భూతాపం ప్రమాదం ముంచుకొస్తున్నది.. పారాహుషార్ అంటూ మరో పరిశోధన ప్రపంచ దేశాలకు హెచ్చరిక జారీ చేసింది. భారత్లో తమిళనాడు రాజధాని చెన్నై, పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలకు తీవ్ర ప్రమాదం పొంచి ఉందని తేల్చి చెప్పింది. గత ఏడాది ఏప్రిల్లో విడుదలైన ఒక అధ్యయన నివేదిక కూడా.. 2050 నాటికి ముంబై, మంగళూరు, చెన్నై, విశాఖపట్నం, తిరువనంతపురం నగరాలు పాక్షికంగా మునిగిపోతాయని వెల్లడించింది.
వాతావరణ మార్పులపై ఏర్పాటైన అంతర్ ప్రభుత్వ సంస్థ (ఐపీసీసీ) ఇదే విషయాన్ని సాధికారికంగా ప్రకటించింది. మరో పదేండ్లలో భారత దేశ ఆర్థిక రాజధాని ముంబై దాదాపు 65 శాతం మునిగిపోనున్నదని, గోవా, కోల్కతా, చెన్నైలతోపాటు దేశంలోని పలు తీరప్రాంతాలకు ముంపు ముప్పు ఉన్నదని తెలిపింది. భూతాపం తగ్గింపునకు తక్షణ కార్యాచరణ అవసరమని ఇవన్నీ హెచ్చరిస్తున్నాయి.
గత ఏడాది డిసెంబర్లో కేంద్రమంత్రి జితేంద్రసింగ్ ఒక విషయం చెప్పారు. 1901-1971 మధ్య ఏటా 1.3 మిల్లీమీటర్ల చొప్పున పెరిగిన సముద్రమట్టం.. 2006-18 మధ్య ఏటా 3.7 మిల్లీమీటర్ల చొప్పున పెరిగిందని వెల్లడించారు. సముద్రమట్టం పెరగటం అంటే ముంపు ప్రమాదం పెరగటమే. గ్లోబల్ వార్మింగ్ ప్రభావం నిత్య జీవితంలోనూ కనిపిస్తున్నది. రుతువులు మారుతున్నాయి. సాగుపై ప్రభావం పడుతున్నది. ఓవైపు వడగాలులు వీస్తుంటే మరోవైపు వరదలు ముంచేస్తున్నాయి. కానీ, కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఉపశమన చర్యలను మాత్రం చేపట్టటం లేదు. పైగా తన అనుంగు కార్పొరేట్ మిత్రులకు అనుకూలంగా ఉండేలా పర్యావరణ నిబంధనలను, చట్టాలను మారుస్తున్నది. ఒకరి కోసం దేశ భవిష్య త్తును తాకట్టు పెట్టటానికి వెనుకాడని సర్కార్.. పర్యావరణ అంశాన్ని పట్టించుకుంటుందని ఆశించటం అత్యాశే అవుతుంది. ఈ విధానాల వల్లనే ‘పర్యావరణ పనితీరు సూచీ-2022’ జాబితాలో 180 దేశా లలో భారత్ చివరి స్థానంలో నిలిచింది.
కేంద్రం వైఖరి ఇలా ఉన్నప్పటికీ.. ప్రకృతి సమతుల్యతను కాపా డటానికి, భావి తరాలకు పుడమి తల్లిని భద్రంగా అప్పగించటా నికి తెలంగాణ ప్రభుత్వం శాయశక్తులా కృషి చేస్తున్నది. రాష్ట్ర ఆవిర్భా వం నుంచే పర్యావరణ పరిరక్షణకు ముఖ్యమంత్రి కేసీఆర్ అమిత ప్రాధాన్యం ఇచ్చారు. ప్రపంచంలోనే మూడో అతిపెద్ద మానవ ప్రయ త్నంగా ఐక్యరాజ్య సమితితో ప్రశంసలు అందుకున్న హరితహారం కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేస్తున్నారు. ఇప్పటి వరకూ తెలంగాణలో దాదాపు 250 కోట్ల మొక్కలు నాటారు. ఫలితంగా 2014లో రాష్ట్రంలో పచ్చదనం పరిధి 24 శాతం ఉంటే.. ఇప్పుడు 31 శాతానికి పెరిగింది. దేశంలో ఏ రాష్ట్రం ఇంత వృద్ధిని సాధించ లేదు. హరితహా రాన్ని పలు రాష్ర్టాలు స్ఫూర్తిగా తీసుకొని మొక్కలను పెంచుతున్నా యి. అంతర్జాతీయంగా ప్రఖ్యాతి గాంచిన ‘వరల్డ్ గ్రీన్ సిటీ’ అవార్డుకు హైదరాబాద్ ఎంపికైంది. తెలంగాణ నుంచి కేంద్రం పర్యావరణ పాఠాలు నేర్చుకోవాలి.