గోరటి వెంకన్న తెలంగాణ మట్టి గొంతు. శతాబ్దాల గాన సంప్రదాయాల కొనసాగింపు. తత్వగీతాల స్వరపేటిక. అపురూపమైన ధారణాశక్తిని ధరించిన పల్లె మనిషి. ‘ఏకునాదం మోత’, ‘రేలపూతలు’, ‘అలసెంద్రవంక’, ‘వల్లంకి తాళం’ పుస్తకాల గేయరూప కవిత్వంతో తెలుగునేలపై చెరగని ముద్రవేసిన కవి. తన గానంతో ఆ కవిత్వానికి ప్రాణ ప్రతిష్ఠ చేసి ప్రజల నాలుకలపై నడయాడ చేస్తున్న వాగ్గేయకారుడు.
ఆధునిక, సంప్రదాయ కవిత్వాన్ని అనేక వాదాలకు చెందిన కవిత్వాల సారాన్ని ఔపోసన పట్టి, తనదైన సంయమనతను ప్రదర్శిస్తూ సృజన చేస్తూ వస్తున్నాడు గోరటి వెంకన్న. పాలమూరు, రాయలసీమ ప్రాంతాల తత్వ కవులు, ‘అచల సిద్ధాంత’ కవుల పదకవితలలోని అభివ్యక్తిని ఒడిసిపట్టుకున్నాడు.
పాటకు గోరటి గాన నైపుణ్యం తోడైంది. తాను రాసేప్పుడు తన లోపలి లయజ్ఞానం తోడయ్యింది. పద వరుసలు, పల్లవులు, చరణాలు రాగాలు తీస్తూ, పదాలను వాటి మధ్యన పొదుగుతూ రాయడం అలవాటైంది. అలా గోరటి వెంకన్న గేయరూప కవిత్వం మనముందు సాక్షాత్కరిస్తుంది.
ఎక్కడ పాట ఉంటే అక్కడ ఉంటాడు గోరటి. ఎక్కడ నాటకం ఉంటే అక్కడ ప్రత్యక్షమవుతాడు. తానొక వేషం కడతాడు. ఆ క్షణంలో హరిశ్చంద్రుడవుతా డు, బిల్వమంగళుడవుతాడు. పరకాయ ప్రవేశం చేసి ఆ ఘడియల్లో జీవిస్తాడు. డప్పు, డోలక్, గజ్జెలు, కంజీర, తబలా.. వాయిద్యాల చప్పుడు వింటే గోరటి వెంకన్న అనే కవి శిగమూగినట్లే! ఇవేవీ లేకున్నా పాటను ఇష్టపడే నలుగురు కలిస్తే చాలు.. చెక్క, బల్ల, పళ్లెం ఏదున్నా దానిమీద దరువేస్తూ పాటను అందుకుంటాడు. లోలోపల తనలోతానే అల్లుకుంటాడు. అంతకుముందు రాసిన పాటైనా, సందర్భానుసారంగా దానిలోని పదాల్ని, చరణాలను సరికొత్తగా పాడుకుంటాడు. అందుకే అతని పాటలకు అనేక రూపాంతరాలు.
‘గోరటి వెంకన్న – కవితాపరామర్శ’ పుస్తకంలో పెన్నా శివరామకృష్ణ అన్నట్లు.. భావానుగుణంగా, నాదసామ్యం కలిగిన పద సంయోజన, సునిశిత పరిశీలనాత్మక అధ్యయనం ద్వారా, అభ్యాసం ద్వారా అలవోకగా ఆయనకు అలవడిన విద్య. సమకాలీన శ్రేష్ఠ వచన కవుల కవిత్వాన్ని అధ్యయనం చేసి, వచనకవిత్వ ఖండికా నిర్మాణశిల్పాన్ని అవగాహన చేసుకొని, తన ప్రతి గేయంలో ఆ శిల్ప దృష్టిని ప్రదర్శించిన కవి. వచన కవిత్వానికి దీటుగా, గేయాలలోనూ సాంద్ర కవిత్వాన్ని వినిపించవచ్చునని నిరూపించిన కవి ఆయన. మారిన సామాజిక, సాంస్కృతిక సందర్భాలలో దళిత బహుజన కవిత్వంలో, కవితా వస్తువుతోపాటు కవి సమయా లు కూడా మారుతాయని, పరోక్షంగా తెలియజెప్పిన కవి గోరటి. దళిత బహుజన వచన కవులతో సమానంగా, తన గేయాలలో వస్తువు ఏదైనా దళిత బహుజన సంస్కృతులను ఉన్నతీకరించిన కవి. తెలంగాణ, రాయలసీమ, ఉత్తరాంధ్ర సంస్కృతులను సమానంగా అభిమానించి, మూడు ప్రాంతాలను గూర్చి గొప్ప గేయాలను రాసి, పాడిన ఏకైక కవి గోరటి వెంకన్న. ఆయన ఎంత ప్రజాకవో, అంత అనుభూతి కవి.
గోరటి వెంకన్న పాటలను గేయరూప కవిత్వంగా పిలుచుకోవాల్సిన అవసరం ఎందుకు అన్నప్పుడు.. ఆ పాటల్లోని కవితాంశ దాని ప్రాతిపాదిక. ప్రతి పాదాన్ని పొలికలతో, ఉపమ ఉపమేయాలతో, స్వభావోక్తులతో, ఉత్ప్రేక్షలతో పాఠకుడిని ఉక్కిరిబిక్కిరిచేసే అనుభూతితో వివశుడిని చేయడం.. లీనం చేయడం.. దానికితోడైన పల్లీయమైన సహజస్వరం ఆయన సొంతం. ఇవన్నీ కలగలిసి అది గేయరూప కవిత్వంగా పరిణమించడం గోరటి గేయాల్లో మనం గమనించవచ్చు. ఇంకా దానికితోడు తన ప్రదర్శనాకళ ఉండనే ఉన్నది. ఇది తన సృజనకు అందివచ్చిన అదనపు మరో కోణం. ప్రసేన్ ఒకచోట ప్రస్తావించినట్లు.. ‘అతడు భావోద్వేగాల పుట్ట. లయాత్మకుడు. శృతికారుడు. అలాగే..ఇంత వైవిధ్యత సాధించిన కవి తెలుగు సాహిత్యంలో అరుదు. ఏకకాలంలో తాత్వికుడు, వాగ్గేయకారుడు, ఉద్యమకారుడు, కళాకారుడు గోరటి వెంకన్న.
‘పసిపాప వలె ఉండురన్న గోరటి రీతి పండువెన్నెల కురియురన్న గోరటి గీతి గరికపూల వంక గంతులేసె జింక గోరటి గీతి మెరిసె ఇసుక డొంక, ఎగిసె గోధూలెంక గోరటి గీతి..’
2019లో అచ్చయిన ‘వల్లంకి తాళం’లో ముప్పై రెండు గేయరూప కవితలున్నాయి. దాన్ని కవయిత్రి శిలాలోలితకు అంకితం చేశాడు. కె.శివారెడ్డి, అంబటి సురేంద్రరాజు, కృష్ణుడు విశ్లేషణాత్మక ముందుమాటలు రాశారు. విశేషంగా జనంలోకి వెళ్లిన వెన్నెల, నల్లతుమ్మ, వల్లంకి తాళం, సిద్ధుల ఎరుక, తరమెల్లి పోతున్నదో, శివుడా వంటి గేయరూపకవితలు ఇందులో ఉన్నాయి.
‘సిద్ధుడి’గా పరిణామం చెందుతున్న కవిగా గోరటి వెంకన్న ఈ పుస్తకంలో కనిపిస్తాడు. జీవనసారాన్ని పిండి ఈ పుస్తకంలో ఒంపినట్లు ‘బెడలగువ్వ’, ‘కానుగనీడ’ వంటి కవితలు చదివితే అనుభూతి కలుగుతుంది. బైరాగిలా, సంచారిలా సంచరిస్తూ, సంచలిస్తూ అన్వేషకుడై తపిస్తూ గోరటి వెంకన్న ఈ రచనల్లో కనిపిస్తాడు.
‘మల్లెవోలే తెలుపున్న నాగులో
నల్లని విషమే ఉన్నదట
మబ్బువోలే నలుపున్న బర్రెలో
తెల్లని పాలే ఊరునట..’
మౌలిక జీవనసత్యాల అన్వేషణ ఇది. నిరంతర తపన. లీనమైతే తప్ప ఇంతటి లోతైన అంశాల ప్రస్తావన ఉండదు. అటువంటి తన్లీనత గుణమే గోరటి వెంకన్న కవిత్వ విశిష్టత. సాధారణంగా కనిపించే వచనంలో అసాధారణ గుణం. అలవోకగా అద్భుతమైన ‘ఇమేజెస్’ పడుతూ ఉంటాయి. అవి జీవితం నుంచి, ప్రకృతి నుంచి, పరిసరాల నుంచి నేరుగా వచ్చినవి. మనదైన తనమేదో వాటికి అంటుకొని ఉంటుంది.
‘మెరుపులాంటి పదములకు
మరుపనేది ఒక వరం
కలల పలవరింతవోలె
కవిత గొంతునొలకాలె..’
సహజత్వానికి దగ్గరగా ఉండే సృజనతత్వం గోరటి బలం. ఉబికివచ్చే కవి సమయపు ఉధృతిలో మరుపులోకి వెళ్లే పదాలు సతాయించినా, కలల పలవరింతలాగా అలవోకగా కవిత్వం పలకగలిగిన వెంకన్న అక్కమహాదేవి, అల్లమా ప్రభు, కన్నమదాసు వంటి మహా బోధకుల మార్గంలో తన దారులను పసిగట్టే పనిలో ఉన్నట్లు, ఆ రందిలోనే జీవిక సాగిస్తున్నట్టు ఈ పుస్తకమంతటా కనిపిస్తాడు. ఒక మహానుభవాన్ని మనకు దానం చేసే కవి. కె.శ్రీనివాస్ గారన్నట్లు.. ప్రకృతి విహిత జీవితం, నిర్మల ప్రేమతత్వం, పర్యావరణం, సాధుతత్వం, స్వాదుతత్వం, సామరస్యం, నిస్వార్థం, ప్రలోభాల విముఖత్వం, అంతర్ముఖత్వం.. ఇవ్వన్నీ గోరటి పాటల్ని సమగ్రం చేశాయి. ఒక సమగ్ర జీవనాన్వేషణ తత్వసారం ఈ పుస్తకం. ప్రకృతి, సమాజపు మేలు కలయికగా గోరటి వెంకన్న కవిత్వం దర్శనమిస్తుంది.
‘నింగి నీటి మబ్బువోలె, పొంగె ఏటి కొప్పువోలే, బరువును వదిలించుకునే సారం’తో జీవించే గోరటి వెంకన్న- ‘తీరంలో పడవ బరువు, పయనంలో నడక సులువు’ అనే ఎరుకతో ‘చలనంలో ఉన్నవన్ని అవలీలగా సాగిపోవు’ – అనే జీవన తత్వంతో సాగుతున్న కవి.
కె.కె.రంగనాథాచార్యులు వంటి గురువుల దగ్గర చదువుకున్న చదువు ఇతడి నడకకు దారిచూపాయి. అలంకారిక గ్రంథాలు, లక్షణ శాస్ర్తాలు వంట పట్టించుకున్న పద్యకావ్యాలు తన భావుకతకు జతకలిసి గోరటి వెంకన్నను అపురూపమైన కవిగా మలిచాయి. వాటన్నిటి ప్రతిఫలనమే అతడి ‘వల్లంకి తాళం’.
కవి యాకూబ్
98491 56588