చరిత్ర నుంచి ఏం నేర్చుకోవాలి? సమాజంలో, సంస్కృతిలో ఉన్న వైవిధ్యాన్ని అందులో ఉన్నఆనందాన్ని కలిసి పంచుకోవడమా లేక భిన్నత్వాన్ని వైరుధ్యంగా మార్చుకొని కుత్తుకలు కోసుకోవడమా? చరిత్ర చెప్పే పాఠం ఏమిటి? భారత చరిత్రలో, ప్రత్యేకించి మధ్య యుగ తెలంగాణ చరిత్రలో వర్తమానం తీసుకోదగిన ‘నెగెటివ్’ పాఠాలున్నాయి. అలాగే ‘పాజిటివ్’ పాఠాలూ పుష్కలంగా ఉన్నాయి. తెలంగాణ సమాజం ఏనాడూ ఈ వైవిధ్యాన్ని కోల్పోలేదు.
శాతవాహన కాలం నుంచి విష్ణుకుండి కాలం వరకు అంటే దాదాపు క్రీ.శ.6వ శతాబ్దం దాకా బౌద్ధం, వైదికం రెండూ ప్రజల, పాలకుల మతాలుగా ఉన్నాయి. బౌద్ధ మత ప్రాభవం క్రమంగా తగ్గుతున్న కాలంలో ఆ శూన్యాన్ని జైనం ఆక్రమించింది. అందుకే తెలంగాణలో బాదామి చాళుక్య, రాష్ట్రకూట, వేములవాడ చాళుక్య ఆ తర్వాత కళ్యాణి చాళుక్య కాలం వరకు, రెండు మతాలూ..జైనం, వైదికం ప్రజల ఆదరణ పొందాయి.
క్రీ.శ. ఒకటో శతాబ్దం వరకు జటిలమైన ఆచారాలతో ఉన్న జైన మతంలో యాపనీయ అనే శాఖ ప్రజానుకూల మార్పులతో ప్రజలకు దగ్గరైంది. అందుకే బౌద్ధం తెరమరుగు కాగానే ఆ స్థానాన్ని జైనం పూరించింది. అందుకే ఇప్పటికీ తెలంగాణ పల్లెల్లో పొలాల్లో, ఆలయాల ఆవరణల్లో జైన తీర్థంకరుల విగ్రహా లను చూడొచ్చు. కళ్యాణి చాళుక్యకాలం దాకా మనకు ఈ రెండు మతాల ప్రాభ వం కనిపిస్తుంది. గ్రామాధికారులైన గవుండలు, వ్యాపారులైన శెట్లు, వ్యవసాయవృత్తిలో ఉన్న రడ్లు, ఇంకా నాటి పాలక వర్గం రెండు మతాలను సమానంగా ఆదరించినట్టు శాసనాలు చెప్తున్నాయి.
బోధన్ పాన్ గల్లీలో ఒక స్తంభంపై ఉన్న శాసనం చంద్రప్రభదేవ అనే జైన ముని సమాధి ఫలకం. బిచ్కుంద మండలంలోని పుల్కల్ గ్రామంలో క్రీ.శ. 1088లో కళ్యాణి చాళుక్య రాజు త్రిభువనమల్ల పాలిస్తున్న కాలంలో బొమ్మిశెట్టి, మల్లిశెట్టి అనే ఇద్ద రు నకరేశ్వర, మల్లికార్జున ఆలయాలకు 5 మర్తరుల భూమిని దానం చేసిన శాసనం ఉన్నది.
నిజామాబాదు జిల్లా, నవీపేట మండలం బినోలా గ్రామంలో దొరికిన జైన తీర్థంకరుడైన శాంతినాథ విగ్రహ పీఠంపై, ఆ విగ్రహాన్ని నిలిపిన ‘వైశ్యకుల తిలక నాబిశెట్టి’ ప్రస్తావన ఉంది. బోధన్ కోటగోడ దగ్గర పడిఉన్న రాయి ఇదే కాలంలో కరణం జోగపయ్య జైన బసదికి చేసిన దానానికి సాక్ష్యం.
తొలి కాకతీయులు మొదట జైనాన్ని ఆచరించినా ఎదుగుతున్న శైవాన్ని కూడా ఆదరించారు. కళ్యాణి చాళుక్యరాజు ఆరవ విక్రమాదిత్యుడు సామంతుడు, అనుమకొండ నుంచి పాలిస్తున్న మహామండలేశ్వర కాకతీయ బేతరాజు ప్రోలేశ్వర, బేతేశ్వర ఆలయాల్లో దీపం కోసం చేనును, ఇల్లును, గానుగను దానం చేశాడని వరంగల్ కుమారపల్లిలో ఉన్న శాసనంలో ఉంది. బేతరాజు అక్కడి వీర కమల్ల జినాలయానికి కూడా దానం చేసినట్టు నర్సంపేట దగ్గరి బానాజీపేటలో ఒక స్తంభ శాసనమే నిలువెత్తు సాక్ష్యం. మళ్ళీ ఇదే బేతరాజు, అనుమకొండ పక్కనే శివపుర అనే గ్రామాన్ని కట్టించి శ్రీపర్వత శిలామఠ కాలాముఖ శాఖ చెందిన రామేశ్వరపండితకు ఇచ్చినట్టు కాజిపేట దర్గా శాసనం ఆధారంగా నిలుస్తుంది.
ఇక పద్మాక్షమ్మ గుట్ట జైన చరిత్రకు మౌన సాక్షిగా ఇప్పటికీ నిలిచి ఉంది. ఈ గుట్ట మీదే కాకతీయ ప్రోల రాజు మంత్రి అయిన బేతడి భార్య మైలమ ‘కదలాలయ బసది’ అనే ఒక జైన బసదిని కట్టించినట్టు పద్మాక్షి గుడి ఎదుట నిలిచి ఉన్న స్తంభం మీద ఇంకా చెదిరిపోని శిలాక్షరాలు చరిత్రలో జరిగిన ఘటనలకు సాక్ష్యంగా నిలుస్తుంది. క్రీ.శ. 1108, జనగామ జిల్లా బైరానిపల్లిలో భువనగిరి దండనాయకుడు (కోట పాలకుడు) బీరమరడ్డి, నంగనూరుకు చెందిన పున్నిరడ్డి, వెల్లంపట్లకు చెందిన రేవిరడ్డి జినాలయానికి చేసిన దానం ఉంది. క్రీ.శ. 1150లో సిరికొండ (సూర్యాపేట జిల్లా) శాసనం సిరికొండ రాజ్యాన్ని ఏలుతున్న మహామాండలిక కేతయ జువ్వేశ్వర, భీమేశ్వర ఆలయాలకు (శైవం), జినదేవుడికి (జైనం), నారాయణదేవుడికి (వైష్ణవం) దానం ఇచ్చినట్టు చెప్తుంది.
సుమారు 900 ఏండ్ల కిందట జనగామ దగ్గరి బెక్కల్లులో మల్లిరెడ్డి దాతృత్వం, సర్వమత సహనానికి ప్రతీకగా, వర్తమాన సమాజానికి సందేశంగా నిలుస్తుంది. ఈయన ఒక జైన ఆలయం, వైదిక మత త్రికూటాలయం కట్టించాడు. శాసనంలో.. ‘శైవ, వైష్ణవ, నిజారుహ బౌద్ధములైన.. చతుస్సమయములు.. దైవమెల్ల నేకమ యని యైక్య భావమున’ అని దేవుళ్లంతా ఒక్కటే అని చాటినాడు.
ఇదీ తెలంగాణ నేల మీద నడిచిన కథ. ఒకప్పుడు జైనులైన కోమట్లు (శెట్లు), జైనాన్ని ఆచరించిన రడ్లు (రెడ్లు), నాడు గ్రామ గ్రామాన పరచుకుని ఉన్న జైనం తెలుగు సమాజం నుంచి ఆనవాళ్లు లేకుండా పోయింది. బౌద్ధమూ అంతే. కళ్యాణి చాళుక్య కాలంనాటి జినాలయాలు ఎన్నిటినో కాకతీయ కాలంలో శివాలయాలుగా మార్చేశారు. చరిత్రలో జరిగిన తప్పు లు, ఘటనలు దీనికి కారణం. చరిత్ర ఎప్పు డూ ముందుకే సాగుతుంది. విభిన్న చారిత్రిక కాలాల్లో పరమత విద్వేషంతో కొందరు చేసిన తప్పులు ఇప్పుడు సరిదిద్దాలని ప్రయత్నించడం మూర్ఖత్వం, అచారిత్రకం. కండ్లపై కమ్మి న పొరల్ని తొలగించే బెక్కల్లు మల్లి రెడ్డి శాస నం విద్వేష విషానికి విరుగుడు. ఇదీ మన తెలంగాణ చరిత్ర చెప్పిన పాఠం.
డా. ఎం.ఏ. శ్రీనివాసన్
81069 35000