కొవిడ్ అనంతర కాలంలో తెలుగు సాహిత్యంలో సరికొత్త ధోరణులు చోటుచేసుకొన్నాయి. అంతర్జాల వేదికలు, సాహిత్య సదస్సులు, సభలు, పుస్తక ప్రదర్శనలు, సాహిత్య జాతరలు అక్షర జగత్తుకు కొత్త కళను తెచ్చాయి. పలు రంగాల నుంచి వస్తున్న నేటి తరం రచయితలు తమదైన శైలితో పాఠకులను అలరిస్తూ, తెలుగు సాహిత్యంలో ఒక కొత్త శకానికి నాంది పలుకుతున్నారు. ఇది శుభపరిణామమే అయినప్పటికీ, ప్రస్తుత సాహిత్యంలో కనిపిస్తున్న ధోరణులను ఈ తరం రచయితలు నిశితంగా గమనించాలి. సమాజంలో వస్తున్న మార్పులను లోతుగా, జాగ్రత్తగా అర్థం చేసుకొన్నప్పుడే, వారు రాసే అక్షరానికి సామాజిక ప్రయోజనం చేకూరుతుంది.
సాహిత్యం ఏ ఒక్క ప్రాంతానికో, వర్గానికో పరిమితం కాకూడదు. నేటి రచనలు, సాహిత్య చర్చలు కేవలం భావజాల విశ్లేషణలకే ప్రాధాన్యత ఇస్తున్నాయన్న విమర్శ ఉన్నది. సిద్ధాంతాల చట్రంలో అక్షరాన్ని బంధించడం వల్ల సృజన తన సహజత్వాన్ని కోల్పోతున్నది. రచయిత కర్తవ్యం కేవలం వాదాలను వినిపించడమే కాదు, సామాజిక వాస్తవికతను వెలికితీయడం. సగటు మనిషి దైనందిన కష్టాలు, మానవ సంబంధాలను లోతుగా చిత్రించినప్పుడే ఆ సృజనకు అసలైన జీవం వస్తుంది. ప్రాంతీయ సంస్కృతి, మనుషుల మధ్య అనురాగాలను ఆకళింపు చేసుకొని రాసినప్పుడే ఆ రచన కాలప్రవాహంలో నిలబడి పరిపూర్ణత సాధిస్తుంది. ఊహలు, వాస్తవాలకు మధ్య సమతుల్యత పాటిస్తూ, సామాజిక మూలాలను తాకే అక్షరాలే పాఠకుడి హృదయానికి త్వరగా చేరువవుతాయి.
కొంతమంది రచయితలు సమాజ మార్పు కోసం ఉద్యమాలు రావాలని, పోరాటాలు చేయాలని వేదికలపై ప్రసంగాలు చేస్తున్నారు. ఇలా చెప్పడం సులభమే కానీ, ఆ పిలుపు వెనుక ఉండే నిజజీవితం ఎంతో కఠోరమైనది. ప్రతి సామాజిక, రాజకీయ విప్లవం వెనుకా ఎన్నెన్నో త్యాగాలు, కఠోర వాస్తవాలు దాగి ఉంటాయనే సత్యాన్ని రచయితలు విస్మరించకూడదు.
రచయిత బాధ్యత కేవలం బయట వినిపించే నినాదాలకే పరిమితం కాకూడదు. ఆ పోరాటాల వల్ల నలిగిపోయిన సగటు మనిషి జీవితాలు, వారి కష్టసుఖాలను నిజాయితీగా చూపించడంలోనే గొప్పతనం ఉన్నది. సా మాజిక మేలు కోసం తమ సర్వస్వాన్ని వదులుకున్న వారి మనసులోని వేదనను సాహి త్యం తాకినప్పుడే అది సమాజానికి సరైన దారిచూపుతుంది. చారిత్రక ఉద్యమాల వల్ల సర్వస్వం కోల్పోయి వీధిన పడిన కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. వారిపై కేవలం జాలి చూపితే సరిపోదు, వారి స్థితిగతుల్లో మార్పు తెచ్చేలా ప్రజలను చైతన్యపరచాలి.
దశాబ్దాల పాటు ఒక సిద్ధాంతం కోసం వ్యక్తిగత సుఖాలను త్యాగం చేసి, అడవుల్లో గడిపిన విప్లవకారులు సైతం..మారుతున్న సామాజిక స్థితిగతులు, వ్యవస్థ స్వరూపాన్ని గమనిస్తున్నారు. సాయుధ పోరాటాల కంటే సామాజిక పరివర్తనకు ప్రజాస్వామ్య మార్గాలే అనివార్యమని వారు గుర్తిస్తున్నా రు. ఈ మార్పును కేవలం ఒక సిద్ధాంత వైఫల్యంగానో, వ్యక్తిగత నిర్ణయంగానో చూడ లేం. ఇది మారుతున్న కాలంతో పాటు ఉద్యమకారుల ఆలోచనా విధానంలో వస్తున్న గుణాత్మకమైన పరిణామం.
పాత పద్ధతులు ఆచరణ సాధ్యం కానప్పుడు, ప్రజాస్వామ్య పంథాలో సరికొత్త దారులను అన్వేషించడం సామాజిక అవసరంగా మారింది. నవతరం రచయితలు ఈ ఆచరణాత్మక వాస్తవాలను, ఉద్యమకారుల అంతర్మథనాన్ని లోతుగా గ్రహించినప్పుడే వారి రచనలు వాస్తవ ప్రపంచంలో సజీవంగా నిలబడతాయి. బతుకు భారంతో నలిగిపోతున్న మనిషి నైతికతను సాహిత్యం మేల్కొల్పాలి. ప్రస్తుత సామాజిక స్థితిని చూస్తే, నైతిక విలువల పతనం వ్యవస్థలో ఎంతగా పాతుకుపోయిందో అర్థమవుతున్నది. ప్రతి చిన్న పనికీ పాలకులనో, అధికారులనో బతిమాలాల్సిన పరిస్థితి సగటు మనిషిని నైతికంగా కుంగదీస్తున్నది. రచయితలు ప్రస్తుతం ఈ ప్రాథమిక సమస్యలపై దృష్టి సారించాలి.
డిజిటల్ యుగంలో వైరల్ అవుతున్న వీడియోల హోరులో లోతైన అక్షరాన్ని నిలబెట్టడం నేటి రచయితల ముందున్న పెద్ద సవాల్. నేటితరం రచయితలు గమనించాల్సిన మరో ముఖ్యమైన విషయం..ప్రభుత్వ గుర్తింపులు, పురస్కారాల పట్ల పెరుగుతున్న మోజు. గత దశాబ్దకాలంగా తెలుగు సాహిత్య అవార్డుల తీరుతెన్నులను పరిశీలిస్తే, ప్రభుత్వ సంస్థల నుంచి లభించే గుర్తింపు కోసం రచయితలు ఎంతగా తపిస్తున్నారో అర్థమవుతున్నది.
కార్పొరేట్ కంపెనీల రాకతో సామాన్యుల జీవితాలు అస్తవ్యస్తం అవుతాయని చాలామంది రచయితలు గొంతెత్తారు. ఈ శతాబ్దపు ఆరంభంలో ప్రపంచీకరణ వల్ల కలిగే నష్టాలను ఎండగడుతూ ఎన్నో పుస్తకాలు వచ్చాయి. అయితే, నిన్నటివరకు ఏ శక్తులను వారు తీవ్రంగా వ్యతిరేకించారో, నేడు అవే సంస్థలు కల్పిస్తున్న అత్యాధునిక సౌకర్యాలకు దాసోహం కావడం విచారకరం. మొబైల్ ఫోన్లు, సామాజిక మాధ్యమాలు, పిల్లల విదేశీ చదువులు, విలాసవంతమైన ఉద్యోగాలతో సహా అన్నీ కార్పొరేట్ బాటలోనే సాగిస్తున్నారు. అవే వేదికల నుంచి మళ్లీ అవే వ్యవస్థలను విమర్శించడం ఆచరణలో కనిపిస్తున్న అతిపెద్ద వైరుధ్యం.
ప్రాంతీయ గుర్తింపును చాటుకోవడం మంచిదే అయినా, అది దేశ ప్రయోజనాలకు విరుద్ధంగా ఉండకూడదు. అక్షరం మనుషుల మధ్య ఉన్న గోడలను చెరపాలి. భౌగోళిక హద్దుల కంటే మానవత్వానికే ఎక్కువ ప్రాధాన్యత ఉండాలి. మహాకవి శ్రీశ్రీ, గురజాడ వంటి వారు ఆశించిన విశాల దృక్పథం నేటితరం రచయితల్లో కనిపించాలి. రకరకాల సం స్కృతుల కలయికతోనే సాహిత్యం అభివృద్ధి చెందుతుంది. ఇతర భాషల సాహిత్యంతో సహకారం ద్వారా మన సాహిత్యం మ రింత బలోపేతం కావాలి, సామాజిక ఐక్యతను పెం పొందించాలి. అక్షరం విడదీయడం కోసం కాదు, కలపడం కోసం అనే సత్యాన్ని గుర్తుంచుకోవాలి.
నేటి తెలుగు సాహిత్యం క్లిష్టమైన దశలో ఉన్నది. ఒకవైపు ఎన్నో అవకాశాలు, మరోవైపు నైతిక సవాళ్లు ఉన్నాయి. రచయిత కేవలం అక్షరాలు రాసే వ్యక్తి మాత్రమే కాదు, సమాజానికి దారి చూపే దిక్సూచి కావాలి. సిద్ధాంతాల ముసు గు తీసేసి, ఆడంబరాలకు దూరంగా ఉండి, ప్రజల మధ్య కలిసిపోయినప్పుడే ఉత్తమ సాహిత్యం పుడుతుంది.
అక్షరం కేవలం భావాలను వ్యక్తీకరించే సా ధనం మాత్రమే కాదు, అది నాగరికతను ని లిపే జీవన సంస్కృతికి ప్రతిరూపం. ఉన్నతమైన ఆలోచనలను భావితరాలకు అందించడమే నేటి రచయితల ముందున్న అసలైన కర్తవ్యం. అప్పుడే సామాన్య పాఠకుడు సాహి త్యం వైపు మొగ్గు చూపుతాడు. సమాజం లోని రుగ్మతలను కడిగివేసే శక్తి సాహిత్యానికి రావాలంటే, రచయితలో ఆత్మీయత, నిబద్ధత ఉండాలి. అప్పుడే యువ రచయితల క లం మళ్లీ ప్రజల గొంతుకగా మారి, అక్షర లోకంలో కొత్త వెలుగును నింపుతుంది.
-ప్రొఫెసర్ వెంకటరామయ్య గంపా ,99586 07789