నా చిన్నప్పుడు.. మా ఊర్లె దొంగలు పడుతరనె పుకార్లు అప్పుడప్పుడు పుడుతుండేవి. నిజంగనే వాళ్లు వచ్చెటోళ్లు. దోసుకొని పొయ్యెటోళ్లు. గా దొంగల కు పలానా ఇంట్లనే పైసలున్నయనే సంగతి ఎట్లా తెలుస్తదని అనుకునేటోళ్లం.
కొన్ని దినాలకు తెలిసిందేమంటే వాళ్లు పొద్దటిపూట సామాన్లు అమ్ముతమనీ, జాతకాలు చెప్తమని మారువేశంలో వచ్చేటోళ్లు. వాళ్లను నమ్మి మా ఊర్ల కొంతమంది వాళ్లకు దోస్తులయిండ్రు. ఊరి సంగతులు చెప్పేటోళ్లు. గట్లా కొంతమంది అగుడు పడ్డందుకు ఊరంతా ఆగమైంది. తెలంగాణల కూడా గిట్ల శానాసార్లు జరిగింది. ఎవడో ఒకడు మంచి అనే ముసుగేసుకొని వచ్చి రాష్ర్టాన్ని ఆగం పట్టిస్తడు. నిజాం రాజ్యం భారత్ల వీలినమైనంక మంచి రోజులొస్తయని ప్రజలు నమ్మిండ్రు. ఆంధ్ర నుంచి ముప్పు సంగతి పసిగట్టలేకపోయిండ్రు. వాళ్లచ్చినంక ఇంకేముంది ముంచుడు షురూ చేసిండ్రు. మా ఊర్ల దొంగలు చేసిన మాయనే ఆంధ్రోళ్లు గూడ చేసిండ్రు. వాళ్లను ఏమనకుండా మనోళ్లే కాపాలా కాస్తుండే. తేరుకున్న తెలంగాణ ఈళ్లతో మాకు కుదరదు మమ్మల్ని వేరే చేయిండ్రని కేంద్రంతో మొత్తుకున్నా జరగాల్సిన నష్టం జరిగిపాయె. తొలి, మలి దశ ఉద్యమాలు చేసి, వేలాది మంది పాణాలు పోగొట్టుకున్నంకగని తెలంగాణ సాధ్యం కాలె.
ఇప్పుడిదంతా ఎందుకు చెప్తున్ననంటే ఆంధ్రోళ్లు వచ్చినట్లే ఇప్పుడు ఉత్తరమోళ్లు మనతానికి వస్తుండ్రు. ఇప్పుడు గనుక మనం తేరుకోకుంటే పెద్ద ప్రమాదంలో పడే అవకాశం ఉంటది. ఎనిమిదేండ్ల పసిగుడ్డును బద్నాం చేసి ఇక్కడ మకాం వేయాలని పెద్దపెద్ద మోతెబరులు లైన్కడ్తున్నరు. మా ఊర్ల పడ్డ దొంగల్లెక్కనే పొద్దటిపూట మంచి మంచి ఏషాలేస్తూ వస్తున్న ఉత్తరమోళ్లు మన ఇంటిని దోసుకతినే వరకు తెల్వదు ఆళ్ల అసలు రంగు. తెలంగాణల కూడా కొంతమంది గా ఉత్తరమోళ్ల మాయల పడి ఆళ్ల మాటలు నమ్మి కాళ్ల చెప్పులు మోస్తూ అగుడు పడుతుండ్రు. ఇగ గాళ్లు అగుడు పడింది గాక అందరిని అగుడు పడేటట్లు చేస్తుండ్రు. గిసోంటి టైంలనే మనం అగుడు పడకుండా ఉండాలె. అగుడు పడితే ఆగమైతం.. తెలంగాణ ప్రజల మనస్తత్వమే అసోంటిది. ఎవడన్న కొత్తోడొచ్చి ఏదైనా చెప్తే వాడిలోని మంచిని చూస్తాం కానీ చెడును అంత జల్ది గుర్తుపట్టం. అట్లనుకొని ఎవడన్న మోసం చేసినా ఉరుకునేది లేదు అనేటట్లుంటరు. ఆగమైతున్నమని తేరుకుంటే మాత్రం తెగించి కొట్లాడుడు తెలుసు. రైతులను సతాయించిన నిజాం దొరలపై సాయిధ పోరాటం చేసిన తెలంగాణ గడ్డ ఇది. ఆంధ్రోళ్లనూ పొలిమేర దాటేవరకు ఉరికిచ్చనం. ఇప్పుడు వచ్చే ఉత్తరమోన్ని కూడా ఉరికిస్తం. కనీ అంతవరకు రాకుండా ఆనికి సందియ్యకపోతే మన రాష్ట్రం సంతోషం గుంటది కదా? ఇన్ని దినాలు మన ఇంటిని దోసుకున్నోళ్ల కథ వేరే ఉండే, ఇప్పుడు మనతానికి వస్తున్న ఉత్తరమోళ్ల కథ వేరేగా ఉంటది. ఈళ్లు దోసుకునేడే కాదు, దోస్తుల నడుమ చిచ్చుపెడ్తరు, అన్నదమ్ములను ఇడగొడ్తరు, గంగా జమున తహ్జీబ్ను గంగల కలుపుతరు. గందుకే మల్లొకసారి చెప్తున్నా… కాషాయం ఎర జూపి, కషాయాన్ని నింపుతున్నరు. కాబట్టి, నిమ్మలంగ ఉన్న తెలంగాణను నిప్కల మీద పెట్టొద్దు. మనం అగుడు పడొద్దు, తెలంగాణను ఆగం గానియ్యొద్దు.
ఖాజా అఫ్రీది
83414 76364