దశాబ్దాలుగా కొనసాగుతున్న ఇరాన్ అణు సంక్షోభం ఇప్పటికైనా ఒక కొలిక్కి వస్తుందా అని వియన్నా చర్చల పట్ల ప్రపంచదేశాలు ఆసక్తి చూపుతున్నాయి. అమెరికా తన ఏకపక్ష వైఖరిని కొంతైనా సడలించుకోవటంపై ఫలితం ఆధారపడి ఉంటుందని ఇరాన్ చెబుతుంటే, తొలుత అణుకార్యక్రమాలను కట్టిపెట్టి మాట్లాడాలని అమెరికా అంటున్నది. ఈ వ్యవహారం పైకి చూడటానికి ప్రశాంతంగానే ఉన్నప్పటికీ, గల్ఫ్ ప్రపంచంలో ఆ మాటకొస్తే ప్రపంచస్థాయిలో తీవ్ర ప్రభావం చూపించే అంశం ఇది. ఇరాక్, అఫ్గానిస్థాన్ తదితర దేశాల్లో ఎదురైన చేదు అనుభవాల నేపథ్యంలో అమెరికా ప్రత్యక్షంగా ఇరాన్ మీదికి కాలు దువ్వకపోవచ్చుగానీ, ఇజ్రాయెల్ భుజం మీది నుంచి తుపాకి పేల్చవచ్చన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అమెరికా ఈ విధమైన దుస్సాహసానికి ఒడిగడితే పశ్చిమాసియా మళ్లీ భగ్గుమనటం ఖాయం.
అణుశక్తి సామర్థ్యాన్ని సంతరించుకోవటానికి ఇరాన్ 1970వ దశకం నుంచే ప్రయత్నాలు ప్రారంభించింది. ఆ దేశంలో సంభవించిన రాజకీయ పెను మార్పులతో ఇది కొన్నిసార్లు ముందడుగు వేసింది. కొన్నిసార్లు నిలిచిపోయింది. ఆ దిశగా ప్రయత్నాలు మాత్రం ఆగలేదు. మరోవైపు, ఇరాన్ అణ్వాయుధ దేశం హోదాను సంతరించుకుంటే, సైనిక పాటవంలో ఇజ్రాయెల్ను ఢీకొట్టే స్థాయికి చేరుకుంటుందనేది అమెరికా ఆందోళన. తద్వారా పశ్చిమాసియాలో తన మాట చెల్లుబాటుకాకుండా పోయే ప్రమాదం ఉందని భావించి ఇరాన్ ప్రయత్నాలకు తొలినుంచీ అడ్డుపడుతూ వచ్చింది. ఫలితంగా ఆ దేశంపై ఆంక్షలు మోపయ్యాయి. ఒబామా హయాంలో పరిష్కారాన్ని కనుగొనటానికి జరిగిన ప్రయత్నాలు ఒక కొలిక్కి వచ్చాయి. 2015లో అణు ఒప్పందం కుదిరింది. ట్రంప్ హయాంలో ఆ ఒప్పందం నుండి అమెరికా వైదొలగటంతో సమస్య మళ్లీ మొదటికొచ్చింది. ఇరాన్ అగ్రశ్రేణి కమాండర్ ఖాసిం సులేమానీ హత్య వివాదాన్ని మరింత రాజేసింది.
ఒప్పందాన్ని పక్కనపెట్టి అణుధార్మిక మూలకాల శుద్ధీకరణను ఇరాన్ వేగవంతం చేసింది. అణ్వాయుధ తయారీ పరిజ్ఞానాన్ని దాదాపుగా సమకూర్చుకున్నదన్న అంచనాలున్నాయి. మరోవైపు అమెరికా ప్రాభవం కూడా మునుపటిలా లేదు. చైనా నుంచి ఆర్థికంగా, సైనికంగా ఎదురవుతున్న పోటీతో అమెరికా హోదా రానురానూ తగ్గుతున్నది. దీనిని గుర్తించి అగ్రరాజ్యం పట్టువిడుపులు చూపి ఇరాన్తో సమస్యను చర్చల ద్వారా పరిష్కరించుకుంటే మంచిదే. కాదూ కూడదంటూ.. ఇరాన్తో ఏ ఇతర దేశమూ వాణిజ్య సంబంధాలు పెట్టుకోవటానికి వీల్లేదంటూ హుకుం జారీ చేస్తే అది ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో చెప్పలేం. ఈ విషయంలో భారత్ తనదైన ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని అడుగులు వేయాలి. ఇరాన్తో మనకు వేల ఏండ్ల అనుబంధం ఉన్నది. వ్యూహాత్మకంగా కూడా ఆ దేశంతో సంబంధాలు మనకు అవసరం. కాబట్టి.. మోదీ సర్కార్ ఈ సమస్యపై రాజనీతిజ్ఞతతో వ్యవహరించాలి.