పశులు అంటే ఆయనకు ప్రాణం. చెట్టు, చేమ అంటే ఆయనకు శ్వాస. మట్టితోనే ఆయన జీవితం. తూరుపు తెలవారుతుండగానే వేపపుల్లేసుకొని ఇంటి నుంచి ఎల్లిండంటే.. పొద్దుగూకినంకనే ఇంటి ముఖం చూస్తుండే. ఊరంటే ప్రేమ. ఊరోళ్లకు ఆత్మీయుడు. ఆపదొస్తే అందరికీ అండ. ఆయనే మా బాపు చిటుకుల నర్సారెడ్డి. అందరికి ఆత్మబంధువు బర్లకాడి నర్సయ్య. సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం రుదొడ్డి మండలం మల్లుపల్లి మాది.
ఊర్లోని దాదాపు 200 బర్ల కాపరి. వానొచ్చినా, ఎండొచ్చినా పొద్దూక చెట్టు, పుట్ట పట్టుకొని తిరుగుతూ బర్లు కాస్తుండే. ఎవరి ఇంటి బర్లు వాళ్ళింటికి తోలేటోడు. బాపు ఇంటికి రాంగానే కాళ్ళు చేతులు కడుక్కొని పెద్ద పీట మీద ఒరుగుతుండే. రాత్రి 8 కాగానే తిని పడుకునుడు. తెల్లవారుతుండగానే బర్ల మంద మఠం బలిజోల్ల చింత చెట్ల దగ్గరకు పోవు. అన్ని బర్లు రాగానే చెరువు, పెరండ్లు, పొలాల దిక్కు మేతకు తోల్కపోవు. 12 అయిందంటే మళ్ళీ బర్లన్నీ మందకు వచ్చు. అప్పటికే అమ్మ సద్ది తీసుకుని వచ్చు. సద్ది తిని ఓ గంట చెట్టు దగ్గర ఒరుగుతుండె. మధ్యాహ్నం రెండున్నర మూడు ప్రాంతంలో మళ్ళీ బర్లను మేతకు తీస్కపోవు. మంద దగ్గర బర్ల పెండను అమ్మ, నేను కుప్పేసి ఇంటికెళ్ళేది.
బాపు బర్లను ఊరు పొలిమేర లోట్లమర్రి, కాశిమ్ చెరువు, పెద్ద చెరువు, నలసముద్రం కుంట, మామిడి తోట దిక్కు, పెద్ద చెప్యాల, రుద్రారం వీరారెడ్డిపల్లి, గాజులపల్లి పొలిమేర్ల దాకా తిప్పుకొంటు చీకటి పడగానే ఊర్లకు పంపు. అప్పటికే పంచాయతీ దగ్గర చౌరస్తాలో ఉన్న బర్ల యజమానులు తమ బర్లు రాగానే ఇంటికి తీసుకెల్దురు. ఇట్ల బాపు 25 ఏండ్లు బర్లు కాసిండు. ఆయన కష్టం ఎవరికీ రావద్దు.
తెలంగాణలో సంక్రాంతి పండుగ ప్రత్యేకమైనది. పనిముట్లు, పశువులను పూజించే వ్యవసాయ సంస్కృతి. కనుమ రోజున ఆవులు, దూడలు, ఎద్దుల్ని కడిగి కొమ్ములకు నూనెరాసి, ముఖానికి పసుపు పూసి కుంకుమ పెడ్తరు.
సాయంకాలం పశువుల మీద మంచి నీటిని చిలకరిస్తరు. పశులు సాయంకాలం ఇంటికి రావడాన్ని లక్ష్మి వచ్చినట్లు ఆనందపడ్తరు. ఆ రోజు పశులకు పండుగ పూట వండిన నైవేద్యం పెడ్తరు. పాకలను శుభ్రం చేసి అక్కడే భోజనం చేస్తరు. శాకాహారులైతే బియ్యం, పప్పుదినుసులు, కూరగాయలు అన్నీ ఇంటికి తీసుకువెళ్ళి వండుకుంటరు. వ్యవసాయదారుడికి పశువులే ధనం. పంట చేతికి వచ్చిన సందర్భంగా కృతజ్ఞతగా వాటికి కొత్త బియ్యంతో పరమాన్నం వండిపెడుతరు.
40 ఏండ్ల కిందట గత్తర వచ్చి జనం ఎంతో ఇబ్బందులు పడ్డరు. నీళ్ళు లేక, ఎవసం నడవక, ఏదైనా పని చేసుకుందాం అంటే ఎన్నో కష్టాలు పడ్డ రోజులవి. అందులో మా బాపు జీవితం కూడా కష్టాల కడలి. ఎంత బాదొచ్చినా తన మనసులో పెట్టుకొను. పిల్లలు ఇబ్బందులు పడ్తరని మాకు చెప్పక పోవు. కరువు కాలంలో బాయిలు, సడాకులు తొవ్వారు బాపు, అమ్మ. అప్పుడు మా అక్క, అన్న, నేను, చెల్లె చిన్నోళ్లం. గుత్త పట్టుకుని బావులు తొవ్విండు.
ఉన్నది ఒక ఎకరం. వానలు పడ్డప్పుడు తప్ప ఎప్పుడూ పంట పండింది లేదు. కాంచెరువు (కాశీమ్ చెరువు) నిండిన్నాడు ఇంత పంట పండేది. బాయిలో నీళ్ళు లేకపోవు. కాంచెరువుతో బాయిలోకి ఇంత ఊట వచ్చు. బాయిలో జెర నీళ్లు ఊరగానే బాపు, అమ్మ యాతమేసి ఎత్తి పోద్దురు. బాయిల నీళ్లు లేకపోతే బర్ల కాస్తూ ఆర్నెల్లకు ఒక్కసారి వచ్చే డబ్బులతో జీవితం నెట్టుకొచ్చేది. బాపు కు చాతకాకుంటే అమ్మ, నేను బర్లను కాస్తుంటిమి.
సంక్రాంతి అంటే బాపు చేసే కాట్రావుల (పశువుల) పండుగ యాదికొస్తది. సంక్రాంతికి వారం ముందు ఈ పండుగ చేసుకుందురు. ఈ పండుగ రోజు ఇంట్లో వాళ్ళం అందరం బియ్యం, కూరగాయలు, పప్పు దినుసులు, ఇంత మాంసాహారం తీసుకుని బాపు ఎంబడి బర్లకాడికి పొదుము. పెద్ద చెరువులోని బంకమట్టి తెచ్చి పశువుల బొమ్మలు చేద్దుము. ఓ చెట్టు కింద పందిరి వేసి మామిడి తోరణాలు, బంతి పూల దండలు కట్టి మట్టితో చేసిన పశువులను అందులో ఉంచి వాటికి బొట్టు, పసుపు నూనె రాసి.. దీపం ముట్టించి.. అమ్మ చేసిన పరమాన్నం పెడుదుము.
పండుగ నాడు బాపు బర్లను, దూడలను అన్నింటినీ పెద్ద చెరువులో మంచిగా కడుగు. వాటికి బొట్లు పెట్టి కొమ్ములకు పసుపు నూనె రాసి పసుపు కుంకుమలతో అరచేతి ముద్రలు వాటిపై వేద్దుము. మామిడి తోరణాల కింది నుంచి బర్ల మందను దాటిద్దుము.
బాపు చనిపోయి 18 ఏండ్లు అవుతున్నది. సంక్రాంతి వచ్చిందంటే బాపు చేసే కాట్రావుల పండుగా యాదికొస్తది. మొన్న 2020 నవంబర్లో అమ్మ కాలం చేసింది. బాపు లేనప్పుడు అమ్మతోని కల్సి సంక్రాంతి పండుగ చేసుకునేది. ఇప్పుడు బాపు, అమ్మ కూడా లేరు. ఆ వెలితి. జీవం అంత గుంజేసినట్లు ఉంది.
ఇయ్యల్ల సంక్రాంతి శోభకు కేసీఆర్ రైతు బంధు పండుగ సంబురాలు తోడైనయ్. పల్లెలన్ని పండుగ వాతావరణంలో కోలాహలంగా కనిపిస్తున్నయి. అరువై ఏండ్ల వలస పాలనలో రైతు బతుకు ఎట్లుండే. ఈ ఏడేండ్ల కేసీఆర్ పాలనలో రైతులు ఎంత సంతోషంగా ఉన్నరు!
నాటి రైతు కాట్రావుల పండుగ నేటి రైతు బంధు పండుగతో సంక్రాంతి అంబరాన్ని అంటింది. మా బాపు ఇప్పుడు ఉంటే కేసీఆర్ రైతు బంధు సంక్రాంతి పండుగ సంబురాల్లో పాలుపంచుకుని సంతోషించేవాడు.
చిటుకుల మైసారెడ్డి
94905 24724