‘ప్రభుత్వ విధానాల మీద బహిరంగంగా మాట్లాడటానికి మా పారిశ్రామిక మిత్రులు ముందుకురావటం లేదు. విమర్శిస్తే ప్రభుత్వం నుంచి వేధింపులు ఎదురవుతాయని భయపడుతున్నారు. యూపీఏ-2 హయాంలో మేం ఎవరినైనా విమర్శించే పరిస్థితి ఉండేది. కానీ, ఇప్పుడలా చేస్తే ఆ విమర్శను సరైన విధంగా తీసుకుంటారన్న నమ్మకం లేకుండా పోయింది’ అంటూ దిగ్గజ పారిశ్రామికవేత్త రాహుల్ బజాజ్ 2019లో చేసిన వ్యాఖ్యలు మోదీ ప్రభుత్వంపై భారతీయ పారిశ్రామికవేత్తలకు ఉన్న అభిప్రాయానికి అద్దం పట్టాయి. దీనికి భిన్నమైన ఘటన ఒకటి బుధవారం ‘భారతీయ వాహన తయారీదారుల సంఘం’ వార్షిక సమావేశంలో చోటుచేసుకున్నది. ప్రభుత్వం అనేక మాటలు చెబుతున్నప్పటికీ, తమ సమస్యల పరిష్కారానికి ఏమీ చేయటం లేదంటూ ఆటోమొబైల్ కంపెనీల అధిపతులు ఆర్సీ భార్గవ, వేణు శ్రీనివాసన్ కుండబద్దలు కొట్టారు.
ప్రభుత్వాన్ని విమర్శించటానికే జంకిన పారిశ్రామికవేత్తలు.. ఇప్పుడు ఆ పని చేయగలగటం మంచి పరిణామమే అయినా.. అసలు ప్రశ్న అది కాదు. కేంద్ర ప్రభుత్వ విధానాలు దేశంలోని పరిశ్రమలను ముందుకు తీసుకెళ్తున్నాయా? వెనక్కి నెడుతున్నాయా? అన్నది కీలకం. 2014లో తొలిసారి ప్రధానిగా మోదీ బాధ్యతలు చేపట్టిన తర్వాత.. ప్రపంచానికే మాన్యుఫ్యాక్చర్ హబ్గా (తయారీకేంద్రంగా) భారతదేశాన్ని మారుస్తానని ప్రకటించారు. ‘మేక్ ఇన్ ఇండియా’ పేరుతో విస్తృతంగా ప్రచారం చేశారు. కానీ, ఫలితం కనిపించలేదు. 2019లో దేశ జీడీపీలో తయారీరంగం వాటా 20 ఏళ్ల కనిష్ఠానికి (15.1 శాతానికి) పడిపోయింది. ఈ నేపథ్యంలో అమ్మ కాలు తగ్గి, పన్నులు పెరిగి ఆటోమొబైల్ రంగం కూడా తీవ్ర ఒత్తిళ్లకు గురవుతున్నది. దీనివల్లే ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తమవుతున్నది.
ఆసియాలోనే మూడో అతిపెద్ద ఆర్థికవ్యవస్థ అయిన భారత్.. మోదీ అధికారం చేపట్టే సమయానికి 7-8 శాతం జీడీపీ వృద్ధిరేటును నమో దు చేసింది. 2019-20 నాటికి అది 3.1 శాతానికి పడిపోయింది. ఇది దశాబ్దకాలంలోనే కనిష్ఠం. 2017-18లో నిరుద్యోగం 6.1 శాతానికి పెరిగింది. ఇది 45 ఏండ్లలోనే అత్యధికం. దీనికి కారణాలేమిటి? 2016లో అకస్మాత్తుగా ప్రకటించిన నోట్లరద్దు, 2017లో ఆదరబాదరగా అమలుచేసిన జీఎస్టీ తీవ్రంగా వ్యాపారాలను దెబ్బతీశాయని అనేక అధ్యయనాలు తేల్చిచెప్పాయి. కరోనా సంక్షోభం తోడవటంతో పరిస్థితి మరింత క్షీణించింది. ఇటువంటప్పుడు దీర్ఘదృష్టితో చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వం.. అనుకూలురైన పెట్టుబడిదారులకు మేలు చేయటం కోసమే పని చేస్తున్నదని, పరిశ్రమల సమగ్ర అభివృద్ధిని పట్టించుకోవటం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. దీనిపై కేంద్రం దృష్టి పెట్టాలి. వ్యవసాయం తర్వాత అత్యధికంగా ఉపాధి కలిగించే పరిశ్రమల పునరుజ్జీవనానికి తగిన చర్యలు తీసుకోవాలి.