అక్షరం అంటే క్షరము కానిది. అంటే శాశ్వతంగా ఉండేది. మనిషి తన జీవితంలోని భావోద్వేగాలు, సంఘర్షణలు, సాధక బాధకాలు అన్నింటికీ అక్షర రూపం ఇస్తుంటాడు. అలాగే ప్రేమలను, అనుబంధాలను, అనుభవాలను జోడించి అక్షర కుసుమాలను అల్లుతాడు. అసలు కవిత్వం అంటేనే జీవనచిత్రన కదా! ఇక్కడ కవయిత్రి లహరి ‘అక్షరనేత్రాలు’ కూడా జీవితసారం లోంచి ఉద్భవించినవనే చెప్పాలి.
పాదాభివందనం అనే కవితలో తల్లి కష్టం, ఓర్పు, ప్రేమానురాగాలు, తెగువ, ధైర్యం గురించి చెబుతూ గమ్యం లేకుండా వందల మైళ్ళు నడిచి/దరి దొరకని నదిని ఏళ్లకేళ్ళు ఈది/అండ లేని బతుకు బండిని ఒంటెద్దులా నడిపించి/ బతుకు పోరులో బిడ్డల్ని గెలిపించిన ఓ అమ్మా నీ ఓర్పుకు నా పాదాభివందనం అంటూ రాసిన తీరు మనుసును హత్తుకుంటుంది. అలాగే నాన్న గురించి కూడా మా పెన్నిధి అనే కవితలో చక్కగా వర్ణించారు. ప్రేమ గుండెల్లోంచి ఒలికించి/ మాకు తలా కొంత పంచుతూ/ చిరునవ్వు చిందించే ఓ నాన్నా/ నీ నవ్వు పసి పిల్లాడి నోటికంటిన పాలమీగడ అంటూనే బ్రతుకు కొవ్వొత్తి కరిగించి వెలుగు దీపమైనావు అని చిత్రించిన విధానం బాగుంది.
దేశానికి వెన్నెముక రైతు. అతని సేవకు దేశం మొత్తం ఎప్పు డూ రుణపడి ఉంటుంది. అలాం టి రైతు గురించి ఇలా చెబు తారు. ఆరుగాలం శ్రమతో మట్టిని ఒళ్ళంతా పూసుకుని/అప్పు చేసి మరీ అవని ఆకలిని తీర్చుతాడు/చివరకు కుప్ప చేతికి రాక నష్టపోయినా అమావాస్య చీకట్లు అమాంతం కమ్మేసినా/ వెనకడుగు వేయని నిస్వా ర్థ జీవుడు. నిజంగా రైతును మిం చిన నిస్వార్థ జీవుడు ఎవరూ ఉండరు. లహరి ఇలాంటి మరెన్నో కవితలు రాసి సాహితీ ప్రపంచంలో కీర్తీ శిఖరాలను అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అభినందనలు.
ప్రతులకు: ఎన్. లహరి, 98855 35506
– శ్రీకాంత్ బింగి, 78936 13015