‘ప్రజలను కాపాడుకుందాం- దేశాన్ని రక్షించుకుందాం..’ నినాదంతో కేంద్ర కార్మిక సంఘాలు, స్వతంత్ర సంఘాల ఐక్యవేదిక మార్చి 28, 29 తేదీల్లో దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చాయి. ఉద్యోగులు, రైతులు, సామాన్య ప్రజానీకం జీవితాలను చిన్నాభిన్నం చేసే పలు ప్రభుత్వ నిర్ణయాలు, బిల్లులకు వ్యతిరేకంగా అన్నిరంగాల ఉద్యోగులు ఈ సమ్మెలో పాల్గొంటుండటం గమనార్హం. బొగ్గు, ఉక్కు, చమురు, టెలికం, పోస్టల్, ఆదాయపు పన్ను, బీమా తదితర శాఖల ఉద్యోగులు ప్రభుత్వానికి సమ్మె నోటీసులు అందజేసిన ఈ తరుణం గంభీరమైనదనే చెప్పాలి.
హర్యానా ప్రభుత్వం చేసిన ఎస్మా హెచ్చరికలను సైతం పెడచెవిన పెట్టి రహదారులు, రవాణా, విద్యుత్శాఖల ఉద్యోగులు బందుకు మద్దతును ప్రకటించారు. ఈ సమ్మెలో బ్యాంకింగ్, విద్యుత్రంగాల ఉద్యోగులు కూడా పాల్గొంటున్నారు. ఇదిలా ఉంటే రైల్వే, భద్రతారంగాల యూనియన్లు కూడా సమ్మెకు మద్దతుగా నిలబడనున్నాయి.
44 కార్మిక చట్టాలను 4 లేబర్ కోడ్లుగా మార్చడం, విద్యుత్ సవరణ చట్టం-2021, ప్రభుత్వ ఆధీనంలోని సంపదను కార్పొరేట్ శక్తులకు అప్పజెప్పడానికి ఉద్దేశించిన నేషనల్ ల్యాండ్ మానిటైజేషన్ కార్పొరేషన్ (ఎన్ఎల్ఎంసీ) ఏర్పాటు, పీఎఫ్ డిపాజిట్ల వడ్డీ రేటును 8.5 శాతం నుంచి 8.1 శాతం తగ్గించడం, లాభాల బాటలో నడుస్తున్న బీమా, బ్యాంకింగ్ తదితర రంగాల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సమ్మెకు పూనుకుంటున్నారు.
ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ, వంటగ్యాస్ తదితర పెట్రోలియం ఉత్పత్తుల ధరలు కూడా ప్రజల ఆక్రోశానికి కారణం. విద్యుత్రంగం ఉమ్మడి జాబితా లో ఉన్న (కంకరంట్ లిస్ట్) అంశం. దీనిమీద ఆధిప త్యం సాధించడం కోసం సంస్కరణలు, సవరణలు తెస్తున్నది కేంద్ర ప్రభుత్వం. తద్వారా రాష్ట్ర ప్రభుత్వాలను నామమాత్రపు, ప్రేక్షక పాత్రకు పరిమితం చేయడమే.
విద్యుత్ డిస్కంలలోకి ప్రైవేట్ కంపెనీలను అనుమతించడం వల్ల యాజమాన్యాల ఆధిపత్యం పెరుగుతుంది. దీంతో ప్రజా జీవన పరిస్థితులకు అనుగుణంగా తీసుకు న్న నిర్ణయాలను కాదని ప్రజలపై భారం మోపేవిధంగా కంపెనీలు వ్యవహరిస్తాయి. ఆ క్రమంలోనే పేద, కార్మిక, కర్షక వర్గాలను ముక్కుపిండి బిల్లులు వసూలు చేయడం తో పాటు వ్యవసాయరంగానికి ఇస్తున్న సబ్సిడీలు నిలిచిపోతాయి. పరిశ్రమలకు, కనీస అవసరాలకు ఉపయోగించే కరెంటును ఒకే ధరకు కొనాలనడం రాజ్యాంగం కల్పించిన సంక్షేమ భావనకు వ్యతిరేకం.
అదేవిధంగా లక్షల కోట్ల విలువైన జాతీయ రహదారులను, వేల కిలోమీటర్ల నిడివిగల గెయిల్ పైపులైన్ను, విద్యుత్ ట్రాన్స్మిషన్ లైన్లను, హెచ్పీసీఎల్ గ్యాస్ పైప్లైన్లను, సింగరేణికి సంబంధించిన నాలుగు బొగ్గు బ్లాకులనే కాకుండా దేశంలోని సహజవనరుల నిక్షిప్తాలను అతిచౌక ధరలకు వేలం వేయబోతున్నారు. విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ, బీహెచ్ఈయల్, బీడీయల్, హెచ్ఏయల్, మిథాని లాంటి సంస్థలు కూడా ప్రైవేటుపరం కానున్నాయి.
44 కార్మిక చట్టాలను 4 లేబర్ కోడ్లుగా ప్రవేశపెట్టి కార్మికుల హక్కులను కాలరాసే ప్రయత్నం చేస్తున్నారు. ట్రేడ్ యూనియన్ల రద్దుకు రిజిస్ట్రార్లకు విశేషమైన అధికారాలు ఇవ్వజూస్తున్నారు. నూతన యూనియన్ల నమోదును క్లిష్టతరం చేయడం లాంటి చర్యలు కార్మికుల్లో అభద్రతను పెంచబోతున్నాయి. తిరిగి 12 గంటల పని విధానం అమల్లోకి వస్తుందేమోనన్న భయాందోళనలు కూడా వ్యక్తమవుతున్నాయి.
ప్రభుత్వరంగ బ్యాంకులను, సంస్థలను గుదిబండలుగా ముద్రవేసి ప్రైవేట్ వ్యక్తులపరం చేసే ప్రయత్నాలు జోరుగా సాగుతున్నాయి. అలాగే లాభాల్లో ఉన్న ఎల్ఐసీ లాంటి సంస్థలను కూడా ప్రైవేట్పరం చేయడానికి ఉవిళ్లూరుతున్నది కేంద్రం. 2014లో ప్రారంభమైన 4జీని ఇప్పటివరకు బీఎస్ఎన్ఎల్కు విస్తరించకుండా, సంస్థ ఉద్యోగులను తొలగిస్తున్నారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాల మూలంగా రోజురోజుకు పడిపోతున్న జీడీపీని కాపాడే పనులు చేయకుండా ప్రభుత్వ ఆస్తుల ను ధన రూపానికి మార్చుకొని పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారు. ఇలాంటి దేశ వ్యతిరేక, ఉద్యోగ వ్యతిరేక విధానాలను ప్రతిఘటించటమే ఇప్పుడు దేశ ప్రజల ముందున్న కర్తవ్యం. మొదటిసారి దేశవ్యాప్తంగా ఉన్న కార్మిక సంఘాలన్నీ ఏకతాటిపై నిలిచి మోదీ ప్రభుత్వా నికి వ్యతిరేకంగా ఉద్యమించటం ఆహ్వానించదగిన పరి ణామం. ఇలాంటి సంఘటిత శక్తితోనే కేంద్రం మెడలు వంచి దేశాన్ని రక్షించుకోగలుగుతాం.
– సౌజన్య ఠాకూర్