తెలంగాణను చూస్తుంటే దేశమే ఆశ్చర్య పోతున్నది! తెలంగాణకు ఏడేండ్ల పసిప్రాయమైనా 70 ఏండ్లలో జరగని అభివృద్ధి, సంక్షేమంతో ముందుకు పోతున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ సృష్టించిన అద్భుతమైన ప్రగతి తెలంగాణ ప్రజల కండ్ల ముందు కన్పిస్తున్నది. నాడు ఉద్యమంలో ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ తెలంగాణను సాకారం చేసినట్టు.. బంగారు తెలంగాణ నిర్మిస్తున్నారు. కాళేశ్వరంతో తెలంగాణ పచ్చని పంటలతో సిరుల మాగాణి అయ్యింది. 3 కోట్ల టన్నుల ధాన్యం పండించి దేశానికి అన్నం పెడ్తున్నది.
కేసీఆర్ తెలంగాణలో ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు. దళిత జాతి ఎదుర్కొంటున్న సామాజిక వివక్షను రూపుమాపి వారిని ఆర్థిక స్వావలంబన దిశగా సంపన్నులుగా నిలిపేందుకు దళితబంధు పథకానికి రూపకల్పన చేయటం చారిత్రాత్మకం. తెలంగాణ దళితబిడ్డలే దేశ దళితజాతికి వెలుగు దారి చూపేలా కేసీఆర్ కృషి చేస్తున్నారు.
దళితుల మది నిండా కేసీఆర్ ఉన్నారు. వారికి కొండంత అండగా తానున్నానని, వారి జీవితాలకు భరోసాగా ఉంటానని కేసీఆర్ మాట ఇచ్చిండు. కేసీఆర్ మాట వారికి వెలుగు బాట. తెలంగాణ ఉద్యమాన్ని ఎట్లయితే ముందుకు తీసుకపోయినమో, అంతకు రెట్టింపు స్థాయిలో మహోద్యమాన్ని సృష్టించటానికి కేసీఆర్ కృతనిశ్చయంతో ఉన్నారు. దేశంలోని దళిత కుటుంబాల్లో ఉదయించే కొత్త సూర్యోదయమే మన ముఖ్యమంత్రి కేసీఆర్.
ఈ 75 ఏండ్లలో దళిత వాడల్లోకి తొంగిచూసిన నాయకుడు లేడు. అట్టడుగు వర్గాలు పేదరికంలో మగ్గిపోతున్నా వారిని దరికి చేర్చలేదు. తరతరాల వివక్ష, పేదరికంతో దుఃఖం నిండిన కండ్లల్లో కేసీఆర్ కాంతి రేఖలు నింపారు. ఆ వెలుగు రేఖే ‘దళిత బంధు’. దళిత జీవితాల్లో చిరునవ్వు నింపటానికి కేసీఆర్ సడలని సంకల్పంతో దళితబంధు విజయానికి కృషి చేస్తున్నారు. గడిచిన ఏడు దశాబ్దాల్లో దేశంలో రాజకీయాలు తప్ప ఏమున్నది? గరీబీ హఠావో ఏమైంది? బేటీ బచావో ఎటుపోయింది?
ఇప్పటికైనా ప్రజాప్రతినిధులమని చెప్పుకొనే వారు నిజాయితీతో వ్యవహరించాలి. దళితుల ఉన్నతి కోసం కలిసి నడువాలి. దళిత బంధువులుగా కేసీఆర్ సంకల్పానికి అండగా నిలువాలి. లేదంటే విపక్షాలకు రాబోయే రోజుల్లో ఉనికి ఉండదు.
పేదల జీవితాలకు భరోసా నింపే పాలనా ఫలం అందించే సేవల్లో ముందుండాలి. అంతేకానీ రోజుకో నాటకం, పూటకో మాట లెక్క వ్యవహరిస్తే ప్రజలు ఈసడించుకుంటారు. ఎవరిని దించాల్నో, ఎవర్ని ఉంచాల్నో ప్రజలు గమనిస్తున్నారు. తెలంగాణ ప్రజా గుండెల్లో జనబంధువుగా కేసీఆర్ ఉన్నారు. ఎప్పుడూ మన కేసీఆర్ చెబుతుంటారు.. ‘ప్రజలకు మంచి చేస్తున్నపుడు చకోరా పక్షుల రాజకీయాలుంటాయి , రేపూ ఉంటాయి. మన పని మనం చేసుకపోతుండాలే’ అంటారు. హద్దు మీరి విమర్శలు, స్థాయి మించి సవాళ్లు విసరడాలు చేస్తే ప్రజలే తిరగబడుతరు. ప్రగతి వ్యతిరేకులకు తగిన శాస్తి చేస్తరు. తాము ఎన్నుకున్న సీఎంను అడ్డగోలుగా మాటలు అంటున్నా.. ఎంతో ఓపికతో ప్రజలు సహిస్తున్నరు. వారి ఆగ్రహాన్నంతా ఎన్నికల సమయంలో ప్రతిపక్షాలకు ఓట్ల రూపంలో తెలుపుతూ వాటికి ఉనికి లేకుండా చేస్తున్నరు. ఈ క్రమంలోనే దళిత జాతి అభ్యున్నతికి నడుము బిగించిన కేసీఆర్కు అండగా నిలువాలి.
మచ్చ వేణుగోపాల్ రెడ్డి
వ్యాసకర్త: ‘సుడా’ మాజీ డైరెక్టర్, సిద్దిపేట