సంక్షోభాలను అవకాశాలుగా మలుచుకోవాలని ఆశావాదులు ప్రబోధిస్తారు. కానీ, విస్తృతంగా అందివచ్చిన అపార అవకాశాలే సంక్షోభాలకు దారితీస్తే?! ఇప్పుడు వరి పంట విషయంలో తెలంగాణ ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నది. ఆహార ఉత్పత్తుల సేకరణ విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరి అన్నదాతను సంక్షోభంలోకి నెడుతున్నది.
రాష్ట్ర ఆవిర్భావం తర్వాత వ్యవసాయరంగంలో జోష్ పెరిగింది. ప్రాజెక్టుల నిర్మాణం, కాల్వల విస్తరణ, చెరువుల్లో పూడికతీత, 24 గంటల ఉచిత విద్యుత్తు, సకాలంలో ఎరువులు, విత్తనాల సరఫరా, ప్రభుత్వమే ధాన్యం కొనుగోళ్లు చేయటం, రైతుబంధు పథకం లాంటి పథకాలతో కరోనా కష్టకాలంలోనూ వ్యవసాయరంగం ఉజ్వలంగా వెలిగింది. వరి, ఇతర పంట ఉత్పత్తులు గణనీయంగాపెరిగాయి. దేశానికే ధాన్యాగారంగా, ‘రైస్ బౌల్ ఆఫ్ ఇండియా’ గా తెలంగాణ అవతరించింది.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత వరి సాగు విస్తీర్ణం రెండున్నర నుంచి మూడు రెట్లు పెరిగింది. 2014లో రాష్ట్రంలో వరి సాగు విస్తీర్ణం కేవలం 22.74 లక్షల ఎకరాలుంటే, ఇప్పుడది 2021 వానకాలం సీజన్లో 61.75 లక్షల ఎకరాలకు పెరిగింది. ఒక్క వానకాలం సీజన్లోనే కోటిన్నర లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ఉత్పత్తి చేయగలిగే సామర్థ్యాన్ని సాధించింది. కానీ, స్వల్పకాలంలోనే ఇంత ఘనమైన రికార్డు సాధించిన ఉత్సాహాన్ని కేంద్రం నీరుగారుస్తున్నది. దేశానికే ఆహారభద్రత సాధించిపెట్టిన తెలంగాణ అన్నదాతకు మరింత భద్రత కల్పించాల్సిన సమయంలో ఇబ్బంది పెడుతున్నది. రాష్ట్రంలో పండిస్తున్న ధాన్యంలో నలభైశాతం స్థానిక అవసరాలకు పోతే, మిగిలిన 60 శాతాన్ని బయటి మార్కెట్లో అమ్ముకోవాలి. పారిశ్రామికవేత్తల మాదిరిగా రైతులు తమ ఉత్పత్తులను నేరుగా వినియోగదారులకు అమ్ముకోలేరు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వ సహకారం అవసరం. ధాన్యాన్ని కొనుగోలు చేయాల్సిన ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్సీఐ) పరిమితులు పెడుతున్నది. దొడ్డు బియ్యం కొనలేమని చెప్తున్నది. గత యాసంగిలో రాష్ట్రప్రభుత్వం రైతుల నుంచి దాదాపు 92.33 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసింది. అయితే, ఎఫ్సీఐ మాత్రం 24.75 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే తీసుకొంటామని చెప్తున్నది. కనీసం 50 లక్షల మెట్రిక్ టన్నులైనా తీసుకోవాలన్నది రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థన. ఆ మాత్రమై నా కొనకపోతే రైతులు ఇబ్బందులు పడుతారని రాష్ట్ర ప్రభుత్వం ఆవేదన చెందుతున్న.
దేశంలో ఉత్పత్తయ్యే బియ్యానికి అంతర్జాతీయ మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్నది. బాస్మతి రైస్తో పాటు, నాన్ బాస్మతి రకాలను కొనేందుకు పలు దేశాలు ఆసక్తిచూపుతున్నాయి. అనేక దేశాల్లో మన బియ్యానికి మంచి డిమాండ్ ఉన్నందున ఆ అవకాశాలను ఒడిసిపట్టుకొనేందుకు కేంద్రం ప్రయత్నించాలి.ఈ ఏడాది చైనా, వియత్నాం, బంగ్లాదేశ్ కూడా మన బియ్యాన్ని దిగుమతి చేసుకొనేందుకు ముం దుకు రావడం మరింత సానుకూల పరిణామం.
మన దేశంలో ఉత్పత్తవుతున్న వంటనూనెలు, పప్పులు దేశీయ అవసరాలకు సరిపోవడం లేదు. దీన్ని గ్రహించిన రాష్ట్రప్రభుత్వం వాటి సాగువిస్తీర్ణం పెంచే ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఆయిల్పామ్ సాగు చేసే రైతులకు ప్రోత్సాహకా లూ ప్రకటించింది. ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులను ఆకర్షించేందుకు రాష్ట్రాలు ప్రయత్నిస్తున్న సమయంలోనే కేం ద్రం ఆయిల్పామ్ విత్తన దిగుమతులపై 30 శాతం దాకా సుంకాలు పెంచింది! నిజానికి వంటనూనెలు, పప్పులను విదేశాల నుంచి ఇష్టానుసారం దిగుమతి చేసి, దేశీయంగా వాటి సాగును ధ్వంసం చేసింది కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వమే. ఇప్పుడు వంటనూనెల దిగుమతుల కోసమే ఏటా దాదాపు రూ.80 వేల కోట్ల విదేశీ మారకద్రవ్యాన్ని ధారపోయాల్సిన దుస్థితిలోకి దేశాన్ని నెట్టిందీ కేంద్రమే.
రైతుల నుంచి ధాన్యాన్ని కొనుగోలు చేయరు. ప్రత్యామ్నాయ పంటలు వేస్తామంటే ప్రోత్సహించరు. ఇదీ గత కొన్నేండ్లుగా మోదీ ప్రభు త్వం అనుసరిస్తున్న వైఖరి. ఎఫ్సీఐ బియ్యం సేకరించకపోతే రాష్ట్ర రైతులు తీవ్రంగా నష్టపోతారు. ఇంత జరుగుతు న్నా రాష్ట్ర బీజేపీ నేతలు కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నించకపోవడం ఆశ్చర్యకరం. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న వ్యవసాయరంగాన్ని, రైతులు సాధిస్తున్న విజయాలను నిలబెట్టుకోవడం, వారికి భద్రత కల్పించడం అందరి బాధ్యత.
కందిబండ కృష్ణప్రసాద్