తమిళనాడుకు చెందిన కాంచీపుర సమీపంలోనిది సింహవక్త నగరం. అక్కడ పుట్టిన దిగ్నాగుడు తెలంగాణకు చెందిన జగిత్యాల జిల్లాలోని కుగ్రామం పాశిగామలో సక స్థిరపడ్డాడు. బౌద్ధ సాహిత్య చరిత్ర పుటల్లో దిగ్నాగుడికొక విశిష్టస్థానమున్నది. ఆయన రచనలు ఎందరో బౌద్ధ బిక్షువులకు మార్గదర్శకాలయ్యాయి. ఈ విజ్ఞానఖని పాశిగామ గ్రామాన్ని తన కార్యస్థలిగా చేసుకొని పలు రచనలు చేశాడని సుప్రసిద్ధ చరిత్ర పరిశోధకుడు డా.వి.వి క్రిష్ణశాస్త్రి తెలిపారు.
తర్కశాస్త్ర సిద్ధాంతకర్తగా దిగ్నాగుడు చేసిన కృషి వల్ల ఆయనకు భారతీయ తర్క శాస్త్ర పితామహుడిగా గుర్తింపు లభించింది. అయితే ఆయన జన్మస్థలి తమిళనాడులో మాత్రం ఆయనకు ఆదరణ లభించలేదు. అందువల్ల వివిధ ప్రదేశాలను పరిశీలిస్తూ మన తెలంగాణలోని ప్రస్తుత జగిత్యాల జిల్లాకు చెందిన పాశిగామను తన కార్య క్షేత్రంగా మలచుకొన్నాడు.
దిగ్నాగుడు వందకు పైగా రచనలు చేశాడని ప్రతీతి. అయితే అందులో ముఖ్యంగా చెప్పుకోతగ్గవి ప్రమాణ సముచ్చయ, హేతుచక్ర, ఆలంబన పరీక్ష, అభిధర్మకోశ, మర్మ ప్రదీపిక, త్రికాల పరీక్ష,. న్యాయముఖ. ఇం దులో ప్రమాణ సముచ్ఛయ అన్న గ్రంథం ఆయన తార్కిక సిద్ధాంతాన్ని విశదంగా వివరిస్తుంది. దిగ్నాగు డి రచనలన్నీ సంస్కృతంలో సాగాయి. అయితే ఆయ న మూల రచనలేవీ ప్రస్తుతం లభ్యం కావడం లేదు. కానీ అవన్నీ చైనీస్ , టిబెటన్ భాషల్లోకి అనువదించబడ్డాయి. దిగ్నాగుడి సిద్ధాంతాలను అర్థం చేసుకోవడం కోసం చాలామంది పరిశోధకులు చైనీస్ అనువాదాలమీద ఆధారపడుతున్నారు. అంతేగాక తరువాతి కాలానికి చెందిన ఆచార్య ధర్మకీర్తి రచనల ద్వారా దిగ్నాగుడి సిద్ధాంతాలను అర్థం చేసుకొంటున్నారు.
జ్ఞ్ఞాన సముపార్జన రెండు ప్రమాణాలమీద ఆధారపడివుంటుందని దిగ్నాగుడి తర్కసిద్ధాంతం తెలియజేస్తుంది. అవి ప్రత్యక్ష, అనుమాన ప్రమాణాలు. ఇందు లో ప్రత్యక్ష ప్రమాణం ఇంద్రియాల నుపయోగించి పొందే జ్ఞానం. అంటే కంటికి కనిపించేవి, చెవులకు వినిపించేవి లేదా స్పర్శవల్ల తెలిసేవి. ఇక రెండవ ప్రమాణం గత అనుభవాల ద్వారా అనుమానించడంవల్ల కలిగే ఙ్ఞానం. తార్కిక సిద్ధాంతానికి ఇవే మూల స్తంభాలు.హేతువాద సిద్ధాంతానికి, దిగ్నాగుడి తర్కవాద సిద్ధాంతానికి సారూప్యత గోచరిస్తున్నది. ఒకవిధంగా చెప్పాలంటే ప్రపంచానికే తర్కవాదాన్ని పరిచయం చేసిన మహాపురుషుడు దిగ్నాగుడు.
దిగ్నాగుడి కార్యక్షేత్రమైన పాశిగామ ఒక పరమ పావనమైన బౌద్ధక్షేత్రం. తెలంగాణకు చెందిన జగిత్యాల జిల్లాలోని ఈ పల్లె కరీంనగర్ లక్సెట్టిపేట బస్సుమార్గంలో కరీంనగర్ కు 52 కి.మీ., లక్సెట్టిపేటకు 14 కి.మీ దూరంలో ఉన్నది. శాతవాహనుల తొలి రాజధాని కోటిలింగాలకు అతి చేరువలో ఉన్నందువల్ల, కోటిలింగాలతో పాటు పాశిగామలోను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పురావస్తు శాఖ అధ్వర్యంలో తవ్వకాలు జరిగాయి. పాశిగామలో జరిపిన తవ్వకాలలో బౌద్ధ మత ఆనవాళ్ళు ఎన్నో లభించాయి. అయితే అవన్నీ 1999లో జరిగిన కరీంనగర్ లక్సెట్టిపేట రోడ్డు విస్తరణలో కూల్చివేయ బడ్డాయి. అయితే కొందరు చరిత్రకారుల కృషి వల్ల ముక్కలైన ఆ స్థూప ఫలకాలను చేర్చికరీంనగర్ జిల్లాకేంద్ర పురావస్తు శాఖ మ్యూజియంలో తిరిగి స్థాపించడం జరిగింది.
ఇక బంగారు తెలంగాణయే లక్ష్యంగా కృషి చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం ఎంతో విశిష్ట చరిత్రను కలిగివున్న పాశిగామను ఒక గొప్ప బౌద్ధ క్షేత్రంగా తీర్చిదిద్దగలిగితే మరుగున పడిపోయిన ఈ పల్లె ఘన చరిత్ర పునరుజ్జీవనాన్ని పొందుతుంది. బౌద్ధ మతాభిమానులను ఆకర్షించి ఒక గొప్ప యాత్రా స్థలిగా మారే అవకాశముంది.
బసవరాజు నరేందర్రావు: 99085 16549