2023 మార్చి 5న సంఘ్ అనుబంధ సంస్థ అయిన సమవర్ధిని న్యాస్ ‘గర్భసంస్కార్’ పేరుతో ఢిల్లీ జవహర్లాల్ నెహ్రూ వర్సిటీలో కార్యశాల నిర్వహించింది. ఈ కార్యక్రమంలో 12 రాష్ర్టాల నుంచి వచ్చిన స్త్రీ, శిశు, ఆయుర్వేద వైద్యులు, యోగా గురువులు పాల్గొన్నారు. ‘కడుపులోని పిండాలకు భారతీయ (హిందువాద) సాంస్కృతిక విలువలు నేర్పాలి. దీంతో దేశభక్తులైన, స్త్రీలను గౌరవించే పిల్లలు, రాముని వంటి కొడుకులు పుడతారు. గీత, సంస్కృతం చదివే గర్భశుద్ధి పద్ధతితో బిడ్డ డీఎన్ఏ మారుతుంది’ అని న్యాస్ నేతలు చెప్పారు. పౌరాణిక హిందూ పాలకుల గుణగణాలు, నరేంద్ర మోదీ, డోనాల్డ్ ట్రంప్ల నాయకత్వ లక్షణాలు గల భావి నాయకులను తయారుచేయడం ‘గర్భసంస్కార్’ లక్ష్యమని న్యాస్ జాతీయ నిర్వహణ కార్యదర్శి మాధురి మరాఠే అన్నారు.
‘గర్భ సంస్కార్’ అన్న సంస్కృత పదాలకు గర్భసంచిని శుద్ధిచేయడం, పిండం మెదడును చైతన్యపరచడమని అర్థం. సాంస్కృతిక విలువల పేరుతో మతాధిపత్య భావజాలాన్ని పుట్టబోయే పిల్లల, తల్లుల మెదళ్లలో చొప్పించి, వారిని హిందువాదంతో చైతన్యపరిచే ప్రక్రియే గర్భ సంస్కార్. గర్భ సంస్కార్, చైతన్యవంతమైన సంస్కృతి, నాగరికతలతో శుద్ధ మతతాత్విక పవిత్ర శిశువులను పుట్టిస్తుందట. వినాయక్ దామోదర్ సావర్కర్, వీర శివాజీ ఈ గర్భసంస్కార్తోనే పుట్టారట.
ఆయుర్వేదం ప్రకారం గర్భసంస్కార్ పిండాల వ్యక్తిత్వం, గుణగణాలను పెంచుతుంది. సాత్వికాహారం, యోగా, ధ్యానం, మంత్రోచ్ఛారణ, రాగాలు, శ్లోకాలు, కథలు వినడం ఈ కార్యక్రమంలో ప్రధానం. సామవేద మంత్రాలు శ్రేయస్కరమట. ఇంపైన సంగీతంతో ఒత్తిళ్లు తగ్గి తల్లిలో ఆరోగ్యకర హార్మోన్లు ఊరుతాయి. పిండంపై సత్ప్రభావం చూపుతాయి. కానీ వైదికమంత్రాలకు విజ్ఞానవంతులైన పిల్లలకు లంకె పెట్టడం విడ్డూరం. పూర్వం ఆయుర్వేద వైద్యులు ప్రజలందరికీ చికిత్స చేసేవారు. వైద్యం చేస్తూ వారు అంటరానివారిని కూడా తాకి అదే చేతులతో ఇతరులనూ తాకుతారని, సమాజాన్ని మైలపరుస్తారని నాటి ఆధిపత్య వర్ణాల వారు ఆయుర్వేదాన్ని అడ్డుకున్నారు. అది అటకెక్కింది. లేకుంటే 3 వేల ఏండ్ల కిందటే చరకుడు, శుశ్రుతుడు అభివృద్ధి చేసిన ఆయుర్వేదం నేడు ప్రపంచంలోనే మెరుగైన వైద్య విధానంగా ఎదిగేది. తాము నాశనం చేసిన ఆయుర్వేదంలో భాగమైన గర్భసంస్కార్ను ఇపుడు సన్మార్గుల జన్మకు వాడతారట!
గర్భశుద్ధి కోసం 1935 సెప్టెంబర్ 15న హిట్లర్ చేసిన నూరెంబర్గ్ చట్టాల ప్రకారం.. జర్మన్ రక్తాన్ని, జాతి గౌరవాన్ని కాపాడటానికి జర్మన్, యూదుల మధ్య పెళ్లి, వివాహేతర సంబంధాలను నిషేధించారు. 45 ఏండ్ల లోపు జర్మన్ స్త్రీలు యూదుల వద్ద ఉద్యోగం చేయరాదు. అశుద్ధ జాతులుగా నిర్ధారించి, జన్యులోపాల సాకుతో, 4 లక్షల మందికి గర్భనిరోధక టీకాలు వేశారు. వేలాదిమందికి బలవంతంగా గర్భస్రావం చేయించారు. పిల్లలను యాక్షన్ టీ 4 కింద చంపారు. యూదు స్త్రీలను, పిల్లలను, వృద్ధులను సామూహిక హత్యచేశారు. సంఘ్ ఆరోగ్య విభాగ అధినేత అశోక్కుమార్ జర్మనీకి వెళ్లి శుద్ధ ఆర్యజాతి సిద్ధాంతాన్ని అధ్యయనం చేశారు. భారత్లో అమలుకు పథకాలు రచించారు.
ముస్లింల, క్రైస్తవుల పుణ్యభూమి భారత్ కాదని, కమ్యూనిస్టుల సిద్ధాంతం విదేశాలదని ఎగతాళి చేసే సంఘ్ ఉత్తమజాతి పిల్లలను పుట్టించటానికి జర్మనీ సూత్రాలను అమలుచేస్తున్నది. సంఘ్ అనుబంధ ఆరోగ్య భారతి, ఉత్తమ సంతతి కోసం బీజేపీ పాలిత గుజరాత్, మధ్యప్రదేశ్లలో 16 ఏండ్ల కిందటే గర్భ విజ్ఞాన సంస్కార్ పథకాన్ని ప్రారంభించింది. ఉత్తమ సంతతి ద్వారా బలమైన భారత్ మా లక్ష్యం. 450 సంస్కార శిశువులను పుట్టించాం. 2020 నాటికి ప్రతి రాష్ట్రంలో గర్భవిజ్ఞాన్ అనుసంధాన కేంద్రాలను స్థాపిస్తామని ఈ పథక జాతీయ అనుసంధానకర్త డాక్టర్ కరిష్మా మోహన్దాస్ నార్వాణి 1917, మేలోనే చెప్పారు. జర్మనీలో శుద్ధ ఆర్యజాతిని నిర్మించిన హిట్లర్ ఈ విషయంలో మాకు ఆదర్శమని సంఘ్ నాయకులన్నారు. తాము ఉత్తమ హిందూ జాతి అని నిర్ణయించినవారిని తప్ప మిగిలినవారి పట్ల ‘హిట్లర్ చర్యలు’ తీసుకుంటారేమో!
‘గర్భ సంస్కార్’లో పౌరాణిక కథలను వినిపిస్తారట. హిరణ్యకశిపుని భార్య లీలావతి కడుపులోని ప్రహ్లాదునికి నారదుడు విష్ణుకీర్తనలు వినిపించాడు. ప్రహ్లాదుడు విష్ణుభక్తుడయ్యాడు. నారదుడు నాస్తికులందరికీ కీర్తనలు ఎందుకు చెప్పలేదో! ఎనిమిది శారీరక వంకరలతో పుట్టిన అష్టావక్రుని కథనూ ఆలపిస్తారట. ఈ కథ వింటే వంకర లేని పిల్లలెలా పుడతారు? ప్రథమ దేవుళ్లయినా పసిపిల్లలుగా మారితే దృశ్యజ్ఞానం ఉండదని సతీ అనసూయ కథలో కవి సరిగానే రాశారు. ఎన్నో పుక్కిటి పురాణాలను నమ్మిన సంఘ్ దీన్ని ఎందుకు నమ్మదు?
‘గర్భ సంస్కార్’ కార్యక్రమంలో గర్భం ధరించినప్పటి నుంచి బిడ్డ పుట్టిన తర్వాత రెండేండ్ల వరకు తల్లీ పిల్లలకు ‘చైతన్య’ శిక్షణ ఇస్తారు. 30 వారాల పిండానికి ఇంద్రియాలు, మెదడు అభివృద్ధి చెందుతాయి. గర్భస్థపిండానికి వినికిడి శక్తే ఉండదు. పుట్టిన మూడు నెలలకు అమ్మ వాసనను, సైగలను గుర్తిస్తుంది. మూడేళ్లకు గాని అతి ప్రాథమిక స్థాయి విషయాలు అర్థం కావు. ఆరేండ్లకు ఒక మోస్తరు పాఠాలు అర్థమవుతాయి. అడవిలో పెరిగిన పిల్లలకు మాటే రాదు. పిల్లకు, తల్లికి ‘గర్భ సంస్కార్’లో చదివే సంస్కృత శ్లోకాలు అర్థం కావు. అయితే మతాచారాల లయబద్ధ శబ్దాలు తల్లీపిల్లను సవ్వడి సమ్మతులుగా మారుస్తాయి.
ఈ ప్రక్రియలో జరిగే హిందూవాద తంతులతో తల్లి, రెండేండ్ల బిడ్డ మమేకమవుతారు. ఈ మిషతో తొలిగురువు, సమాజ నిర్మాత అయిన తల్లికి సంఘ్, కాషాయ కషాయం తాపుతుంది. జన్యు సాంకేతికతలతో మాత్రమే శాస్త్రవేత్తలు జీవి డీఎన్ఏను మార్చగలరు. మాటలతో మనిషి డీఎన్ఏ మారదు. ‘గర్భ సంస్కార్’తో భావి భారతం కాషాయమత్తులో మునుగుతుంది. ‘ఒక దేశం-ఒక మతం’, శుద్ధ హైందవ జాతి
సాఫల్యమవుతాయి.
కార్యశాలకు హాజరైన వైద్యులెవరూ విజ్ఞానశాస్త్ర వాస్తవాలను మాట్లాడలేదు. ఏడాదికి వెయ్యి మంది గర్భవతులకు ‘గర్భ సంస్కార్’ శిక్షణ ఇస్తామని ప్రమాణం చేశారు. యజమానులు ‘ఔనంటే ఔను, కాదంటే కాదు’ అనే సౌజన్య పక్షపాత బాధితులు వీరు. ‘గర్భ సం స్కార్’ కొత్త వ్యాపారాలకు తెరలేపింది. ప్రయోగశాలలు, శిక్షణాలయాలు, సాహిత్య సామగ్రి అమ్మకాలు విపరీతంగా పెరుగుతాయి.
– సంగిరెడ్డి హనుమంత రెడ్డి
(వ్యాసకర్త: ఆల్ ఇండియా ప్రోగ్రెసివ్ ఫోరం జాతీయ కార్యదర్శి)
94902 04545