అంతర్జాతీయ వాణిజ్యంలో చోటుచేసుకున్న ఇటీవలి పరిణామాలు మనదేశ విదేశీ వాణిజ్య విధానంలో మార్పుల అవసరాన్ని తెలుపుతున్నాయి. ముఖ్యంగా వ్యవసాయ రంగానికి, ప్రత్యేకించి వ్యవసాయ ఎగుమతులకు సంబంధించి మార్పులు అత్యావశ్యం.
దేశ ఎగుమతుల గత చరిత్ర చూస్తే.. సుగంధ ద్రవ్యాలు, పప్పులు, పాలు, టీ, జీడిపప్పు, జనపనారల్లో మనదేశం అతిపెద్ద ఉత్పత్తిదారే గాక ఈ ఉత్పత్తులు ఎగుమతి కూడా అయ్యేవి. అలాగే గోధుమలు, బియ్యం, పండ్లు, కూరగాయలు, చెరకు, పత్తి, నూనెగింజల ఉత్పత్తిలో ప్రపంచంలోనే రెండవ-అతిపెద్ద ఉత్పత్తిదారు భారత్. దేశంలో దాదాపు 53.58 కోట్ల సంఖ్యలో పశువులున్నాయి. ప్రపంచంలో రెండవ అతిపెద్ద వ్యవసాయ యోగ్యమైన భూ వనరులను మన దేశం కలిగి ఉన్నది.
ప్రపంచంలోని 20 వ్యవసాయ-వాతావరణ ప్రాంతాల్లో మన దేశంలో 15 ప్రధాన వాతావరణ ప్రాంతాలున్నాయి. ప్రపంచంలోని 60 రకాల నేలల్లో 46 రకాల నేలలు దేశంలోనే ఉన్నాయి. వ్యవసాయోత్పత్తుల ఎగుమతిలో అగ్రశ్రేణి పది దేశాల్లో ఒకటిగా ఉన్నది. ప్రధాన ఎగుమతుల్లో చక్కెర, గొడ్డు మాంసం, బియ్యం, రొయ్యలు ఉం టాయి. బియ్యం, గోధుమలు, చక్కెర, పత్తి, పండ్లు, కూరగాయలతో సహా ప్రధాన వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతిపై ఎలాంటి ఆంక్షల్లేవు. కానీ పప్పులు, వంట నూనెల ఎగుమతులపై మాత్రం పరిమితులు, నియంత్రణలున్నాయి.
కాలక్రమంలో దేశీయంగా డిమాండ్ పెరగటంతో పాటు, వ్యవసాయ ఎగుమతులు పెరిగాయి. దేశం మొత్తం ఎగుమతుల్లో వ్యవసాయ ఎగుమతుల వాటా తగ్గింది. వ్యవసాయ యాంత్రీకరణను పెంచుతున్న భారతదేశం.. ట్రాక్టర్లు, టిల్లర్లు, హార్వెస్టర్లు వంటి వ్యవసాయ యంత్రాల అతిపెద్ద తయారీదారుల్లో ఒకటిగా ఉన్నది. ట్రాక్టర్ల తయారీలో దాదాపు మూడింట ఒక వంతు ట్రాక్టర్లు మనవద్దే తయారవుతున్నాయి.
ఆహారధాన్యాల ఉత్పత్తి 2019-20లో రికార్డు స్థాయిలో 296.65 మిలియన్ టన్నులకు చేరుకున్నది. 2020-21లో, భారత ప్రభుత్వం 298 మిలియన్ టన్నులు లక్ష్యంగా పెట్టుకున్నది. వ్యవసాయం సమాజానికి ఆదాయాన్ని అందించటమేగాక ప్రజలకు ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నది. అలాగే అనేక వ్యాపారాలు వ్యవసాయంపై ఆధారపడి ఉన్నాయి. దేశం నుంచి వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతికి అంతర్జాతీయ మార్కెట్లో విస్తారమైన అవకాశాలు, డిమాండ్ ఉన్నాయి. కరోనా కాలంలో కూడా దేశంలో ఆహారధాన్యాల ఉత్పత్తి గణనీయంగా ఉన్నది. ఆహారం, ఇతర ముఖ్యమైన వ్యవసాయ ఉత్పత్తులకు భారత్ ప్రపంచ సరఫరాదారుగా ఆవిర్భవించింది. ఏప్రిల్ 2020-జనవరి 2021 మధ్య కాలంలో వ్యవసాయ ఉత్పత్తుల్లో భారతీయ ఎగుమతులు 38 శాతం పెరుగుదలను నమోదు చేశాయి. వ్యవసాయ ఎగుమతులతో పోలిస్తే వ్యవసాయ దిగుమతులు అధిక వేగంతో పెరుగుతున్నాయి. అయినా, వ్యవసాయ జీడీపీలో వ్యవసాయ ఎగుమతులు, దిగుమతుల నిష్పత్తి 1990-91లో 4.9 శాతం నుంచి 2016-17లో (ప్రస్తుత ధరల ప్రకారం) 5.79 శాతానికి పెరిగింది. భారత్ నుంచి బియ్యం ఎగుమతులు ప్రపంచంలోని దాదాపు 143 దేశాలకు విస్తరించాయి. ఇటీవలి కాలంలో, ఆఫ్రికా లోని సంప్రదాయ మార్కెట్లలోకి ప్రవేశించడానికి చైనా, థాయ్లాండ్ పోటీ పడుతున్నాయి .
మక్కజొన్నకు సంబంధించి మలేషియా, బంగ్లాదేశ్, శ్రీలంక సంప్రదాయ దిగుమతి దేశాలు. భారత్ పత్తి ఎగుమతులకు ప్రధాన వాణిజ్య గమ్యస్థానాలుగా చైనా (30.91 శాతం), బంగ్లాదేశ్ (27.14 శాతం), పాకిస్థాన్ (15.94 శాతం), వియత్నాం (9.62 శాతం), ఇండోనేషియా (3.15 శాతం), టర్కీ (1.91 శాతం) ఉన్నాయి.
తెలంగాణలో వ్యవసాయ ఎగుమతులు: తెలంగాణ సామాజిక-ఆర్థిక పురోగతి దృఢంగా కొనసాగుతున్నది. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పునర్నిర్మాణం, పునరుజ్జీవనం పొంది ‘బంగారు తెలంగాణ’ లక్ష్యాన్ని సాధించే దిశగా రాష్ట్రం కీలకరంగాల్లో అద్భుతమైన విజయాలు సాధించింది. తెలంగాణలో వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతి అవకాశాల్ని చూస్తే.. బియ్యం, మక్కజొన్న, ఎర్ర మిర్చి, పత్తి తదితర ఉత్పత్తుల ఎగుమతులకు విస్తృత అవకాశాలున్నాయి. అయితే రైతులకు వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులపై కేంద్రప్రభుత్వం నుంచి సాంకేతిక మార్గదర్శకత్వం లేకపోవడం ప్రతిబంధకంగా మారింది. అలాగే ఉత్పత్తుల నాణ్యతా ప్రమాణాలు పెంచుకోవాల్సిన అవసరం ఉన్నది. పురుగు మందుల అవశేషాల విశ్లేషణకు తగిన సౌకర్యాలు లేకపోవడం, తక్కువ ఖర్చుతో కూడిన ఉత్పత్తులపై అవగాహన లేకపోవడం, నిల్వచేయడం, ప్రాసెసింగ్ చేయడం, ఎగుమతి ధరల గురించి సమాచారం వంటి సరైన మౌలిక సదుపాయాల్లేకపోవడం వంటివి తెలంగాణ రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు.
ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం అన్నివిధాలుగా రైతులకు అండగా నిలుస్తున్నది. వ్యవసాయ ఉత్పత్తులు పెంచటానికి అన్నివిధాలా ఆసరాగా నిలిచిన తెలంగాణ ప్రభుత్వం ఎగుమతుల విషయంలోనూ ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నది. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలన్న మోదీ ఆకాంక్ష నిజం కావాలన్నా.. దానిలో వ్యవసాయ ఎగుమతులు కీలక పాత్ర పోషిస్తాయి. ఆ దిశగా మన ప్రయత్నాలు ఉన్నప్పుడే రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ఎగుమతుల విషయంలో కేంద్రం మరింత నిబద్ధతతో ఆలోచించాలి. వ్యవసాయ ఎగుమతులపై దృష్టిసారించాలి.
(‘భారతదేశంలో వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతి-అవకాశాలు’ అంశంపై ఇటీవల హైదరాబాద్లో జరిగిన వర్క్షాప్లో రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు వినోద్ చేసిన ప్రసంగం సంక్షిప్తంగా..)
–బి. వినోద్ కుమార్