్బే
తీసింది.
పెద్ద నోట్ల రద్దు తర్వాత చాలా కాలానికి అటు ప్రతిపక్షాలు, ఇటు ప్రజల్లోని ప్రశ్నించే గళాలు నిలదీయగా, నిలదీయగా చివరికి రిజర్వు బ్యాంకు వెళ్లగక్కిన నిజం ప్రకారంగా రద్దయిన 15.41 లక్షల కోట్ల రూపాయల మొత్తంలో, బ్యాంకులకు తిరిగి కాస్త కూస్త తేడాతో అంతమొత్తమూ, అంటే 15.31 లక్షల కోట్ల రూపాయలు తిరిగి వచ్చేశాయి. అంటే పట్టుకున్న నల్ల డబ్బు, పట్టుమని రూ.10 వేల కోట్లు కూడా దాటలేదు. అదీ కథ. కొండను తవ్వి ఎలుకను పట్టిన కథ!
డి.పాపారావు: 98661 79615