ఢిల్లీలో ఓ మహిళపై అత్యాచారం జరిగితే దేశం అట్టుడికి పోయింది. ప్రభుత్వం మారేంత వరకు ఉద్యమం నిద్ర పోలేదు. దేశంలో అవినీతికి వ్యతిరేకంగా అన్నా హజారే అనే ఒక సామాన్యుడుఉద్యమించినప్పుడు ఈ దేశానికి మరో మహాత్మాగాంధీ లభించాడని ఉప్పొంగిపోయింది. ఇప్పుడు ఆయనెందుకో మౌనంగా ఉన్నారు.
అంతర్జాతీయ పోటీల్లో బంగారు పతకాలు సాధించి ప్రధానితో టీ తాగుతూ ముచ్చట్లు చెప్పిన విజేతలు తమపై బ్రిజ్ భూషణ్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఆరోపిస్తున్నారు. ఆయనపై చర్య తీసుకోవాలని దేశ రాజధాని ఢిల్లీలో ఆందోళన చేస్తున్నారు. కానీ మీడియా కదలడంలేదు.. దేశ మూ కదలడం లేదు. అన్నా హజారే ఉద్యమ సమయంలో పూనకం వచ్చినట్టు ఊగిపోయిన మీడియా ఇప్పుడు మౌనంగా ఎందుకున్నది?
ఈ అంశంపై ఈ మధ్య ఒక ఆసక్తికరమైన వీడియో కనిపించింది. సివిల్ సర్వీసెస్కు సిద్ధమవుతున్న విద్యార్థులకు ఒక లెక్చరర్ ఈ అంశాన్ని ఆసక్తికరంగా వివరించారు. ‘వాళ్లు సామాన్య మ హిళలు కాదు, ఈ దేశ ప్రతిష్ఠను నిలిపిన క్రీడాకారులు. అంతర్జాతీయ పోటీల్లో పతకాలు సాధించినందుకు ప్రధాని స్వయంగా ఆ మహిళలతో ముచ్చటించారు. ఒక్కొక్కరి టేబుల్ వద్దకు వెళ్లి ప్రత్యేకంగా మాట్లాడారు. మీరు దేశానికి గర్వకారణమని ప్రశంసించారు. దీనికి మీడియాలో మంచి ప్రచారం దక్కింది.
అలాంటి మహిళలు ఢిల్లీలో ఆందోళన చేస్తున్నా దేశానికి పట్టడం లేదు. మీడియాలో ప్రాధాన్యం లభించడం లేదు. ఆ మ హిళలు చేసిన ఆరోపణల్లో నిజానిజాల గురించి నేను మాట్లాడటం లేదు. లైంగిక వేధింపులు జరిగాయని వారు ఆరోపించినప్పుడు విచారణ జరిపించాలి. కానీ వారు రోడ్డు మీద ఆందోళన చేస్తు న్నా ప్రభుత్వం మౌనంగా ఎందుకుంటోంది? అంతర్జాతీయ క్రీడల్లో బంగారు పతకాలు సాధిం చి ప్రధానితో ముచ్చటించిన వారి పరిస్థితే ఇలా ఉం టే, ఇక సామాన్య మహిళలు తమకు జరిగిన అన్యాయంపై ఫిర్యాదు చేయగలరా?’అని ప్రశ్నించింది.
కాబోయే సివిల్ సర్వీసెస్ అభ్యర్థులు సైతం ‘మరీ ఇంత అన్యాయమా?’ అని విస్తుపోయారు. ‘అందరూ ఇంత మౌనంగా ఉండటం ఎందుకో తెలుసా? అని తిరిగి ప్రశ్నించింది. ఎవరూ చెప్పలేకపోయారు. అప్పుడు ఆ లెక్చరరే దానికి సమాధానం చెప్తూ ‘నిజానికి ఆందోళనలు ప్రజలు చేయరు. ప్రతిపక్షాలు చేస్తాయి. ఆ విషయాన్ని బట్టి ప్రజల మద్దతు లభిస్తుంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఢిల్లీలో జరిగిన లైంగికదాడిపై ఢిల్ల్లీతో పాటు దేశవ్యాప్తంగా ఆందోళన జరిగింది. ఆ ఆందోళన బీజేపీ నాయకత్వంలో జరిగింది. ఇప్పుడు ఢిల్లీలో ఆ మహిళలు ఆందోళ న చేస్తున్నా రాజకీయపక్షాల నుంచి సరైన స్పంద న లేదు. కాంగ్రెస్కు కనీసం ప్రధాన ప్రతిపక్షం హోదా కూడా లేదు. కాంగ్రెస్ బలమైన ప్రధాన ప్రతిపక్షంగా ఉండి ఉంటే ఢిల్లీలో మహిళల ఉద్య మం ఇలా ఉండేది కాదు.’ అని ప్రధాన ప్రతిపక్షం బలహీనంగా ఉండటం దేశానికి ఎంత ప్రమాదమో ఆమె తన ఉపన్యాసంలో వివరించారు.
అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేస్తూ బీజేపీ పాలకులు నియంతృత్వంతో వ్యవహరిస్తున్నా దేశ వ్యాప్త ఉద్యమం చేసే స్థితిలో కాంగ్రెస్ లేదు. ఇక ప్రాంతీయ పార్టీల ప్రభావం ఆయా రాష్ర్టాలకే పరిమితం. కాంగ్రెస్ హయంలో దేశవ్యాప్తంగా అంత పెద్ద ఉద్యమం చేసిన అన్నా హజారే ఇప్పుడు మౌన దీక్షలోనే ఉన్నారు. ఢిల్లీలో దేశాన్ని కదిలించిన ఉద్యమం తర్వాత కేంద్రంలో ప్రభుత్వం మారింది.
ఆ తర్వాత సికింద్రాబాద్ ఆనంద్ టాకీస్ ఎదురుగా ఉన్న కాలేజీ గ్రౌండ్లో అన్నా హజారే సమావేశం అని తెలిసి వెళ్తే ఆశ్చర్యం వేసింది. మీడియాతో కలిపి 150 మంది లేరు. అన్నా ఉద్యమ సమయంలో ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ ఎన్టీఆర్ భవన్ నుంచి పంజాగుట్ట వరకు పెద్ద పెద్ద జాతీయ పతాకాలతో అవినీతికి వ్యతిరేకంగా ర్యా లీలు చేసింది. కేంద్రంలో ప్రభుత్వం మారింది. రాష్ట్రంలో మారింది. అన్నాను పట్టించుకున్నవారు లేరు. అప్పుడనిపించింది ఢిల్లీలో జరిగిన ఉద్యమం అన్నా హజారే ఉద్యమం కాదు. బీజేపీ ఉద్యమం అని. చివరికి మీడియా కూడా ఆయనను పట్టించుకోలేదు. అన్నా ఉద్యమం పుణ్యమా? అని కేంద్రం లో కాంగ్రెస్ అడ్రస్ లేకుండాపోయింది. బీజేపీ అధికారంలోకి వచ్చింది. పూనమ్ పాండే అనే ఓ మహిళ ఉద్యమ సమయంలో అన్నాకు మద్దతని చెప్పి నగ్నంగా ప్రదర్శన చేసింది. బోలెడు ప్రచా రం ఆ తర్వాత కొన్ని బీ గ్రేడ్ సినిమాల్లో ఆమెకు నటించే అవకాశం వచ్చింది. మోడల్గా కూడా కొన్ని అవకాశాలు వచ్చాయి. ఆమెకు అన్నా మీదా గానీ, ఉద్యమం మీద గానీ గౌరవం లేదు. కేవలం తన ప్రదర్శన ద్వారా ప్రచారం పొంది అవకాశాలు దక్కించుకోవాలనే ప్రయత్నం తప్ప మరేమీ లేదు.
అన్నా హజారే కోరిన ‘జన్ లోక్పాల్’ ఊసే లేదు. కేంద్రం అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్నది.
అప్రకటిత, అత్యవసర పరిస్థితి అమలు చేస్తున్నది. అయినా అన్నా హజారే పేరు ఎక్కడా వినిపించలేదు. ఆయన ఏం చేస్తున్నారా? అని గూగుల్లో సెర్చ్ చేస్తే దేశవ్యాప్తంగా మళ్లీ ఉద్యమం చేయనున్నట్టు రెండేండ్ల కిందట అన్నా హజారే చేసిన ప్రకటన కనిపించింది.
అన్నా హజారే ఇప్పుడు ముగిసిన అధ్యాయం. ఎందుకంటే ఇప్పుడు బీజేపీ ప్రతిపక్షంలో లేదు, అధికార పక్షంలో ఉన్నది. కాంగ్రెస్కేమో ఉద్యమించే పరిస్థితి లేదు. అన్నా హజారేను నమ్మి ఆ రోజుల్లో ఉద్యమాల్లో పాల్గొన్న ప్రజాసంఘాలు సైతం మౌనంగానే ఉన్నాయి.
బుద్దా మురళి
(వ్యాసకర్త: సీనియర్ జర్నలిస్ట్)