వాడుక భాష కారణంగా సామాన్యుడు సాహిత్యానికి దగ్గరవుతున్న సమయంలో వచన రచనకు ప్రాధాన్యం పెరిగింది. అచ్చు యంత్రాలు రావటం, పత్రికలు స్థాపించబడటంతో వచన రచనకు ఇంకా ప్రాధాన్యం పెరిగింది. అటువంటి సమయంలోనే వచన ప్రక్రియ అయిన ‘వ్యాసం’ విస్తృతమైంది. వ్యాసాలు వివిధ
విషయాలను బట్టి అనేక రకాలుగా చెప్పబడ్డాయి. సామాజిక వ్యాసాలు, రాజకీయ వ్యాసాలు, సంపాదకీయాలు, వేదాంత విషయ వ్యాసాలు, సాహిత్య వ్యాసాలు, సాహిత్య విమర్శ వ్యాసాలు, హాస్య వ్యాసాలు మొదలైన అంశాలతో ఆధునికకాలంలో ‘వ్యాసం’ ప్రాధాన్యం పొందింది. అతి దీర్ఘంగా కాకుండా సంగ్రహంగా, క్లుప్తంగా చెప్పదల్చుకున్న విషయాన్ని నిర్దిష్టంగా, స్పష్టంగా చెప్పటం ‘వ్యాస’ లక్షణం. అయితే విషయ గాంభీర్యం ఉండటం వ్యాసానికి ప్రధాన లక్షణం.
తెలుగులో మొట్టమొదటి వ్యాసరచన చేసిన రచయిత సామినేని ముద్దు నరసింహనాయుడు. ఆయన సంఘసంస్కరణ భావాలు గల వ్యాసాలను ‘ప్రమేయాలు’ పేరుతో ‘హితసూచని’ గ్రంథంగా ప్రచురించారు. కానీ వీరేశలింగం పంతులుతోనే వ్యాసరచన విస్తృతి జరిగింది. సంఘసంస్కరణ భావాలు గల సామాజిక వ్యాసాలను ఆయన విస్తృతంగా రచించాడు. ఆ తర్వాత గిడుగు రామమూర్తి, పానుగంటి, ముట్నూరి కృష్ణారావు వంటి వారి రచనలతో వ్యాసం విరాట్ రూపాన్ని సంతరించుకున్నది. వ్యాసంలో పెట్టనటువంటి విజ్ఞానం లేదు. సులభశైలి, విషయాన్ని నిరాడంబరంగా చెప్పడం ఉంటుంది కాబట్టి వ్యాసం అందరి మన్ననలను పొందింది.
తెలంగాణ ప్రాంతంలో వ్యాసరచన పత్రికల స్థాపనతోనే జరిగింది. ‘హితబోధిని’, ‘నీలగిరి’, ‘తెనుగు’ వంటి మొదటి నాళ్లలో వచ్చిన పత్రికల్లో విద్య, వైద్యం, వ్యవసాయం, సామాజిక సంఘర్షణలు, సంఘ సంస్కరణ భావాలు కలిగిన వ్యాసాలు ప్రచురింపబడినాయి. 1926లో ‘గోల్కొండ పత్రిక’ స్థాపించబడిన తర్వాత వ్యాసరచన తెలంగాణలో విస్తృతంగా జరిగింది. వార్తలను రాసే పాత్రికేయులు వివిధ విషయాలకు సంబంధించిన వ్యాసాలు రాసే అవసరం ఏర్పడినప్పుడు సురవరం ప్రతాపరెడ్డి ఎంతోమంది పాత్రికేయులను, వ్యాస రచయితలను తయారుచేశారు. దేవులపల్లి రామానుజరావు, కోదాటి నారాయణరావు, భాస్కరభట్ల కృష్ణారావు, పి.వెంకటరమణయ్య వంటివారు వ్యాస రచయితలుగా తయారైండ్రు. ఆ తొలితరం వారు అందించిన స్ఫూర్తితో తర్వాతికాలంలో జయసూర్య, సురమౌళి, వరదాచారి, రాఘవాచారి, బుక్కపట్నం రామానుజాచార్యులు పాత్రికేయులుగా, వ్యాస రచయితలుగా వ్యాస ప్రక్రియను పరిపుష్టం చేశారు. వ్యావహారిక భాషోద్యమంతో ఈ రచయితలందరూ ప్రజల భాషల్లోనే వ్యాసాలను, వార్తలను రచించారు. సురవరం వారి ప్రేరణతో వి.ఆర్. అవధాని, ఎల్లాప్రెగడ సీతాకుమారి వంటి రచయితలు వ్యాసరచనలు చేశారు.
తర్వాతికాలంలో కొమర్రాజు లక్ష్మణరావు పంతులు, మాడపాటి హన్మంతరావు, ఆదిరాజు వీరభద్రరావు, బిరుదురాజు, దాశరథి మొదలైన వారెందరో చరిత్ర పరిశోధన, సాహిత్య పరిశోధన, సామాజిక, రాజకీయ సంబంధమైన వ్యాసాలను రచించారు. 1956లో వట్టికోట ఆళ్వారుస్వామి తన ‘దేశోద్ధారక గ్రంథ మండలి’ పక్షాన ‘తెలంగాణ’ అనే వ్యాస సంపుటిని ప్రచురించారు. ఇది తెలంగాణ వ్యాస రచయితలందరి రచనలతో సుసంపన్నమైం ది. దీనిలో చారిత్రక, సాహిత్య, జానపద, రాజకీయ, పారిశ్రామిక, భూ సమస్య, ప్రజా ఉద్యమాలకు సంబంధించి 32 వ్యాసాలున్నాయి. ఈ గ్రంథం తెలంగాణ వ్యాసరచన కృషికి నిదర్శనం. నాటకం, నాటికలు తెలంగాణ ప్రాంతంలో ఆధునిక కాలంలో రచింపబడి ప్రదర్శింపబడుతున్నాయి. ఆంధ్రా ప్రాంతంలో బొంబాయి నుంచి రంగస్థల
నాటక కంపెనీలు వచ్చి 19వ శతాబ్దం పూర్వార్ధంలో ప్రదర్శించేవారు. అప్పుడే ‘కృష్ణార్జున సంవాదం’, ‘హరిశ్చంద్ర’, ‘పాండవోద్యోగం’ వంటి నాటకాలెన్నో అక్కడ విస్తృతంగా ప్రదర్శింపబడి ప్రచారం పొందాయి. అనేక మంది కవులు ప్రదర్శనల కోసం నాటకాలు రచించారు. సంస్కృత సాహిత్యాన్ని పరిశీలించిన ట్లయితే.. భారతదేశంలో క్రీస్తుపూర్వం నుంచే గ్రీకు దేశంలో లాగా నాటక రచనలు, ప్రదర్శనలున్నాయి. రాజ భవనాలలో నాటకాలు ప్రదర్శింపబడటమే గాక, ప్రత్యేకంగా నాటక ప్రదర్శనల కోసం నాటకశాలలు ఉండేవి. దేవతా ఉత్సవాలు, తిరణాల సమయాల్లో నాటకాలను ప్రదర్శించేవారు.
సమాజంలోని ఉన్నత కులీన వర్గం వారు ఆ నాటకాలను దర్శించటం వల్లనో ఏమో తెలుగులో ఆధునిక కాలం వరకు నాటకాలు రాయటం జరగలేదు. సంస్కృతంలో కొన్ని నాటకాలను మన కవులు కావ్యాలుగానే రచించారు. నాటకాల జోలికి పోలేదు.
తెలంగాణలోకి బొంబాయి నాటక కంపెనీలు రాలేదు. కాబట్టి ఇక్కడ రంగస్థల నాటకాల ప్రదర్శనలు జరగలేదు. ఇంకొకటి- ఈ ప్రాంతాన్ని ముస్లిం రాజులు పరిపాలిస్తున్నారు. కాబట్టి వాళ్లు ఈ ప్రదర్శన కళలకు, సంగీతం, చిత్ర, శిల్ప కళలకు ప్రోత్సాహం లేకుండాపోయింది. కానీ తెలంగాణ గ్రామాల్లో ‘చిందు భాగవతులు’, ‘పాండవులోల్లు’, ‘దాసరి’వాళ్ల నాటక ప్రదర్శనలు అతి ప్రాచీన సంప్రదాయంగా కొనసాగుతూ ఉండేవి. ప్రజలు ఆ నాటకాలను ఎగబడి చూసేవాళ్లు. ఇవే గాక నాడు ‘తోలుబొమ్మలాటలు’ ఉండేవి. అవి ప్రజలకు జనరంజకంగా ఉండేవి.
– ముదిగంటి సుజాతారెడ్డి
99634 31606