రాజకీయ నాయకులు అభివృద్ధి, సంక్షేమం పేరిట ప్రజల వద్దకు వెళ్లి ఓట్లు అడగడం సహజ ప్రక్రియ. అయితే చెప్పిన పనులు చేయడం, ఇచ్చిన హామీలు నెరవేర్చడం చాలా కష్టమైన పని. అందుకే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజల దృష్టిని మళ్లించి మతపరమైన అంశాలను మాత్రమే ప్రస్తావిస్తూ రాజకీయం చేస్తున్నది. అందులో భాగంగానే ప్రతి విషయాన్నీ మతంతో ముడిపెట్టే ప్రయత్నం చేస్తున్నది. అందుకు తగ్గట్లుగానే ఆ నాయకుల ప్రచారం కూడా ఉంటున్నది. 2014 నుంచే బీజేపీ ఈ విధానం అమలుచేస్తున్నా, రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది మరింత ఉధృతమైంది.
భారత ప్రజల తలసరి ఆదాయం 2014లో 1,574 డాలర్లు ఉంటే 2021లో 1,935 డాలర్లు ఉన్నది. ఈ ఏడేండ్లలో 22 శాతం పెరుగుదల మాత్రమే నమోదైంది. అయితే ద్రవ్యోల్బణం సగటున 5-8 శాతం పెరుగుతూ పోయింది. పెరిగిన ద్రవ్యోల్బణం కారణంగా ప్రజల నిజమైన ఆదాయం పెరగలేదు.2022 కల్లా రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామన్న హామీ గురించి మోదీ ప్రభుత్వానికి ఆలోచనే లేదు. ఎకరాకు రూ.2 వేల చొప్పున 3 ఎకరాల వరకు ఉన్న రైతులకు రూ.6 వేలు ఇస్తున్న కేంద్రం,ఎరువులు, డీజిల్ ధర పెంపుతో సగటున ఎకరానికి రూ.3 వేల ఖర్చు పెంచింది.
కొన్ని మతాలను లక్ష్యం చేసుకొని ప్రజల మధ్య విభేదాలు, విద్వేషాలు సృష్టిస్తారు. ఆ ప్రక్రియలో ఊహాజనిత భయాలను సృష్టిస్తారు. ఫలానా మతం వారు అన్ని అవకాశాలను కొల్లగొడతారని, అన్ని వ్యాపారాలను హస్తగతం చేసుకుంటారని చెప్తారు. ఈ విద్వేష ఎజెండానే నింపుకొన్న బీజేపీ అధికార ప్రతినిధులు ఇద్దరు ప్రవక్తపై వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలపై దాదాపు 20 దేశాలు నిరసన తెలిపాయి. నష్టనివారణ చర్యల్లో భాగంగా వారిద్దరిని బీజేపీ తొలగించింది. ప్రతి దేశాన్ని, ప్రతి మతాన్ని ఇలాగే గేలి చేస్తూ, తిరస్కరిస్తూ, అదే గొప్ప అలవాటని ఇక్కడి వారి సానుభూతిపరులను ఏమార్చే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈసారి ఇతర దేశాలు ఆగ్రహం వ్యక్తం చేసేసరికి తోకముడవక తప్పలేదు. కానీ ఆ గాయం అంత తొందరగా మానేది కాదు. ఆ వ్యాఖ్యల వల్ల దాదాపు 13 కోట్ల మంది ప్రవాస భారతీయుల ప్రాణాలు, జీవనోపాధి ప్రమాదంలో పడే ఆస్కారం ఉన్నది.
ఈరోజు చాలా విషయాల్లో చైనాను బూచిగా చూపిస్తారు. అదే చైనా నుంచి భారత్కు ఏటా దిగుమతులు పెరుగుతున్నాయి. చైనా ఇండియాపై దూకుడుగా వ్యవహరిస్తున్నా వారిపై ఆధారపడటాన్ని తగ్గించుకోలేకపోవడం భారత ప్రభుత్వ వైఫల్యం. ఈ వాస్తవ సమస్యలను మర్చిపోయేలా ఊహాజనిత భయాలను సజీవంగా ఉంచడానికి రోజుకో కొత్త అంశాన్ని తవ్వితీస్తారు. ఆ భావోద్వేగ ప్రచార హెూరులో అసలు అంశాలు, ప్రజల జీవన ప్రమాణాల పెంపుదలకు, అభివృద్ధికి అవసరమైన అంశాలు వెనక్కి నెట్టబడుతాయి. ఈ విషయంలో కొన్ని ప్రధాన స్రవంతి మీడియా సంస్థలు కూడా తమ వంతు సహకారం అందిస్తున్నాయి.
యూపీలోని జ్ఞాన్వాపి మసీదు అంశంపై అనేక చర్చలు పెట్టిన మీడియా, డాలర్తో పోలిస్తే రూపాయి విలువ జీవితకాల కనిష్ఠానికి పడిపోయిన విషయాన్ని కనీసం ప్రస్తావించలేదు.
పెట్రోల్, డీజిల్, సిలిండర్ ధరలు ప్రపంచంలోని అన్నిదేశాల్లో కెల్లా మన దేశంలోనే ఎక్కువ ఉన్నాయి. ఎందుకు పేద, మధ్యతరగతి ప్రజలపై ఈ విధంగా భారం వేస్తున్నారని సోషల్ మీడియాలో నిరంతర విమర్శలు రావడం వల్ల ఈ మధ్య కొంతమేర తగ్గించారు. తగ్గించింది చాలా తక్కువే. సిలిండర్ ధరను రూ.400 నుంచి రూ.1,050లకు పెంచి ఇప్పుడు ‘ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం’లో సిలిండర్ తీసుకున్నవారికి మాత్రమే రూ.200 రూపాయలు సబ్సిడీ ఇవ్వాలని నిర్ణయించారు. అయితే దాదాపు 19 కోట్ల మందికి ఇదివరకు సిలిండర్ సబ్సిడీ దాదాపు రూ.400 వచ్చేది. ఇప్పుడు కేవలం 9 కోట్ల మందికి మాత్రమే అది కూడా రూ.200 మాత్రమే ఇవ్వాలని నిర్ణయించారు.
మే, జూన్లలో రెండుసార్లు రుణాలపై ఆర్బీఐ వడ్డీ రేట్లు పెంచిం ది. దీంతో ఇంటి రుణాలు, వాహన, వ్యక్తిగత రుణాలు, ఈఎంఐలు చాలా భారమయ్యాయి. ఈ రోజుల్లో కనీసం 20-25 లక్షల హెూం లోన్ చాలామంది తీసుకుంటారు. 20 ఏండ్ల లోన్పై కనీసం 3-4 లక్షల అదనపు భారం! మేలో పెంచిన రేట్లతో కూడా కలుపుకొంటే అదనపు భారం 5-6 లక్షలు ఒకవైపు వడ్డీ రేట్లను ఆర్బీఐ పెంచుతుంటే, మరోవైపు ఈపీఎఫ్ సంస్థ కార్మికులు, ఉద్యోగులు దాచుకునే డబ్బుపై వార్షిక వడ్డీని8.1 శాతానికి తగ్గించింది. గత 45 ఏండ్లలో ఇది అత్యల్పం. పెరుగుతున్న ధరలు, తరుగుతున్న జీవన ప్రమాణాలు, ఇవి ప్రజల వాస్తవ జీవన బాధలు. ఈ వాస్తవిక బాధలు, అంశాల మీద ఎవరు ప్రశ్నించొద్దనే ఉద్దేశంతో ఎవరు ఏ అంశంపై ప్రశ్నించినా వారు హిందుత్వ వ్యతిరేకులు, దేశ ద్రోహులనే విమర్శ చేస్తున్నది బీజేపీ. అలాగే వారి ఐటీ సెల్ కూడా ఇదే లైన్తో ఆన్లైన్లో ట్రోల్ చేస్తున్నది.
ఊహాజనిత భయాలను ప్రచారం చేసి ప్రజల వాస్తవ బాధలను ఏండ్ల తరబడి ఎవ రు కూడా కప్పిపెట్టలేరు కాబట్టి వాటిని కట్టిపెట్టి ప్రజలకు పనికొచ్చే పనుల వైపు కేంద్రం ఎంత తొందరగా దృష్టిపెడితే అంతమంచిది. రాష్ర్టాలతో కలిసి టీమిండియాగా కలిసి పనిచేస్తామన్న మాటలను కేంద్రం ఇకనైనా నిజం చేయాలి.
-ప్రశాంత్ సాగి
70955 83999