Ideas rule the world- ప్రపంచాన్ని పాలించేది మనుషులు కాదు, మనిషుల ఆలోచనలే! దీని విస్తృత అన్వయాన్నిఅవలోకిస్తే.. రాష్ట్రం, దేశం, యావత్ ప్రపంచాన్ని మనుషుల్లో జనించే ఆలోచనలే పాలిస్తాయి. ఆలోచనలు జనించేవి మనిషిలోనే అయినప్పటికీ, ముఖ్యంగా అందరిలో నవ నవోన్మేష ఆలోచనలు జనించటం అరుదు. విశ్వవ్యాప్తంగా కొద్దిమందిలోనే సాకారమయ్యే ఆలోచనలను మనం గమనిస్తాం.
రాజ్యపాలన విషయంలోనే కాదు, ఏ రంగంలోనైనా మనిషి అంతరంగ ఆవిష్కరణలతోనే ఆయా రంగాల అభివృద్ధి ఆధారపడి ఉంటుంది. అత్యున్నత స్థాయిలోని అవార్డులు, రివార్డులు ఆలోచనల ఆవిర్భావంలోంచే పురుడు పోసుకుంటాయి. శాస్త్రీయ, సామాజిక, సాహితీ, కళారంగం ఇలా.. 64 కళల్లోని ఆవిష్కరణలన్నీ మనిషి ఆలోచనల్లోంచి సిద్ధించిన అత్యద్భుతాలే! ఒక తాజ్మహల్, చార్మినార్, గోమఠేశ్వర్ విశ్వవ్యాప్త శిల్పకళాకృతులే కాదు, మేధోపరమైన అద్భుతాలన్నీ మానవ మేధోమథనంలో జనించి ఫలించినవే!
స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏండ్లు పూర్తయ్యాయి. ఈ సుదీర్ఘకాలంలో ఎన్నో ఆవిష్కరణలు జరిగాయి. ఎన్నో అద్భుతాలు, ఎన్నో అన్వేషణలు మేధావుల, సంఘసంస్కర్తల, పరిపాలనాదక్షుల దీక్షల్లో సాకారమయ్యాయి. అయినప్పటికీ దేశ ప్రగతి అంతంతమాత్రమే. దీర్ఘకాలిక సమస్యల్లో దేశం ఇంకా కొట్టుమిట్టాడుతూనే ఉన్నది. శాశ్వత పరిష్కారానికి నోచని ఎన్నో సమస్యలు ఇంకా సంక్లిష్టంగా మారి ప్రస్తుత నాయకత్వ పరిధిలో అపరిష్కృతంగా ఉన్నాయి. ఈ సమస్యలు దేశాన్ని వేధిస్తూనే ఉన్నాయి. దేశంలోనే అత్యంత దారుణమైన దోపిడీకి గురై, దశాబ్దాలుగా విలపిస్తున్న తెలంగాణ ఒడిలో విరబూసిన ఒకానొక కాంతిపుంజం కె.చంద్రశేఖరరావు. ఆలోచనల్లో వేగం, ప్రణాళికా రచనల్లో సహేతుకత, లక్ష్య సాధనలో క్రియాశీలత లక్ష్యశుద్ధిలోని అంకితత్వం ఆయన సొంతం. ఉద్యమ దీక్షతో సాకారమైన తెలంగాణను ప్రగతి పథంలో తీసుకెళ్తూ దేశంలోనే కాదు, ప్రపంచంలోనే మన్ననలు పొందేలా చేశారు కేసీఆర్. ఎవరి ఊహ కూ అందని పథకాలకు రూపకల్పన చేశారు.
కేంద్రంలోని బీజేపీ నాయకుల అధికార మదం కండ్లున్న కబోధులుగా, మూర్ఖులుగా మార్చింది. ప్రజలను మభ్యపెట్టడానికి మసిపూసి మారేడు కాయ చేస్తున్నారు. ఏ శాస్త్రీయ వాదనలకు నిలువని కుతర్కంతో జనాలను తప్పుదోవ పట్టిస్తూ, ఉన్మా దం వైపు ఉసిగొల్పుతున్నారు. ప్రకృతి సంపద, సమస్త సహజ వనరులు ‘అధికారం’ గుప్పిట్లో బందీ అయినాయి. మెజారిటీ ప్రజలకు కనీస జీవన సౌకర్యాలు కరువయ్యాయి. ఇది ప్రజాస్వామ్య వ్యవస్థకు ఒక మాయని మచ్చ. దేశ పరిస్థితి ఆందోళన కలిగించే స్థాయికి చేరుకున్నది. మరోవైపు, ఎనిమిదిన్నరేండ్ల స్వల్ప వ్యవధిలోనే తెలంగాణ రాష్ట్రం ఊహించని అభివృద్ధిని సొంతం చేసుకున్నది.
నవీన ప్రగతి పథకాల్లోంచి ధాన్యపు రాసులు, ధనరాసులు పుట్టుకొస్తున్నాయి. ప్రపం చం ఒక కుగ్రామంగా మారిన ఈ తరుణంలో మరి ఈ దేశానికి అడ్డొచ్చిందెవరు? పరుగెత్తాల్సిన ప్రగతి దారులు ఎందుకు మందగించాయి? కొరవడిన చిత్తశుద్ధి ఒక మూల కారణమైతే… హృదయానుగతమైన మంచి ఆలోచనలు మృగ్యమై, యాంత్రిక వ్యవస్థల కొనసాగింపు మరో కారణం.
ఇలాంటి అప్రజాస్వామిక, అనాగరిక, అశాస్త్రీయ, స్వలాభాపేక్ష ఆవహించిన మందమతుల మానసిక వికారాలను సంస్కరించే దిశలో ఒక సిద్ధాంత భూమిక రూపుదిద్దుకున్నది. దేశ కాలమాన పరిస్థితులను అవలోకించి ఒకానొక అత్యుత్తమ పరిణామానికి నాంది పలికే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనావిధానం దేశానికి దిశా నిర్దేశం చేసి మార్గదర్శకత్వం వహించగలదని ఆశిద్దాం.
కె లక్ష్మణ్ గౌడ్: 97049 30509
(వ్యాసకర్త: విశ్రాంత ఆచార్యులు)