గవర్నర్ అనేది రాష్ట్ర పరిధిలో అత్యున్నత రాజ్యాంగ పదవి. రాష్ట్ర పరిపాలన అంతా గవర్నర్ పేరు మీదనే సాగుతుంది. ఎంతో హుందాతనంతో, పరిణతితో ఆ పదవిని నిర్వహించాల్సిన అవసరముంటుందని ప్రత్యేకించి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఇటీవలి కాలంలో గవర్నర్లు తరచుగా వివాదాల్లో చిక్కుకోవడం దురదృష్టకరం. కేంద్ర ప్రతినిధిగా, సంధానకర్తగా వ్యవహరించాల్సిన గవర్నర్లు కేంద్ర ప్రభుత్వ ఏజెంట్లుగా విపక్ష రాష్ట్ర ప్రభుత్వాలపై వేధింపులకు దిగుతున్నారు. ఎన్నికైన ప్రభుత్వాల పనితీరుకు అడ్డం పడుతూ ప్రజాప్రాతినిధ్య పాలనను అభాసుపాలు చేస్తున్నారు. సమాఖ్య స్ఫూర్తికి చిల్లులు పెడుతున్నారు. నామమాత్రంగా అనుమతి ఇవ్వాల్సిన బిల్లులకు మోకాలడ్డుపెట్టి రాష్ట్ర ప్రభుత్వాలను ముప్పుతిప్పలు పెడుతున్నారు. కేంద్రంలోని పాలకపక్ష విధానాలకు అనుగుణంగా వ్యవహరిస్తూ రాజకీయ నిష్పాక్షికతకు నీళ్లు వదులుతున్నారు. లేనిపోని కొర్రీలు వేస్తూ, మీడియా ముందుకు వస్తున్నారు. శాసన వ్యవస్థతో కలిసిమెలిసి పనిచేయాల్సిన గవర్నర్లు ప్రత్యర్థుల్లా మారుతున్నారు.
ఇటీవలి కాలంలో తెలంగాణ, తమిళనాడు, కేరళ, బెంగాల్ గవర్నర్లు తమతమ రాష్ట్ర ప్రభుత్వాలను ఇబ్బందులు పెట్టడం మనం చూస్తున్నాం. తమిళనాడు గవర్నర్ రవి ఏకంగా ఓ మంత్రినే తన ఇచ్ఛానుసారం బర్తరఫ్ చేసి, వెంటనే ఆ నిర్ణయాన్ని వెనుకకు తీసుకోవడం ఆ మధ్య సంచలనం సృష్టించింది. డీఎంకే సర్కారు విధానాలను ఆయన బాహాటంగానే విమర్శిస్తూ మీడియాకెక్కారు. తెలంగాణ గవర్నర్ తమిళిసై బిల్లులను పెండింగ్లో పెట్టడం, రాష్ట్ర ప్రభుత్వం కోర్టును ఆశ్రయించడం తెలిసిందే. ఇక బెంగాల్లో మమతా బెనర్జీ సర్కారుపై గవర్నర్ విమర్శలు గుప్పించడం నిత్యకృత్యమైంది. అనేక సందర్భాల్లో కోర్టులు గవర్నర్ల పాత్రపై విమర్శనాత్మక వ్యాఖ్యలు చేశాయి. తాజాగా కేరళ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ఖాన్పై సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు వ్యవస్థ ప్రస్తుత దుస్థితికి అద్దం పడుతున్నాయి.
కేరళ శాసనసభ ఆమోదించిన ఎనిమిది బిల్లులపై నిర్ణయం తీసుకోకుం డా రెండు సంవత్సరాల నుంచి ఏం చేస్తున్నారని సర్వోన్నత న్యాయస్థానం ఘాటుగా నిలదీసింది. ఆ బిల్లులను ఆపివేయటానికి కారణాలేవీ గవర్నర్ చూపలేకపోయారని కూడా ఎత్తిచూపింది. కేరళ గవర్నర్ దగ్గర మొత్తం ఎనిమిది బిల్లులు పెండింగులో ఉండగా అందులో ఏడింటిని రాష్ట్రపతి పరిశీలనలకు పంపి, ఒకదానికి ఆమోదం తెలిపారు. అదీ వివాదం కోర్టు మెట్లెక్కిన తర్వాతనే. ఇదివరకే అమలులోకి తెచ్చిన ఆర్డినెన్సుల స్థానంలో ప్రవేశపెట్టిన బిల్లులను ఇన్నాళ్లుగా తొక్కిపెట్టి ఇప్పుడు రాష్ట్రపతి పరిశీలనకు పంపడం ఏమిటని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ముఖ్యమంత్రితో, సంబంధిత మంత్రి తో గవర్నర్ మాట్లాడాలని సూచించింది. రాజకీయ విజ్ఞత ద్వారానే పరిష్కారం కనుగొనాలని హితవు చెప్పింది. ఈ వివాదం ఇలాగే కొనసాగితే తన రాజ్యాంగ బాధ్యతల మేరకు స్వయంగా మార్గదర్శకాలను జారీచేయడం గురించి పరిశీలిస్తామని సుప్రీంకోర్టు హెచ్చరించడం గమనార్హం.
ఎన్నికైన ప్రభుత్వాల పనికి అడ్డుపడటం మంచిది కాదని, తాము ఎన్నికైన ప్రజా ప్రతినిధులం కామని గుర్తెరగాలని సుప్రీంకోర్టు ఇదివరకే గవర్నర్లకు హితవు చెప్పింది. బిల్లులపై నిర్ణయం తీసుకునేందుకు నిర్ణీత గడువు అంటూ ఉండాలని కూడా అభిప్రాయపడింది. గవర్నర్ పదవిని అడ్డుపెట్టుకుని కేంద్రం తన అభీష్టాల్ని, పంతాల్ని తీర్చుకునేందుకు ప్రయత్నించడం కొత్తేమీ కాదు. నిజానికి కాంగ్రెస్ హయాంలోనే గవర్నర్ల వ్యవస్థ దుర్వినియోగం మొదలైంది. రానురాను అది శృతిమించిపోయి వెర్రితలలు వేసింది. కేంద్రానికి గిట్టని రాష్ట్ర ప్రభుత్వాలను గద్దె దింపేదాకా పోయింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎన్టీయార్ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేసి నాదెండ్ల భాస్కరరావును ముఖ్యమంత్రిని చేసిన గవర్నర్ రాంలాల్ ఉదంతం తెలిసిందే. ప్రస్తుత బీజేపీ పాలనలోనూ గవర్నర్ల తీరుతెన్నుల్లో ఏమాత్రం మార్పు కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో బ్రిటిష్ వలసపాలన అవశేషంగా మిగిలిపోయిన గవర్నర్ పదవి ప్రాసంగికతే ప్రశ్నార్థకమవుతున్నది.