మోదీ ప్రభుత్వం వివిధ రాష్ర్టాల్లోని విపక్ష పార్టీల ప్రభుత్వాలను కూల్చేందుకు ఏ చిన్న కారణాన్నీ వదిలి పెట్టడం లేదు. ఆ కోవలో ఇప్పుడు జార్ఖండ్ సీఎం హేమంత్ సోరేన్ వంతు వచ్చింది. ఈ సారి కేంద్ర ఎన్నికల సంఘాన్ని ముందు పెట్టి ఆటాడుతున్నది.ఈ నేపథ్యంలోనే అవినీతి ఆరోపణల ఆసరాతో సోరేన్పై అనర్హత వేటు వేయటమే మంచిదని సీఈసీ గవర్నర్కు సూచించినట్లు తెలుస్తున్నది. అయితే గతంలో సిక్కిం సీఎం ప్రేమ్ సింగ్ తమంగ్ అవినీతి విషయంలో సీఈసీ ఇదే విధంగా ఎందుకు వ్యవహరించలేదు?
జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరేన్ గనుల శాఖ మంత్రిగా కూడా వ్యవహరిస్తున్నారు. ఆయన సొంతానికి ఒక గని లీజుకు తీసుకున్నారని జార్ఘండ్ బీజేపీ శాఖ ఇటీవల ఆ రాష్ట్ర గవర్నర్కు ఫిర్యా దు చేసింది. ప్రభుత్వ పదవిలో ఉంటూ ఒక సీఎం ఇలా చేయడం అవినీతేననీ, కాబట్టి ప్రజా ప్రాతినిధ్య చట్టం-1951లోని 9ఎ అధికరణం ప్రకారం… సోరేన్ శాసన సభ్వత్వాన్ని రద్దు చేయాలని బీజేపీ కోరింది. బీజేపీ ఫిర్యాదును ఆ రాష్ట్ర గవర్నర్ రమేశ్బైస్ కేంద్ర ఎన్నికల సంఘానికి పంపారు. దాంతో జార్ఘండ్ సీఎంకు సీఈసీ నోటీసు పంపింది. ఈ నేపథ్యంలో సోరేన్పై అనర్హత వేటు గురించి గవర్నర్ ఢిల్లీ పెద్దలతో చర్చించారని, ఏ క్షణమైనా గవర్నర్ తమకు మింగుడు పడని నిర్ణయం తీసుకుంటారనే పుకార్లు వ్యాపించాయి. ఇదే జరిగితే ఈ విషయమై సుప్రీం కోర్టును ఆశ్రయించాలని జేఎంఎం భావిస్తున్నది. మరోవైపు ‘ఈడీ’తో దాడులు చేయిస్తూ కేంద్రం తమ నేతలను, ప్రభుత్వాన్ని భయపెడుతోందని జేఎంఎం నేతలు ఆగ్రహిస్తున్నారు.
మోదీ హయాంలో కీలకమైన ప్రభుత్వ వ్యవస్థలన్నీ కేంద్ర ప్రభుత్వానికి అనుకూలం గా వ్యవహరిస్తున్నాయని ఆరోపణలున్న పరిస్థితుల్లో సీఈసీ నిర్ణయం చర్చనీయాంశం అవుతున్నది. కేంద్ర ప్రభుత్వ తీరుపై అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. 1) బీజేపీ పాలిత రాష్ర్టాల్లోని ముఖ్యమంత్రుల అనర్హతలకు సంబంధించి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు, కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా సీఈసీ ఏదైనా నిర్ణయం తీసుకుందా? 2) ప్రజా ప్రాతినిధ్య చట్టం-1951లోని సెక్షన్ 11 ప్రకా రం తన విచక్షణాధికారాలను ఉపయోగించడంలో సీఈసీకి ఉన్న నిబంధనలేమిటి? 3) ప్రజా ప్రతినిధులపై వచ్చిన అవినీతి ఆరోపణలకు సంబంధించి న్యాయ సలహాలు అవసరమైనప్పుడు సుప్రీంకోర్టు జోక్యం చేసుకుం దా? లాంటివి అనేకం ఉన్నాయి.
గతంలో యూపీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు హత్యా నేరాలపై జైలు శిక్ష అనుభవించినా, ఎన్నికల్లో పోటీ చేసిన విషయాన్ని సీఈసీ ఈ సందర్భంగా ఉదహరించింది. అంటే ప్రజా ప్రతినిధుల అవినీతి హేయమైన నేరం కాదని సీఈసీ భావిస్తున్నట్లున్నది!
అయితే ఇప్పుడు హేమంత్ సోరేన్ శాసన సభ్వత్వాన్ని రద్దు చేయడానికి సీఈసీ అంగీకరిస్తే, తమంగ్ విషయంలో మాత్రం ఎందుకు విరుద్ధంగా ప్రవర్తించినట్టు? ఈ ప్రశ్నకు వారే సమాధానం చెప్పాలి. దేశమంతా మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను గమనిస్తున్నార్నది మర్చిపోరాదు.
హేమంత్ సోరెన్ విషయంలో ఒక నీతి, ప్రేమ్సింగ్ తమంగ్కు మరో నీతి అన్నట్లుగా బీజేపీ వ్యవహరిస్తున్నది. సోరెన్ పై కేవలం ఆరోపణల కారణంగానే అనర్హత వేటు వేయటానికి తెగిస్తున్న మోదీ ప్రభుత్వం, అవినీతి కేసులో జైలు శిక్ష అనుభవించిన తమంగ్ను సిక్కిం సీఎం చేయటం ద్వంద్వ నీతికి పరాకాష్ట కాదా!
సోరేన్ అనర్హత విషయాన్ని చర్చించే ముందు, సిక్కిం సీఎం ప్రేమ్ సింగ్ తమంగ్ విషయంలో సీఈసీ వ్యవహరించిన తీరును పరిశీలించాలి. అవినీతి కేసులో జైలు శిక్ష అనుభవించిన ఆయన అక్టోబర్ 2019న జరిగే ఉప ఎన్నికల వరకు సీఎం పదవిలో కొనసాగవచ్చునని సీఈసీ అప్పట్లో తెలిపింది. కేంద్ర ప్రభుత్వంతో సన్నిహితంగా వ్యవహరిస్తారని పేరున్న సునీల్ ఆరోరా చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా ఉన్నప్పుడు ఈ నిర్ణయం వెలువడిందని మనం గుర్తించాలి. 2019లో బీజేపీతో కలిసి సిక్కిం క్రాంతి కారీ మోర్చా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసింది. కానీ ఆ పార్టీ అధినేత తమంగ్ మాత్రం ఎన్నికల్లో పోటీ చేయలేదు.
ప్రేమ్ సింగ్ తమంగ్ అవినీతి ఆరోపణల కేసులో 2017 ఆగస్టు నుంచి ఏడాది పాటు జైలు శిక్ష అనుభవించారు. అయితే తమ అనుమతి తీసుకున్నాకే ఆయన ఎన్నికల్లో నామినేషన్ పత్రాలు సమర్పించాడని సీఈసీ ఆయనను వెనుకేసుకొచ్చింది. తమంగ్కు అనుకూలంగా సీఈసీ మరొక వాదన కూడా చేసింది. 2019లో ఆయన సారథ్యంలోని పార్టీకి ప్రజ లు పట్టం కట్టారని, కాబట్టి ఆయనకు ప్రజామోదం ఉందనుకోవాలని చెప్పుకొచ్చింది. ఈ వాదనలన్నింటికీ బలం.. అనినీతి నిరోధక చట్టం-1988కి 2018లో మోదీ ప్రభుత్వం తెచ్చిన సవరణలు. 2003లో వాజపేయి ప్రభుత్వం తెచ్చిన సవరణను పూర్తిగా తొలగిం చి మోదీ సర్కారు ఈ సవరణ తెచ్చింది. దీని ప్రకారం అవినీతి నిరోధక చట్టం కింద కేసులు ఎదుర్కొంటున్న వ్యక్తులు, జైలు శిక్ష అనుభవించిన వారు ఎన్నికల్లో పోటీ చేయవచ్చు. అవినీతి కేసుల్లో జైలుశిక్ష అనుభవించిన వారు ఆ తర్వాత ఆరేండ్ల పాటు ఎన్నికల్లో పోటీకి అనర్హులన్న నిబంధనను మోదీ ప్రభుత్వం తొలగించడంతో ప్రేమ్ సింగ్ తమంగ్ సీఎం కావడం సులువైంది. పైగా తమంగ్ పార్టీని ప్రభుత్వం ఏర్పాటు చేయమని గవర్నర్ ఆహ్వానించారని సీఈసీ ఆయనకు మద్దుతు పలికింది. గతంలో ఎమ్మెల్యేలపై వచ్చి న అవినీతి ఆరోపణల విషయంలో సీఈసీ కఠినంగా వ్యవహరించిందని మాజీ చీఫ్ ఎలక్షన్ కమీషనర్ టి.కె.కృష్ణమూర్తి తెలుపటం గమనార్హం.
‘తన అనర్హతను తొలగించమని తమంగ్ మమ్నల్ని సంప్రదించలేదు. అదే సమయం లో 2019లో జరిగిన సిక్కిం శాసనసభ ఎన్నికల్లో ఆయన పోటీ చేయలేదు. తన పార్టీ శాసన సభలో స్పష్టమైన మెజార్టీ సాధించటంతో, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయమని తనను గవర్నర్ ఆహ్వానించినప్పుడు మాత్రమే ఆయన మమ్మల్ని సంప్రదించాడ’ని సీఈసీ తన ఆదేశాలను సమర్థించుకున్నది. గతంలో యూపీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు హత్యా నేరాలపై జైలు శిక్ష అనుభవించినా, ఎన్నికల్లో పోటీ చేసిన విషయాన్ని సీఈసీ ఈ సందర్బంగా ఉదహరించింది. అంటే ప్రజా ప్రతినిధుల అవినీతి హేయమైన నేరం కాదని సీఈసీ భావిస్తున్నట్లుంది! సీఈసీ తీసుకున్న నిర్ణయంపై ‘సిక్కిం డెమొక్రటిక్ ఫ్రంట్’ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. దీనిపై వివరణ ఇవ్వాలని సుప్రీం కోర్టు సీఈసీ, సిక్కిం ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, తమంగ్ను కోరింది. ఇప్పటిదాకా కేంద్రం, తమంగ్ తమ వివరణను కోర్టుకు అందించలేదు.