‘ఆడలేక మద్దెల ఓడు’ అన్నటున్నది బీజేపీ వ్యవహారం. ఎన్నికల బరిలో బీజేపీ పోటీ ఇవ్వడం లేదని, ఆ పార్టీ రెండు, మూడు సీట్ల కంటే ఎక్కువ గెలిచే పరిస్థితి లేదని దాదాపు అన్ని సర్వేలు తేల్చిచెప్పాయి. ఆ విషయం మీరు ప్రత్యేకంగా చెప్పాలా? మాకు తెలియదా? అని రాష్ట్ర కమల సారథులు నెత్తిన తుండుగుడ్డ వేసుకొని మొక్కుబడి ప్రచారంతో షో చేస్తున్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు పోటాపోటీగా ప్రచార సభలు, సమావేశాలు నిర్వహిస్తుంటే మీరేంటి హైదరాబాద్ విడిచివెళ్లడం లేదని పార్టీ అధ్యక్షుడు కిషన్రెడ్డిని మీడియా అడిగితే దీపావళి అమావాస్య వరకు మంచి ముహూర్తం లేదు. ఆ తర్వాత ప్రచారాన్ని ఉరకలెత్తిస్తామన్నారు. ప్రచారం ప్రారంభించడానికి కూడా మీనమేషాలు లెక్కబెడుతున్న బీజేపీని చూస్తే సర్వే నివేదికలు కరక్టే అనిపిస్తున్నాయి.
ఎన్నికలకు ముందు బీజేపీలో చేరి హడావుడి చేసిన మాజీ సీఎం, బీజేపీ నేత కిరణ్కుమార్రెడ్డి ఊసే ప్రస్తుతం ఎక్కడా వినిపించడం లేదు. రాయలసీమ నేతలు ప్రచారానికి వస్తే సీన్ రివర్స్ అవుతుందని రాజన్న బిడ్డ షర్మిలను కాంగ్రెస్ పక్కన పెట్టినట్టు.. కిరణ్కుమార్ రెడ్డిని బీజేపీ పక్కన పెట్టిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ‘ఆప్ బీజేపీమే కబ్ ఆయా’ అని కేంద్ర మంత్రులు, జాతీయ నాయకులు ఆశ్చర్యంగా ప్రశ్నిస్తుంటే ఇబ్బందిగా ఉండి తానే ఎన్నికలకు దూరంగా ఉన్నారని ఆయన సన్నిహితుల కథనం.
కాంగ్రెస్ పార్టీ వారానికో డిక్లరేషన్ విడుదల చేస్తూ వస్తోంది. మహిళా డిక్లరేషన్, బీసీ డిక్లరేషన్, మైనారిటీ డిక్లరేషన్, రైతు డిక్లరేషన్ అంటూ వివిధ వర్గాల ఓటర్లకు గాలం వేస్తున్నది. కానీ, వాటిని ప్రజలు మాత్రం నమ్మలేకపోతున్నారు. కాంగ్రెస్ పార్టీకి మార్గ నిర్దేశనం చేసే ఉదయపూర్ డిక్లరేషన్కే దిక్కులేదు. అందులో చేసిన డిక్లరేషన్కు విరుద్ధంగా కోమటిరెడ్డి, ఉత్తమ్కుమార్ రెడ్డి, జానారెడ్డి కుటుంబసభ్యులకు టికెట్లు ఇచ్చింది. ఓబీసీలకు పెద్దపీట వేస్తామని టికెట్ల కేటాయింపులో మొండిచేయి చూపింది. ఇక కర్ణాటక ఎన్నికల్లో హామీ ఇచ్చిన గ్యారంటీలకు మంగళం పాడింది. ఇన్ని కండ్లారా చూశాక ఇప్పుడు విడుదల చేస్తున్న డిక్లరేషన్లను ఎలా నమ్మాలని ప్రజల నుంచి సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
బీజేపీ అధ్యక్షునిగా కిషన్రెడ్డి ఏ ముహుర్తంలో బాధ్యతలు స్వీకరించారో కానీ, ఆ పార్టీలో చేరికల కమిటీకి పనిలేకుండా పోయింది. దాని స్థానంలో ‘పార్టీకి రాంరాం కమిటీ’ మాత్రం బాగా సక్సెస్ అయిందని ఆ పార్టీ నేతలే జోకులేస్తున్నారు. ఉమ్మడి ఏపీ రాష్ర్టానికి చివరి సీఎం కిరణ్కుమార్రెడ్డి ఎట్లనో, తెలంగాణ బీజేపీకి చివరి అధ్యక్షుడు కిషన్రెడ్డే అయ్యేలా ఉందని మరికొందరు సెటైర్లు విసురుతున్నారు. ఒకరిద్దరు నాయకులైతే కిషన్రెడ్డి సార్ వచ్చారా అని అడగడానికి బదులు కిరణ్ సార్ వచ్చారా? అని కోడ్ వర్డ్లో అడుగుతున్నారట. ఒకవేళ ఈ మాట కిషన్రెడ్డి చెవిన పడినా మేము వాకబ్ చేసింది మిమ్మల్ని కాదు, కేకేఆర్ (నిన్న సాయంత్రం దాకా బీజేపీలోనే) గురించని తప్పించుకోవచ్చన్నది వీరి ఆలోచన అయి ఉండవచ్చు. కిషన్ రెడ్డో… కిరణ్కుమార్ రెడ్డో స్పష్టంగా అడగండి. అంతేకానీ, కోడ్ వర్డ్స్తో అడిగి కన్ఫ్యూజ్ చేయొద్దని ఆఫీస్ స్టాఫ్ కోరినట్టు వినికిడి.